నానో కణాలతో కేన్సర్‌ చికిత్స!

13 Jan, 2020 02:58 IST|Sakshi

రాగి చెంబులో ఉంచిన నీటిని తాగితే హానికారక సూక్ష్మజీవులు నశిస్తాయని మనం చాలాసార్లు విని ఉంటాం. మరి.. అదే రాగిని నానోస్థాయిలో... అంటే అత్యంత సూక్ష్మస్థాయిలో ఉపయోగిస్తే ఏమవుతుంది? కేన్సర్‌ కణితుల్లోని కణాలు చచ్చిపోతాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో రాగి నానో కణాలు కణాలను నాశనం చేస్తాయని పలు యూనివర్శిటీల శాస్త్రవేత్తలు కలిసికట్టుగా చేసిన ప్రయోగాల ద్వారా స్పష్టమైంది. కేన్సర్‌ కణాలకు కొన్ని రకాల నానో కణాలకూ అస్సలు పడదని ఇటీవలే స్పష్టమైంది. దీంతో శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని పరిశోధనలు ప్రారంభించారు. రాగితోపాటు, ఆక్సిజన్‌తో తయారైన నానో కణాలు అత్యంత ప్రభావశీలంగా ఉన్నట్లు గుర్తించారు.

కాపర్‌ఆక్సైడ్‌ నానోకణాలు ఒక్కసారి శరీరంలోకి ప్రవేశిస్తే.. అవి కరిగిపోయి విషపూరితంగా మారతాయి. కేన్సర్‌కణాలను మట్టుబెడతాయి. అయితే వీటిద్వారా సాధారణ కణాలకు నష్టం కలగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు ఐరన్‌ ఆక్సైడ్‌ను జత చేయడం విశేషం. రోగ నిరోధక కణాలను ఉత్తేజితం చేయడం ద్వారా కేన్సర్‌ చికిత్స కల్పించే ఇమ్యూనోథెరపీని, కాపర్‌ ఆక్సైడ్‌ నానో కణాలను కలిపి ప్రయోగించినప్పుడు ఎలుకల్లో చాలా ఎక్కవ కాలంపాటు కేన్సర్‌ తిరగబెట్టలేదని ప్రొఫెసర్‌ స్టీఫాన్‌ సోనెన్‌ తెలిపారు. తాము ఎలుకల ఊపిరితిత్తులు, పేవు కేన్సర్లపై ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు సాధించామని తెలిపారు.

మరిన్ని వార్తలు