చెన్నపట్టణంలో తెలుగింటి సేవారథులు

29 Mar, 2015 00:03 IST|Sakshi
చెన్నపట్టణంలో తెలుగింటి సేవారథులు

చెన్నై సెంట్రల్
 
తెలుగువారి కబుర్లు

 
టికెకెఎన్‌ఎన్... చెన్నై ట్రిప్లికేన్‌లోని అతి పురాతన ట్రస్టు...
 పార్థసారథి స్వామి గుడి... అతి పురాతన దేవాలయం....
 ప్రతి యేటా ఉత్సవాలు... ఉత్సవాల చివరి రోజున పెద్ద ఎత్తున తీర్థావరి జరుపుకోవడం
 షరామామూలే! ఈ కార్యక్రమాన్ని అక్కడివాళ్లే నిర్వహిస్తే అందులో మజా ఏముంటుంది మరి?
 అందుకే అదేదో మన చేతుల మీదుగా నడిపించి చూద్దాం అనుకున్నారు ఆరుగురు తెలుగువారు... వారే  లోకోపకారులు, ఉన్నత ఆదర్శ భావాలు కల పార్థసారధి చెట్టి, సకల సుబ్బరాయలు చెట్టి,
 ఎం. గురుమూర్తి చెట్టి, కాశీ సుబ్బరాయలు చెట్టి, సద్రాస్ సుబ్బరాయలు చెట్టి, యేల్చేరు సుబ్బరాయలు చెట్టి... ఈ షణ్మూర్తులు భగవంతుని ఆరాధన చేయడానికి సంకల్పించారు. కొల్లావరి కచ్చికి చెందిన వీరు ప్రజాసంక్షేమం కోసం... ప్రజలలో భక్తి భావాన్ని, దైవీ భావాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా అలవాటు చేయాలని సంకల్పించారు.  దాని ఫలితమే చెన్నపురిలో పార్థసారథిని సేవించడానికి అచ్చ తెలుగువారితో ఏర్పాటయిన ట్రస్టు. సుమారు రెండు వందల సంవత్సరాల క్రితంనుంచి నిర్విఘ్నంగా... నిరాటంకంగా... సజావుగా ఈ సేవ సాగుతూనే ఉంది.

ఒంగోలు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాలకు చెందిన ఆ ఆరుగురి ఆలోచనకు సుమారు 200 సంవత్సరాల క్రితం జరిగిన అంకురార్పణ ఫలితమే ఈ ట్రస్టు. చెన్నైలోని ట్రిప్లికేన్ ప్రాంతంలో సుమారు 43 తెలుగు కుటుంబాలకు చెందిన 66 మంది ఒక సంఘంగా ఏర్పడ్డారు. వారి తరఫున కొంత నగదును మూలధనంగా ఏర్పాటుచేసి, మరికొంత మంది దగ్గర నుంచి చందాలు సేకరించి, ట్రి ప్లికేన్‌లోని వెంకటరంగం పిళ్లై వీధిలో మొత్తం 96 గ్రౌండ్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. నిర్మానుష్యంగా ఉండే ఆ ప్రాంతంలో అడుగు పెట్టడానికే భయపడే రోజులు అవి. ఆ సమయంలో అక్కడి స్థలాన్ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి కొన్ని సత్కార్యాలు ప్రారంభించారు.

మనిషికి చావు పుట్టుకలు అతి సహజం. జన్మించినా కొన్ని కర్మలు నిర్వర్తించాలి. గతించినా కొన్ని కర్మలు నిర్వర్తించాలి. ఆ కర్మలకు అనువైన ప్రదేశం తప్పనిసరి. అటువంటి అవసరాలు తీర్చడానికి అనువుగా వారు సేకరించిన భూమిలో కొంత భాగాన్ని కేటాయించారు. దాని మీద వచ్చే ఆదాయంతో మరికొంత స్థలాన్ని సేకరించి యాత్రికుల కోసం సత్రం నిర్మించారు. ఆదాయం పెరగడంతో దేవుని ఉత్సవాలు చేయడం ప్రారంభించారు. అలా పార్థసారథి స్వామికి జరిగే బ్రహ్సోత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు జరిగే తీర్థావరి కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వర్తించే కార్యక్రమాన్ని వీరే చేపట్టారు. శ్రీ ఉదయస్వామికి ఏడవ రోజున నిర్వర్తించే పుష్పపల్లక్కు ఉత్సవాన్ని కూడా కన్నుల పండువగా నిర్వర్తించారు.

ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించడానికి అనువుగా 1862 మే మాసంలో ఒక ట్రస్ట్‌గా ఏర్పడి ఉత్సవాల నిర్వహణకు కావలసిన చందాలు సేకరించారు. 1881లో బకింగ్‌హామ్ కాలువ కోసం ప్రభుత్వం ఈ స్థలంలో కొంతభాగం సేకరించినప్పుడు, వారిచ్చిన పరిహార ంతో ప్రస్తుతం ఉన్న 288 పైక్రోఫ్ట్స్ రోడ్డులో ఈ ట్రస్టు భవన నిర్మాణం జరిగింది. ఈ సంస్థను తిరువల్లికేని కొల్లావరి కచ్చి నూటైబ్బందురు పేరుతో రిజిస్టర్ చేశారు.

రెండు శతాబ్దాల క్రితమే చె న్నపట్టణం వచ్చి స్థిరపడిన ఈ తెలుగువారు చెన్నైలోని ట్రిప్లికేన్ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఒకప్పుడు అదంతా తెలుగువారు నివసించే ప్రాంతమే. చెన్నపట్టణంలోని తెలుగువారికి ఏదో ఒక రకంగా సేవ చేస్తూండాలనేది ట్రస్ట్ లక్ష్యం. దసరా సమయంలో అమ్మవారి నవరాత్రుల ఉత్సవాలలో రోజుకో అలంకారం వేస్తూ, కొలుస్తున్నారు. దైవభక్తి మాత్రమే కాకుండా మానవ సేవ కూడా ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది ఈ సంస్థ. యేటా 800 మంది తెలుగు విద్యార్థులకి నోట్‌బుక్స్, స్కాలర్ షిప్ ఇవ్వడంతో పాటు, వారు చదువుకోవడానికి అనువుగా. రీడింగ్ రూమ్, లైబ్రరీ... ఏర్పాటుచేశారు. చదువులో ప్రతిభ ప్రదర్శించిన ఉత్తమ విద్యార్థికి స్కాలర్‌షిప్, అవార్డు ఇవ్వడం వంటి కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తోంది ఈ సంస్థ. రోజురోజుకీ ఆదాయం పెరుగుతూండటంతో నెమ్మదిగా కుటీర పరిశ్రమలు, వర్క్‌షాపులు, గారేజీలు నిర్మించారు.

అయితే ఎంతటి మంచి పనికైనా ఆటంకం ఎదురుకాక తప్పదు. ఈ టికెకెఎన్‌ఎన్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఈ ట్రస్ట్ మరింత ఎదిగి తనకంటూ ప్రత్యేకతను తెచ్చుకోవాలనుకునే సమయంలో ప్రభుత్వ విధానం అడ్డు తగిలింది. వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పన్నుగా కట్టవలసి వచ్చింది. దాంతో ట్రస్టు నడవడమే కష్టమైపోయింది. ఎన్నో ఆదర్శభావాలతో ప్రారంభమైన ట్రస్టుకి ఈ ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. ఎట్టకేలకు ప్రభుత్వాన్ని కలిసి,తమ ట్రస్టు చేసే సేవా కార్యకలాపాలను విన్నవించి, పన్ను మినహాయింపు సాధించుకున్నారు. వాసవాంబ ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించారు. అనేక దేవాలయాలలో జరిగే దేవతల కల్యాణాలు ఈ ట్రస్టు మీదుగా జరిగేలా సాధించుకున్నారు. వరలక్ష్మి వ్రతం, నాగుల చతుర్థి, దసరా నవరాత్రులు ఘనంగా నిర్వర్తిస్తూ ట్రిప్లికేన్ తెలుగు వారి ఘనకీర్తిని నగరానికి చాటి చెప్పారు. తెలుగువారి ఉగాదికి తెలుగు వారినందరికీ ఒకచోట చేర్చి, పంచాంగ శ్రవణం ఏర్పాటుచేసి, పండుగను ఘనంగా నిర్వహించారు. చెన్నై ట్రిప్లికేన్ తెలుగువారి సొంతం చేశారు ఆ ఆరుగురు. అలనాడు ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 250 మంది సభ్యుల స్థాయికి ఎదిగింది.

సంస్థ ఎదుగుదలతో పాటు సంస్థ నిర్వర్తించే కార్యక్రమాల సంఖ్య కూడా ఎదుగుతూ వచ్చింది. ఈ ట్రస్టును ప్రారంభించిన వారు పూర్తిగా నిస్వార్థ పరులు. ఈ ట్రస్టుకి వారసులుగా వారి వంశీయులు ఒక్కరు కూడా లేకపోవడం విచిత్రం. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరిపి అందులోని సభ్యులను ట్రస్టీలుగా ఎన్నుకుంటారు. ఒక్కో అధ్యక్షులు వచ్చినప్పుడు ఒక్కో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఈ తెలుగు వారి ట్రస్ట్‌ను చెన్నపట్టణం సిగలో పూబంతిలా రూపొందిస్తున్నారు.
 సంభాషణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై
 ఇన్‌పుట్స్: డి.వి.ఎస్.ప్రసాద్, ట్రస్టు అధ్యక్షులు
 

మరిన్ని వార్తలు