చిటికెలో మట్టి పరీక్షలు...

28 Feb, 2018 00:44 IST|Sakshi

వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే భూమి సారవంతంగా ఉండటంతోపాటు చీడపీడలకు అవకాశాలు తక్కువగా ఉండాలని మనకు తెలుసు. అయితే భూసారాన్ని పరీక్షించేందుకు ఇప్పటికే కొన్ని టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయిగానీ.. చీడపీడల విషయానికి వస్తే మాత్రం ఇలాంటివేవీ లేవు. ఈ అంతరాన్ని పూరించేందుకు వాషింగ్టన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన టెక్నాలజీని అభివృద్ధి చేశారు. పంట నష్టానికి కారణం కాగల సూక్ష్మజీవుల వివరాలను ఇది అతితక్కువ సమయంలో గుర్తించి రైతులకు వివరాలు అందిస్తుంది. ఇదే పనిచేసేందుకు ప్రస్తుతం కొన్ని వారాల సమయం పడుతుందన్నది తెలిసిందే.

మట్టిలో ఉండే సూక్ష్మజీవుల డీఎన్‌ఏ పోగులను ప్రత్యేకమైన అయస్కాంతాల సాయంతో గుర్తించి.. పాలిమరేస్‌ చెయిన్‌ రియాక్టర్ల ద్వారా వివరాలు తెలుసుకోవడం ఈ టెక్నాలజీలోని కీలక అంశం. పరికరాన్ని తయారు చేసేందుకు అవసరమైన అన్ని విడిభాగాలు, విధానం గురించి వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక పరిశోధన వ్యాసంలో వెల్లడించారు. వాషింగ్టన్‌ ప్రాంతంలోని బంగాళాదుంపల పొలాల్లో ఈ పరికరాన్ని పరిశీలించి మంచి ఫలితాలు సాధించామని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త కివామూ తనాకా అనే శాస్త్రవేత్త చెప్పారు.  

మరిన్ని వార్తలు