అమ్మ పీఠం

28 Jul, 2016 23:02 IST|Sakshi
అమ్మ పీఠం

సినారె  పుట్టినరోజు సందర్భంగా...
మా అమ్మ


డాక్టర్ సి. నారాయణరెడ్డితో మాట్లాడితే... అమ్మ అక్కున చేర్చుకున్నప్పుడు కలిగే ఆనందకంటే జ్ఞానపీఠం కూడా పెద్దది కాదేమో! అనిపిస్తుంది. అమ్మ ఒడిని మించిన పీఠం మరోటి ఉండదనిపిస్తుంది. ఎదిగే కొద్దీ ఒదిగే సంస్కారం, నిరాడంబరత అలవడింది అమ్మ నుంచేనంటారు. తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ... అమ్మ బొమ్మకు పదచిత్రణ చేయగలిగిన వాడినే కానీ పటచిత్రణ చేయలేనని కళ్లు తుడుచుకున్నారా విజ్ఞానఖని.


‘అమ్మంటే... ఎవరో తెలుసా
ఆ జన్మంటే ఏమో తెలుసా
నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ
కన్నీళ్లు చనుబాలు కలబోస్తే ఆ జన్మ’


ఇక మా అమ్మ సంగతికొస్తే...
మా అమ్మ పేరు బుచ్చమ్మ. ఏమీ చదువుకోలేదు. సంగీతం, సాహిత్యం తెలియదు. నన్ను సంతోషపెట్టడానికి పాటలు పాడేది. జోకొడుతూ పాడే పాటలో ఉన్న సాహిత్యం ఏమిటో బిడ్డకు అక్కరలేదు. బిడ్డకు అమ్మ గొంతును మించిన బాణీ అక్కరలేదు. ఆ గొంతులోని ప్రేమమాధుర్యాన్ని ఆస్వాదిస్తూ నిద్రలోకి జారిపోయిన జ్ఞాపకాలను నాకు మిగిల్చింది మా అమ్మ.


లోకజ్ఞానం తెలియని అమాయకురాలు మా అమ్మ. వంద నాగళ్ల వ్యవసాయపు లోగిట్లో ఆమె ప్రపంచం నేనే. ఆమె సంతోషం నేనే, ఆమె దుంఖమూ నేనే. చదువుకోసమైనా సరే ఆమె కళ్ల ముందు నుంచి దూరంగా పోవడానికి ఇష్టపడేది కాదు. మా హనుమాజీ పేటలో నాలుగో తరగతిక్కూడా పాఠశాల లేదు. ‘పదో తరగతి చదవనీ, తాసిల్దారవుతాడ’నే వాడు నాయిన మల్లారెడ్డి. అయినా అమ్మ ఒప్పుకునేది కాదు. నేను సిరిసిల్ల (కరీంనగర్ జిల్లాలో తాలూకా కేంద్రం) మాధ్యమిక పాఠశాలలో చేరడం వెనుక ఒక కన్నీటి సంద్రం ఉంది.

నాకు చదువుకోవాలని చాలా గట్టిగా ఉండేది. అమ్మకు నేను ఆమె కళ్ల ముందు నుంచి వెళ్లడం ఇష్టం లేదు. ఇద్దరి పట్టు సమంగా ఉంది. ఉక్రోషం కొద్దీ ఊరి బయట ఉన్న మోటబావిలో దూకేశాను. నాకు ఈతరాదు. నా స్నేహితుడు బావిలో దూకి నన్ను బయటకు తీసి మా అమ్మ దగ్గరకు తీసుకొచ్చాడు.


‘‘ఎందుకు బిడ్డా! ఈతరాదని తెల్సీ దూకావు’’ అని భోరున ఏడ్చింది.  ‘‘నువ్వు సిరిసిల్ల బడికి వద్దన్నావుగా’’ అన్నాను. అంతే... నా ఇష్టం కోసం ఆమె రాజీపడ్డది. ‘‘సర్లే! అట్టాగే పోదువు గాని!’’ అన్నది.


అలా సిరిసిల్లకు పంపింది. తర్వాత హైదరాబాద్‌లో చదివేటప్పుడు కూడా ఆమె ఎప్పుడూ సంతోషపడలేదు. ‘చదువుకని హైద్రాబాద్ పోయాడు’ అని బాధపడేది. నన్ను ‘బాపు’ అని పిలిచేది. చెప్పడం కూడా అలాగే. ‘‘మా బాపు పాటలు రాస్తుంటాడు’’ అని చెప్పేటప్పుడు కూడా ఆమెలో ఆనందం కంటే బిడ్డ కళ్ల ముందు ఉండకుండా ఎక్కడో దూరంగా ఉన్నాడనే ఆవేదనే ఉండేది.

నేను చేసిన పనికి ఆమె ఆనందం పొందిన క్షణాలు నాకు గుర్తు లేదు. అప్పటి వరకు ఆమె ఉండనేలేదు. నేను ఎం.ఎ చదివేటప్పుడే నాకు దూరంగా... ఎప్పటికీ కనిపించనంత దూరంగా వెళ్లిపోయింది. నన్ను ఎంత ఒంటరిని చేసిందంటే...  అమ్మ పోతూ పోతూ తన బొమ్మ (ఫొటో) ఇచ్చి పోలేదు. అసలు బొమ్మంటూ తీస్తే గదా ఇవ్వడానికి. ఎప్పుడైనా...  ‘‘అమ్మా బొమ్మ దిగవే అంటే...ఆణిముత్యంలా నవ్వేది. నువ్వు నా బొమ్మవు కాదా బాపూ అంటూ నన్ను అక్కున చేర్చుకునేది. నాకు మిగిలింది నా మనోఫలకం మీదున్న అమ్మ బొమ్మ మాత్రమే. అయితే... ఇటీవల కళ్లు మూసుకుని చూస్తే అమ్మ బొమ్మ అలుక్కు పోతూంది. మిగిలిన ఆ కాస్త రూపమూ తుడుచుకుపోతే... దిగులుతో గుండె వణికిపోయింది. ఉదయం నిద్రలేచినప్పుడు కురులారబోసుకునే అమ్మరూపమే నా కళ్లలో. అదీ మసకబారుతోందా? అమ్మ రూపం నా కళ్ల ముందు నుంచి మసక బారక ముందే అమ్మ పటం (చిత్రం) గీయాలనుకున్నాను.


కానీ... నేను... నేను... చిత్రకారుణ్ని కాను, పదచిత్రణ మాత్ర జీవినని అప్పటి వరకూ గుర్తుకు రాలేదు. ఎంత మెదిపినా కలం కుంచె అవుతుందా? పదాలు రేఖలవుతాయా? కవినన్న గర్వం మంచుకొండ చరియలా విరిగి పడిపోయింది. పోగులుగా విడిపోతున్న స్మృతి ముద్రను మనసు చట్రంలో పొదుగుకుని అమ్మరూపాన్ని పదిలంగా నిలుపుకున్నాను. అమ్మ నుంచి మమకారం పంచడం నేర్చుకున్నాను. ఎంతమందికి పంచగలిగితే అంతమందికీ పంచుతున్నాను. అదే నన్ను ఇందరికి ఆత్మీయుడిని చేసింది.

‘దేవత కనిపించదు. కానీ అమ్మ కనిపిస్తుంది. కాబట్టి దైవం కంటే మనకు జన్మనిచ్చిన అమ్మను మిన్నగా చూసుకోవాలి’

- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు: మోహన్

 

 

మరిన్ని వార్తలు