ఈ పౌడర్‌తో కార్బన్‌డైయాక్సైడ్‌కు చెక్‌!

26 Dec, 2018 01:26 IST|Sakshi

వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను తనలోకి పీల్చేసుకోగల సరికొత్త పౌడర్‌ ఒకదాన్ని వాటర్‌లూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఫ్యాక్టరీలు విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఈ పౌడర్‌ను వాడటం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని అంచనా. అంతేకాదు.. కార్బన్‌తో తయారైన ఈ పౌడర్‌లోని రంధ్రాల సైజును నియంత్రించడం, రంధ్రాల సంఖ్యను పెంచడం ద్వారా ఈ టెక్నాలజీని మరింత సమర్థమైన వాటర్‌ ఫిల్టర్లు, బ్యాటరీల తయారీకి కూడా వాడుకోవచ్చునని ఝాంగ్‌వీ ఛెన్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు.

మొక్కల పదార్థాన్ని  వేడి చేయడం.. ఉప్పును వాడటం ద్వారా  తాము కార్బన్‌ను తయారు చేశామని, ఈ క్రమంలో ఏర్పడిన సూక్ష్మమైన కర్బన గోళాలపై మీటర్‌లో పదిలక్షల కంటే తక్కువ సైజున్న రంధ్రాలు ఏర్పడ్డాయని ఛెన్‌ వివరించారు. ఫలితంగా ఈ కర్బన పదార్థం వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను ఇతర పదార్థాల కంటే రెట్టింపు వేగంగా, తనలో ఇముడ్చుకోగలదని చెప్పారు. వాతావరణంలోకి చేరకముందే కాలుష్యకారక వాయువును నిల్వ చేసుకోవడం వల్ల భూ తాపోన్నతి తగ్గింపునకు ఇదో మెరుగైన తాత్కాలిక పరిష్కారం అవుతుందన్నది తమ అంచనా అన్నారు.  

మరిన్ని వార్తలు