మరుగున పడిన మరెందరో చిరస్మరమణులు

16 Sep, 2018 02:07 IST|Sakshi

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను దశదిశలా చాటింది పురాణేతిహాసాలైతే, ఆ పురాణాలకు పూసలో దారంలా నిలిచింది పతివ్రతా శిరోమణులే . ఇక్కడ పతివ్రతలనగానే సీత, సావిత్రి, అనసూయ, ద్రౌపది వంటివారే గుర్తుకొస్తారందరికీ. అది తప్పేమీ కాదు కానీ, వారితోబాటు మరెందరో గొప్ప స్త్రీ మూర్తులున్నారు. వారిని గురించి తెలుసుకోవడం, వారిని కూడా స్మరించుకోవడం అవసరమే కదా అనే ఆలోచనతో ప్రముఖ కథారచయిత, సీనియర్‌ పాత్రికేయులు డా. చింతకింది శ్రీనివాసరావు కొద్దికాలం క్రితం సాక్షిలో వారం వారం ఒక్కో పతివ్రతా శిరోమణిని పాఠకులకు పరిచయం చేశారు. ఇటీవల ఆయా వ్యాసాలను ఏరి కూర్చి, ‘మరువరాని పురాణ మహిళలు’ పేరిట ఒక పుస్తకాన్ని అందించారు.

ఈ పుస్తకంలో శకుంతల, లోపాముద్ర, రేణుక, లీలావతి, కౌసల్య, అహల్య, ఊర్మిళ, దమయంతి, కుంతి, మాద్రి వంటి చిరపరిచితులైన స్త్రీ మూర్తులతోబాటు త్రిజట, వినత, దేవయాని, హిడింబ, జాంబవతి, మండోదరి వంటి కొద్దిమందికే తెలిసిన వారు, ఉలూచి, చిత్రాంగద, దశరథుడి దత్త పుత్రిక శాంత, విరాటరాజు భార్య సుధేష్ణ, దుర్యోధనుడి సతీమణి భానుమతి, వేంకటేశ్వర స్వామిని పెంచిన తల్లి వకుళమాత వంటి అతి కొద్దిమందికే తెలిసిన వారి గురించి కూడా ఎంతో లోతైన పరిశీలన, వివరణ కనిపిస్తుంది. అభ్యుదయ మహిళలు, విద్యార్థినీ విద్యార్థులు అలాంటి వారి గురించి తెలుసుకోవడం, వారి జీవితాలపై అవగాహన కలిగి ఉండటం అత్యవసరం.
మరువరాని పురాణ మహిళలు, పుటలు: 160; వెల రూ. 182,
ప్రతులకు: జ్యోతి బుక్‌ డిపో; ఫోన్‌ నం. 08916642020, 040 27611188

– పూర్ణిమాస్వాతి

మరిన్ని వార్తలు