సన్‌స్క్రీన్ లోషన్ అవసరం లేని బాల్యం...

1 May, 2014 23:01 IST|Sakshi
సన్‌స్క్రీన్ లోషన్ అవసరం లేని బాల్యం...

 వేసవి జ్ఞాపకం
 
 ‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’, ‘సుకుమారుడు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు ఆది(ఆదిత్య). ‘ప్యార్ మే పడిపోయానే’, ‘గాలిపటం’ సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్న ఆది బాల్యంలో తన వేసవి ముచ్చట్ల గురించి ఇలా తెలిపారు...
 
‘నా చిన్నప్పుడు 7వ తరగతి వరకు చెన్నైలోనే ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేశాం. ఇప్పుడంటే ఎండలో తిరిగితే నల్లబడతామని మానేస్తాం. తప్పదంటే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకొని వెళతాం. కానీ, చిన్నప్పుడు అలా కాదు.. ఎండలో విపరీతంగా తిరిగేసేవాళ్లం. నాన్నగారు(సాయికుమార్) సినిమా షూటింగ్స్ కారణంగా బిజీగా ఉండేవారు. అందుకే ఊళ్లు వెళ్లేవాళ్లం కాదు. బోర్ కొడుతుందని కొన్ని రోజులు సమ్మర్ క్యాంప్‌కి వెళ్లేవాడిని.

మా నాన్నగారికి ఇద్దరు చెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు. వారు పిల్లలతో సహా వేసవిలో మా ఇంటికే వచ్చేవారు. మా పిల్లల సంఖ్యే 15 వరకు ఉండేది. ఇంకా తాతగారు, నానమ్మ... అంతమందితో వేసవిలో ఇల్లంతా పండగ వాతావరణమే! వీరికి తోడు బయట మా స్నేహితులు... అంతా కలిసి బయట క్రికెట్, బ్యాడ్మింటన్.. పగలు ఇంట్లోనే క్యారమ్స్, చెస్... ఆడేవాళ్లం. మారుతీ వ్యాన్‌లో అందరం కలిసి సినిమాలకు, షికార్లకు వెళ్లేవాళ్లం.

ఆటలు, అల్లరి, షికార్లతో.. సెలవులు ఇట్టే గడిచిపోయేవి. తర్వాత అంతా వెళ్లిపోయేవారు. ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపించేది. మళ్లీ త్వరగా వేసేవి వచ్చేస్తే బాగుండు అనుకునేవాడిని. పెద్దయ్యాక వేసవి సెలవుల ఎంజాయ్‌మెంట్ అంతగా ఉండదు.

ఈ మధ్యే కొత్తగా ఇల్లు కొనుక్కున్నాం. ఇంటి పనుల్లో అందరం బిజీ. ఈ నెల 23న బంధువులు, వారి పిల్లలు మా కొత్తింటికి వస్తున్నారు. వాళ్లతో మళ్లీ నా చిన్ననాటి వేసవిని గుర్తుతెచ్చుకుంటూ ఆనందించనున్నాను.’
 

మరిన్ని వార్తలు