ఈ కాలం వేడిమి వల్ల చర్మం నల్లబడుతుంది. చమట వల్ల జిడ్డుగా అవడం, పదే పదే స్నానాలు చేయడం వల్ల పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యలకు విరుగుడుగా...
♦ చర్మం కమిలి, మంట పుడుతుంటే ఉపశమనానికి అలొవెరా జెల్ని రాసి, పది నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.
♦ బొప్పాయి గుజ్జు చర్మానికంతా పట్టించి, మూడు నిమిషాలుంచి కడిగేయాలి. మృతకణాలు తొలగిపోవడమే కాకుండా ఎండవేడిమికి కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది.
♦ వేడి వల్ల వెంట్రుకల మృదుత్వం దెబ్బతింటుంది. సహజసిద్ధమైన కండిషనర్ కోసం అరటిపండు గుజ్జును తలంతా పట్టించి, పది నిమిషాలు ఉంచి, కడిగేయాలి.
♦ బయట నుంచి వచ్చిన వెంటనే రోజ్ వాటర్లో దూది ముంచి, ముఖమంతా తుడిచి ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి.
♦ దోస రసం, పుచ్చకాయ రసం సమపాళ్లలో కలిపి ముఖానికి, మెడకు రాసి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి.
♦ చలికాలానికి మాయిశ్చరైజర్లు వాడి ఉంటారు. ఈ కాలం ఎస్.పి.ఎఫ్ 30 శాతం ఉన్న మాయిశ్చరైజర్ని ఎంపిక చేసుకొని బయటకు వెళ్లడానికి 15 నిమిషాల ముందు రాసుకుంటే ఎండబారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.