జాబిల్లిపై చైనా మొక్కల పెంపకం...

5 Jan, 2018 05:00 IST|Sakshi

ఇంకొన్నేళ్ల తరువాతైనా మనిషి ఇతర గ్రహాలపైకి విస్తరించక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారా? అంగారకుడిపైకి ఇంకో ఐదేళ్లలో మనుషుల్ని పంపేస్తానని ఇలాన్‌ మస్క్‌ లాంటి వారు ప్రతిపాదిస్తున్నారా? తామేం తక్కువ అనుకున్నారో ఏమోగానీ... చైనా ఈ దిశగా ఒక అడుగు ముందుకేసింది. సుదూర గ్రహాలను చేరే ముందుగానే.. జాబిల్లిపై మొక్కలు పెంచాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది మన పొరుగుదేశం ప్రయోగించే ఛాంగీ –4 ప్రయోగం సక్సెస్‌ అయితే జాబిల్లిపై మనకు కనిపించని వైపున మొక్కలు పెంచడం మొదలవుతుందని అంచనా.

జూన్‌లో జాబిల్లికి దాదాపు 60 వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ఓ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఈ కార్యక్రమం మొదలు కానుంది. ఆ తరువాత రెండో దశలో జాబిల్లి పైకి ఓ రోవర్, ల్యాండర్‌లను ప్రయోగిస్తారు. ఇందులోనే కాయగూరల విత్తనాలు, పట్టుపురుగు గుడ్లు ఉంటాయి. పట్టుపురుగు గుడ్లు పొదిగి పురుగులు బయటకొస్తే అవి కాస్తా మొక్కలు పెరిగేందుకు అవసరమైన కార్బన్‌ డయాక్సైడ్‌ను ఇస్తాయి. అలాగే విత్తనాలు మొక్కలుగా మారుతూ ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఈ రెండు ప్రక్రియల ద్వారా జాబిల్లిపై చిన్న ప్రాంతంలో ప్రత్యేకమైన వాతావరణాన్ని సిద్ధం చేయవచ్చునన్నది చైనీయుల అంచనా. జాబిల్లి రెండో వైపున ఉండే అతిపెద్ద బిలం వద్ద ఈ ప్రయోగం జరిగే అవకాశముంది.

మరిన్ని వార్తలు