ఈ చిట్టితల్లి చనిపోయింది!

12 Jun, 2014 00:16 IST|Sakshi
ఈ చిట్టితల్లి చనిపోయింది!

 విషాదం
 
పదిహేడు సంవత్సరాల జెన్నీఫర్ మరణం ఇటీవల మాంచెస్టర్(బ్రిటన్)ను కుదిపేసింది. ఆమె చనిపోవడానికి ఏకైక కారణం ఒత్తిడి. పరీక్షల సమయంలో విపరీతమైన ఒత్తిడికి గురికావడం వల్ల జెన్నీఫర్ చనిపోయింది. జెన్నీఫర్ మరణంతో ‘విద్యార్థులు-ఒత్తిడి’కి సంబంధించిన సమస్య మళ్లీ తెర మీదికి వచ్చింది.

 ‘‘రివిజన్‌కు ఎక్కువ టైం లేదు’’ అని జెన్నీఫర్ స్నేహితుల దగ్గర తరచుగా బాధపడేదట. టైమ్ లేకపోవడం, మరోవైపు పరీక్షలు దగ్గర పడడం ఆమెను విపరీతమైన ఒత్తిడికి గురి చేశాయి.జెన్నీఫర్ మరణం, ఆమె చదివే ‘ఓక్స్‌బ్రిడ్జి కాలేజీ’ పేరెంట్స్‌ను షాక్‌కు గురి చేసింది.  ‘‘ఎక్కువ మార్కులు ఎలా స్కోర్ చేయాలో చెప్పేవాళ్లు ఉన్నారుగానీ, మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో చెప్పేవాళ్లు లేరు’’ అని ఒక పేరెంట్ వాపోయారు.

 ‘‘కాలేజీలో సైకాలజీని తప్పనిసరి సబ్జెక్ట్ చేయాలి. దీని ద్వారా వారిలో మానసిక దృఢత్వం పెరుగుతుంది’’ అన్నారు మరో పేరెంట్.
 ‘‘పరీక్షలు లేని విద్యావిధానాన్ని ఊహించలేమా?’’ అని ఆవేశంగా  ప్రశ్నించారు ఒక బ్యాంకు ఉద్యోగి.నిజానికి, జెన్నీఫర్‌లు ఒక్క మాంచెస్టర్‌లో మాత్రమే లేరు. మన దేశంలో కూడా ఉన్నారు. అందుకే ఒత్తిడి లేని విద్యకు ఒక దారి కనుక్కోవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు