పంచాంగ శ్రవణం

31 Mar, 2017 23:15 IST|Sakshi
పంచాంగ శ్రవణం

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై  సరదాగా ఒక హ్యూమరస్‌ ఔట్‌లుక్‌!

పిడపర్తి శంకరశాస్త్రికి ఆరుగురు కొడుకులు.ఆరుగురికీ వేదాలూ... జ్యోతిష్యాలు నేర్పాడు.ఆరుగురిలో ముగ్గురు హైదరాబాద్‌లో ఉంటున్నారు. మిగతా ముగ్గురూ అమరావతిలో ఉంటున్నారు.ఉగాది వచ్చిందంటే చాలు ఆరుగురూ పంచాంగ శ్రవణాలకు వెళ్లడం పరిపాటి.అలా వెళ్లేముందు ఆరుగురికీ శంకర శాస్త్రి కొన్ని మెలకువలు చెప్పి పంపిస్తూ ఉంటాడు.హేవిళంబి నామ సంవత్సర ఉగాదికి ముందు రోజున ఆరుగురు కొడుకులనూ పిలిపించాడు శంకర శాస్త్రి. ఆరుగురినీ దగ్గరకు పిలిచి చాలా రహస్యంగా కొన్ని  జాగ్రత్తలు చెప్పాడు.ఆరుగురిలో ముగ్గురు హైదరాబాద్‌ వెళ్లారు. శంకర శాస్త్రి గారికి పంచాంగ శ్రవణంలో పేరు ప్రతిష్ఠలు ఉండడంతో రాజకీయ పార్టీలన్నీ ఆయన చేతనే పంచాంగం చెప్పించుకునేవి. ఆయన పెద్దయ్యాక ఆయన పిల్లలు వెళ్తున్నారు. హైదరాబాద్‌ వెళ్లిన ముగ్గురు టి.ఆర్‌.ఎస్‌., బిజెపి, టి.కాంగ్రెస్‌ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం చేశారు. సంభావనలు తీసుకుని నలుగురూ అమరావతిలోని తండ్రి దగ్గరకు వెళ్లారు.

అమరావతిలోని ముగ్గురూ తెలుగుదేశం, వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం చేశారు. వారికీ మంచి సంభావనలు ముట్టాయి. అవి తీసుకుని వారు కూడా తండ్రి దగ్గరకు బయలుదేరారు.  సాయంత్రం వేళ శంకర శాస్త్రి సంధ్యావందనం చేసుకుని ప్రశాంతంగా పడక్కుర్చీలో కూర్చున్నారు. ఆరుగురు కొడుకులు ఆయన కుర్చీ ముందు నేల మీద మఠం వేసుకుని కూర్చున్నరు. అందరిలోకీ చిన్నవాడైన రామకృష్ణ ఘనాపాఠి తండ్రి కేసి చూసి ‘నాన్నగారూ నాకొక అనుమానం’ అన్నాడు.చిద్విలాసంగా అతని కేసి చూసిన తండ్రి ఏంటన్నట్లు చూశాడు.

‘మీరు మాకేం చెప్పారు? ఏ పార్టీ ఆఫీసుకి వెళ్తే ఆ పార్టీ గెలుస్తుందని వాళ్లకి మంచి రోజులు నడుస్తున్నాయని చెప్పమన్నారు.ఆరుగురమూ అదే చెప్పాం. మరి మా ఆరుగురిలో ఎవరు చెప్పింది జరుగుతుంది? ఎవరో ఒకరు చెప్పిందే కదా జరిగేది?’ అని అడిగాడు.శంకర శాస్త్రి ముక్కుపొడుం ఓసారి దట్టించి – ‘ఒరేయ్‌ పిచ్చి సన్నాసీ. మనకి అందరూ సమానమే. మనం ఎవరి జాతకం చెప్పినా బాగోలేదని చెప్పకూడదు. బాగుందనే అనాలి. లేదంటే శాంతి చేస్తామనాలి. అలా వారిని ప్రశాంతంగా ఉండనిస్తేనే మనకి నాలుగు డబ్బులు చేతిలో పడేది. మంచి సంభావనలు ముట్టేదీనూ. నువ్వు చెప్పినట్లు ఒక్కరు చెప్పిందే జరుగుతుంది’ అన్నాడు.‘మరి గ్రహాలు ఎవరిని అనుగ్రహిస్తాయి నాన్నగారూ’ అని మార్కండేయ శాస్త్రి అడిగాడు.

తండ్రి నవ్వేసి... ‘రాజకీయ పార్టీలు గెలవాలంటే గ్రహాల అనుగ్రహం కాదురా కావల్సింది. ప్రజల అనుగ్రహం కావాలి. కానీ గ్రహాల అనుగ్రహమే కావాలని మనం చెబుతూ ఉండాలి. లేదంటే మనల్ని దగ్గరకు కూడా రానియ్యరు. ఇక ప్రజల అనుగ్రహం ఎవరిపై ఉంటుందో తెలుసా? ప్రజల కోసం పోరాడే వాళ్లనే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. సాధారణంగా ప్రభుత్వంలో ఉండే వాళ్లు ప్రజల్ని పట్టించుకోవడం లేదనుకో.. ప్రజల తరపున పోరాడేది ప్రతిపక్షాలే కదా. వాటినే ప్రజలు అనుగ్రహిస్తారు. వేదశాస్త్రాలు ఔపోసన పట్టినా లోక జ్ఞానం లేకపోతే కష్టంరా నాయనలారా ఈ విషయాన్ని గుర్తెరగండి’ అని శంకర శాస్త్రి వివరించారు.కర్తవ్యబోధ కావడంతో ఆరుగురు కొడుకులు తండ్రికి పాదాభివందనాలు చేసి భోజనాలకు కదిలారు.

 

మరిన్ని వార్తలు