ఫ్రెష్‌ ఫైవ్‌

6 Sep, 2018 00:14 IST|Sakshi

బ్యూటిప్స్‌

చాలామంది చర్మ సంరక్షణలో ఇది వాడవచ్చా, వాడకూడదా, ఏది వాడాలి, ఏది వాడకూడదు.. అనే సంశయంలో ఉంటూ ఉంటారు. చర్మం కాస్త డల్‌గా అయినా జీవం కోల్పోయినట్టు భావిస్తారు. ఈ సమస్య రాకుండా ఉండటానికి.. చర్మకాంతి పెరగడానికి... 5 సూచనలు పాటించవచ్చు.రోజూ రాత్రి పడుకునే ముందు ఆలివ్‌ ఆయిల్‌లో ముంచిన దూది ఉండతో ముఖమంతా రాయాలి. అదే ఉండతో కాస్త ఒత్తిడి చేస్తూ మసాజ్‌లా చేయాలి. దీంతో ముఖంపైన దాగున్న దుమ్ము కణాలు, శుభ్రపరిచినా మిగిలిన మేకప్‌ సులువుగా వదిలిపోతుంది. తర్వాత ముఖాన్ని ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకొని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.
ఒంటికి చెమట పట్టేలా చేసే రన్నింగ్, జాగింగ్, వాకింగ్‌ వంటివి తప్పనిసరిగా రోజులో 20 నిమిషాలైనా చేయాలి. చెమట ద్వారా స్వేద రంధ్రాలలో చేరిన మురికి విడుదల అవుతుంది. యోగా వల్ల రక్తప్రసరణ మెరుగై చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది.

చర్మం పొడిబారుతోంది అంటే సరైన నిద్రకు దూరంగా ఉన్నారని అర్ధం చేసుకోవాలి. రోజూ ఎనిమిది గంటల నిద్ర లేకపోతే కళ్ల కింద వలయాలు ఏర్పడతాయి. ఉదయం, రాత్రి పడుకునే ముందు వేలి కొసలతో తేనె అద్దుకొని కళ్ల కింద ఉబ్బుగా ఉన్న చోట రాయాలి. అలాగే ముఖమంతా తేనె రాసి, మృదువుగా రుద్దాలి. తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే చర్మకాంతి పెరుగుతుంది. 
నీటి శాతం ఎక్కువ ఉండే పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ వంటి పండ్లను తినాలి.  చర్మం జీవం లేనట్టుగా కనిపిస్తే రోజూ తగినన్ని నీళ్లు తాగడం లేదని అర్ధం. అందుకని రోజూ 8 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలనే నియమం పెట్టుకోండి. అలాగే, రోజులో మూడుసార్లు సబ్బు లేకుండా కేవలం మంచినీళ్లతో ముఖాన్ని శుభ్రపరిచి, మాయిశ్చరైజర్‌ రాయాలి. 
ఈ జాగ్రత్తలు పాటిస్తే చర్మం సహజకాంతితో కళకళలాడుతుంది. 

>
మరిన్ని వార్తలు