చెట్టు నీడ
ఒక భార్య, భర్త ఇద్దరూ సంసారం పట్ల విరక్తి చెందారు. వారిద్దరూ కలిసి తీర్థయాత్రలకు బయలు దేరారు. ఒక తోవలో నడిచిపోతున్నారు. భర్త ముందు నడుస్తున్నాడు. భార్య వెనకగా వస్తోంది. అప్పుడు అతనికి నేలమీద ఒక వజ్రం కనిపించింది. తన భార్య దానిని చూస్తే దానిమీద ఆశపడి తన వైరాగ్యాన్ని పోగొట్టుకుంటుందేమోనని అతనికి అనుమానం కలిగింది. వెంటనే అతడు దానిని పూడ్చివేద్దామని గుంట తియ్యసాగాడు. ఇంతలో భార్య అక్కడికి వచ్చింది. ‘‘ఏమి చేస్తున్నారు?’’అని అడిగింది.
భర్త సరైన సమాధానం చెప్పకుండా మాట దాటవేయడానికి ప్రయత్నించాడు. అయితే భార్య ఆ వజ్రాన్ని చూసి, అతని మనసులోని ఆలోచనను కనిపెట్టింది. ఆమె భర్తతో ‘‘మీకు ఆ వజ్రానికి, మట్టికీ ఇంకా తేడా కనిపిస్తున్నట్లయితే ఎందుకు సన్యసించారు?’’ అని అడిగింది. కొందరు తమలో ఉన్న బలహీనతలే ఇతరులకూ ఉంటాయనుకుంటారు. ముందు మన మనసు స్వచ్ఛంగా ఉంచుకుంటేనే ఇతరుల మనసులో మంచిని చూడగలం.