క్యాన్సర్‌కు ఆయుర్‌శక్తి

25 May, 2018 00:33 IST|Sakshi

రోగులకు ‘ఆయుర్వే’ సీఈవో శరత్‌ అద్దంకి భరోసా

మొదట్లో ఆయన కంప్యూటర్‌ ఇంజనీర్‌. యువ ఎంటర్‌ప్రెన్యూర్‌ కూడా. కానీ అకస్మాత్తుగా ఆరోగ్యరంగం వైపునకు పయనం ప్రారంభించారు. ముఖ్యంగా క్యాన్సర్‌ రోగుల బాధలనూ, వెతలనూ తగ్గించాలని సంకల్పించారు.  అందుకోసం  ‘కాలిఫోర్నియా కాలేజ్‌ ఆఫ్‌ ఆయుర్వేదా’ నుంచి పట్టా పొందారు. అమెరికాలో, భారత్‌లో ‘రాధాస్‌ ఆయుర్వే’ అనే సంస్థను ఏర్పాటు చేసి ఆయుర్వేదం, వెస్ట్రన్‌ హెర్బాలజీ, యోగా, ధ్యానం, అరోమా థెరపీ, మర్మచికిత్స, మర్దన చికిత్స, సౌండ్‌ థెరపీ, కలర్‌ థెరపీలతో అనేకమంది కేన్సర్‌ బాధితులకు సాంత్వన కలిగిస్తున్నారు. ఇటీవల ఆమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఈ నెల 13న పెద్దఎత్తున అవగాహన సదస్సు నిర్వహించారాయన. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 

∙మీరు వైద్యరంగం వైపు, అందునా క్యాన్సర్‌ వైపునకు  దృష్టి సారించడానికి కారణం? 
శరత్‌ అద్దంకి:  మా అమ్మ రొమ్ముక్యాన్సర్‌తో బాధపడుతూ  13 మే 2015న మరణించారు. చికిత్సలన్నీ సరిగానే అందాయి. కీమో తీసుకున్నారు. అంతా బాగానే ఉన్నా ఆమె కన్నుమూశారు. ఎందుకు జరిగింది? ఈ ప్రశ్న నన్ను వేధించింది. ఆమె విషయంలో ఏం లోపం జరిగిందన్న ఆలోచనే నేను చాలా అంశాలను అధ్యయనం చేసేలా పురిగొల్పింది. దాంతో చాలా విషయాలు తెలిశాయి. 

∙మీ అధ్యయనంలో మీకు తెలిసివచ్చిన అంశాలు...
శరత్‌: కీమోథెరపీ అంటే రసాయనాలతో క్యాన్సర్‌ కణాలని తుదముట్టించే ప్రక్రియ. ఈ విషయం మనకు తెలిసిందే. మన ఒంట్లోకి రసాయనాలు ప్రవేశించినప్పుడు వాటితో పాటు వాటి విషప్రభావాలూ చేరుతాయి.  మన శరీరంలోని విషాలను విరిచేసి, బయటకు పంపాల్సిన తొలి బాధ్యత కాలేయానిది. మలి బాధ్యత మూత్రపిండాలది. దాంతో ఈ రెండూ అమితంగా కష్టపడతాయి. కానీ వాటికీ ఒక పరిమితి ఉంటుంది కదా. అంతగా పనిచేశాక కూడా ఒంట్లోని విషాలను పూర్తిగా బయటకు పంపలేనప్పుడు అవి ఒంట్లోనే పేరుకుపోతాయి. సరిగ్గా ఇందువల్లనే మనకు కీమో దుష్ప్రభావాలు అనేక రూపాల్లో కనిపిస్తుంటాయి. అంటే వికారం, వాంతులు, ఒళ్లంతా నల్లబడిపోవడం, జుట్టురాలిపోవడం ఇలా. వీటినే మనం సైడ్‌ఎఫెక్ట్స్‌ అంటుంటాం. క్యాన్సర్‌ రోగులు చికిత్సకు బాగానే స్పందిస్తారు. కానీ చికిత్స తాలూకు దుష్ప్రభావాలతోనే కన్నుమూస్తారు. ఇది ఇకపై ఇలా జరగకూడదని నేను సంకల్పించాను. అందుకోసం పరిష్కారాలను ఆయుర్వేదంలో వెతికాను. 

∙మరి ఆయుర్వేదంలో ఆ పరిష్కారాలు కనిపిం చాయా? 
శరత్‌: కచ్చితంగా!  కీమో తీసుకుంటున్న ప్రతివారూ చాలా బలహీనంగా మారిపోతారు. బలంగా మారడానికి వాళ్లు బాగా తినాలి.  తిన్నా క్యాన్సర్‌ మందుల సైడ్‌ఎఫెక్ట్స్‌తో వాంతులవుతాయి. తిన్నదేమీ కడుపులో ఉండదు. అలాంటి ఎన్నో సమస్యలకు ఆయుర్వేదంతో పాటు కొంత మూలికా చికిత్స (హెర్బల్‌ మెడిసిన్‌) మార్గం చూపుతుంది. తొలుత వికారాన్ని తగ్గించి రోగులు బాగా తినేలా చేస్తుంది. దాంతో తిన్నది వంటబడుతుంది. ఫలితంగా రోగులు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుని క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కోగలుగుతారు. మా దగ్గర లభించే కొన్ని రకాల ఔషధాలు... కాలేయాన్నీ, మూత్రపిండాలనూ ఇంకా చాలా కీలక అవయవాలను దృఢతరం చేస్తాయి. కీమోను బలంగా తట్టుకోగలిగేలా చేస్తాయి. మేము ‘పేషెంట్‌’ అనే పదం వాడము. ఆ మాటలో సిక్‌నెస్‌ ధ్వనిస్తుంది. మేము వాళ్లను ‘వెల్‌నెస్‌ సీకర్స్‌’ అని పిలుస్తాము. ఆ మాటే పెద్ద ఊరట.

మీ దగ్గర ఉన్న చికిత్స ప్రక్రియల ప్రత్యేకతలు ఏమిటి? అవెలా ఉంటాయి?
శరత్‌: భారతదేశంలోనే దాదాపు ఎవరి దగ్గరా లేని కొన్ని ప్రత్యేకమైన ఉపకరణాలు మా దగ్గరే ఉన్నాయి. ఉదాహరణకు మా దగ్గర ‘వేదా పల్స్‌’ అనే ఒక ఉపకరణం ఉంది. దీని సాయంతో ఆయా అవయవాల ఎనర్జీ లెవెల్స్‌ను తెలుసుకోవచ్చు.  ‘వేదా జెనెటిక్‌’ అనే మరో డివైజ్‌ కూడా ఉంది. వీటి సహాయంతో కేవలం 7 నిమిషాల్లో ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని చూడవచ్చు. మా దగ్గర జబ్బునూ నయం చేస్తాం. జబ్బు రాకముందే నివారణనూ సాధ్యం చేస్తాం. క్యాన్సర్‌ రోగులు డిప్రెషన్, కుంగుబాటులో బాధపడుతుంటారు కాబట్టి వారి కోసం మా దగ్గర  సైకియాట్రిస్ట్‌లు ఉంటారు. వారికి అవసరమైన ఆహారాన్ని సూచించేందుకు  న్యూట్రిషనిస్టులూ ఉంటారు. వారిని నార్మల్‌గా ఉంచేందుకు దోహదపడే అనేక విభాగాలకు సంబంధించిన ఆలోపతిక్‌ డాక్టర్లూ ఉంటారు.  వెల్‌నెస్‌ సీకర్స్‌ ఆఘ్రాణించేదీ బాగుండాలి. ఇందుకు మా అరోమా థెరపీ తోడ్పడుతుంది. వినేదీ చెవికి ఇంపుగా ఉండాలి. సౌండ్‌ హీలింగ్‌ దీనికి ఉపయోగపడుతుంది. కళ్లకు చూసేది ఆహ్లాదకరంగా ఉండాలి. కలర్స్‌ థెరపీతో పాటు, అమెరికాలో మా చికిత్స ప్రక్రియలు అందించే ప్రదేశాల చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లోని పచ్చదనం ఇందుకు ఉపకరిస్తుంది. స్పర్శతోనూ ఎంతో చికిత్స అందించవచ్చు. మా మర్దన చికిత్స (మసాజ్‌ థెరపీ) ఇందుకు దోహదం చేస్తుంది. ఇలా పంచేంద్రియాలనూ సరిదిద్దే ఆయా విభాగాలకు చెందిన నిపుణులైన డాక్టర్లుంటారిక్కడ. అయితే వాళ్లను మేం డాక్టర్లు అని పిలవం. వాళ్లను మేము చాలా గౌరవంగా ‘వైటలిస్ట్స్‌’ అంటాం. వైటల్‌ పవర్‌ అంటే జీవశక్తి. ఈ వైటలిస్టులు ఒంట్లోని జీవశక్తిని పునరుజ్జీవింపచేస్తారు. కాబట్టే వాళ్లకా పేరు.

∙క్యాన్సర్‌ ఎందుకొస్తుందో కారణం తెలియదంటారు కదా? మరి మీరెలా తగ్గిస్తారు?
శరత్‌: నిర్దిష్టంగా  క్యాన్సర్‌ ఎందుకు వస్తుందో తెలియకపోవచ్చు. కానీ స్థూలంగా చెప్పాలంటే క్యాన్సర్‌ రావడానికి చాలా కారణాలుంటాయి. ఇలాంటి వాటిల్లో 16 ప్రధానమైనవి. అవి: 1. జీవనశైలి 2. జన్యుపరంగా మార్పులు చెందిన ఆహారం, 3. వాతావరణ కాలుష్యం 4. పొగ, మద్యం 5. మానసిక, ఉద్వేగపరమైన ఒత్తిడి 6. ఇన్‌ఫ్లమేషన్‌ 7. మలబద్దకం 8. కీలక విటమిన్ల లోపం 9. అధికంగా రిఫైన్‌ చేసిన కార్బోహైడ్రేట్లను తీసుకోవడం 10. హార్మోన్ల అసమతౌల్యత 11. ఆమ్లయుతమైన ఆహారాలు (అసిడిక్‌ ఫుడ్‌) ఎక్కువగా తీసుకోవడం 12. ఎరువులు, క్రిమిసంహార మందుల ప్రభావానికి గురికావడం 13. దగ్గరి వారిని కోల్పోవడం 14. కొవ్వులతో కూడిన (ట్రాన్స్‌ఫ్యాట్స్‌) ఎక్కువగా తీసుకోవడం 15. ఒంట్లో, మనసులో పేరుకున్న విషాలను విసర్జించలేకపోవడం 16. రేడియేషన్‌కు గురికావడం... ఇలాంటి పదహారు ప్రధాన కారణాలను దూరంగా ఉంచితే క్యాన్సర్‌ను నివారించవచ్చు. ఇలాంటి అవగాహన కల్పించడం కోసమే మా అమ్మగారు మరణించిన మే 13 తేదీన ప్రతి ఏడాదీ నేను అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటాను. 

యూఎస్‌ఏలోనే కాకుండా భారత్‌లో కూడా మీ ఆయుర్వేద సెంటర్స్‌ ఉన్నాయా? ఉంటే ఎక్కడ?  
శరత్‌: అవును.. ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో రాధాస్‌ ఆయుర్‌ వే పేరిట మా కేంద్రం పనిచేస్తోంది. భారత్‌లో మరింత మంది రోగులకు అందుబాటులోకి వచ్చేలా మరిన్ని సెంటర్స్‌ ప్రారంభించాలనే ఆలోచన ఉంది. అలాగే అమెరికాలో కూడా. 

∙మీ ప్రత్యామ్నాయ చికిత్సలు ఎలా ఉంటాయి? 
శరత్‌: ఒంటిని రోగాలకు తట్టుకునేలా చేసేందుకు వ్యాధినిరోధక శక్తిని కల్పించే ఆయుర్వేద ఔషధాలు, మూలికలు ఇస్తుంటాం. దాంతో పాటు ఆహారంలో ఎన్నో మార్పులు సూచిస్తాం.  పెసర్లలో ఉన్నంత ప్రోటిన్‌ మరెక్కడా ఉండదు. అలాగే రోగనిరోధకను సమకూర్చే శక్తికి మూలమైన విటమిన్‌–సి ‘ఉసిరి’లో ఉన్నంత ఇంకెక్కడా లభ్యంకాదు. ఇక చక్కెరకు బదులు ఆరోగ్యం కోసం ‘బెల్లం’ వాడుతాం. పాలిష్‌ పట్టిన బియ్యం వద్దు... దంపుడు బియ్యం వాడమని సూచిస్తాం. చిరుధాన్యాలైన రాగులు, కొర్రల వంటి వాటిని తినమని చెబుతాం. ప్రతిపూటా ఎలాంటి ఆహారాలు ఉండాలో వివరిస్తాం. ఎలాంటి నూనెలైనా వేడిచేస్తున్నప్పుడు 450 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరగానే అవి క్యాన్సర్‌ కారకాలుగా మారిపోతాయి. వాటికి బదులు ‘కోల్డ్‌ ప్రెస్‌డ్‌’ ఆయిల్స్‌ వాడమని చెబుతాం. అలాగే జీవనశైలి (లైఫ్‌స్టైల్‌)లో ఆరోగ్యకరమైన మార్పులు సూచిస్తాం. ఇక పంచకర్మ చికిత్స, యోగా, ధ్యానం వంటివి వారికి ఎంతగానో ఉపయోగిస్తాయి. 

∙క్యాన్సర్‌ రోగులకు బలం చేకూరడానికి మీరు చెబుతున్న మందులు ఖరీదైనవే కదా. మరి వాటిని భరించలేని వారు కూడా ఉంటారు కదా... 
శరత్‌: అవును... అందుకే అలాంటి వారికోసం మేమొక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాం. దాని ద్వారా ఆ మందుల్ని కొనే స్తోమత లేనివారికి ఇస్తాం. ముందే చెప్పాను కదా... క్యాన్సర్‌ చాలా ఖరీదైన రుగ్మత అని. అందుకే క్యాన్సర్‌ హాస్పిటల్స్‌ దగ్గర ఉండే వాళ్ల సహాయకులను చూస్తే నాకు సానుభూతి. ఆ సహానుభూతితోనే వీలైనన్నిసార్లు మాకు చేతనైనంతగా పలుమార్లు వాళ్లకు ఆహారం అంది స్తున్నాం... అందిస్తూ ఉంటాం.  మా హెర్బల్‌ ఔషధాలు పంచుతుంటాం. మా హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసిన వారికి తగిన సలహాలు ఇస్తాం. ఇలా చేయాల్సింది ఎంతో! నిత్యం ఎంతో కొంత నెరవేర్చగలిగినా అది చాలు. అదే మాకు వేనవేలు. 
రాధాస్‌ ఆయుర్వే క్యాన్సర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లు : 
91000 58333/ 91 5404 5404 

మరిన్ని వార్తలు