నొప్పి లేకుండానే మధుమేహ పరీక్ష!

11 Apr, 2018 01:03 IST|Sakshi

రక్తంలో చక్కెర మోతాదు తెలుసుకోవాలంటే సూదితో గుచ్చుకోవడం మినహా మరో దారి లేదు. నొప్పి మాట అటుంచినా.. ఈ పద్ధతితో ఇతర సమస్యలు అనేకం. ఈ చిక్కులన్నింటికీ చెక్‌ పెట్టేలా బాత్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న సాధనాన్ని సిద్ధం చేశారు. ఫొటోలో కనిపిస్తోందే.. ఈ స్టిక్కర్‌ను మణికట్టు దగ్గర అతికించుకుంటే చాలు.. రక్తంలోని చక్కెర మోతాదు ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. సూది మాదిరిగా ఇది శరీరం లోపలికి గుచ్చుకోదు కాబట్టి నొప్పి అస్సలు ఉండదు. వెంట్రుకల కుదుళ్ల మధ్యలో కణాల మధ్య ఉండే ద్రవాల నుంచి చక్కెరలను లెక్కకడుతుంది. ఇందుకు తగ్గట్టుగానే ఈ స్టిక్కర్‌పై కొన్ని సెన్సర్లు ఉన్నాయి. అతికించుకున్న తరువాత 10 – 15 నిమిషాలకు ఫలితాలు చూసుకోవచ్చు.

ఒకసారి అతికించుకుంటే చాలు.. కొన్ని గంటలపాటు ప్రతి పావుగంటకు ఒకసారి లెక్కలు చూసకునే అవకాశం ఉండటం ఈ సాధనం ప్రత్యేకత. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచీ వంటి ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్ల సాయంతో ఎప్పటికప్పుడు ఫలితాలు తెలుసుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి దీంట్లో. అతితక్కువ ప్రాంతం నుంచి ద్రవాలను సేకరిస్తున్నందున ఫలితాలు చాలా కచ్చితంగా ఉంటాయని డాక్టర్‌ అడిలీనా లీ అంటున్నారు. . పందులపై ఈ సాధనాన్ని వాడి తాము సత్ఫలితాలు పొందామని చెప్పారు. వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేయగలిగితే ఇది అతి చౌకైన, తొడుక్కోగల గ్లూకో మీటర్‌ అవుతుందని, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మధుమేహులకు సూదుల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపారు. 

మరిన్ని వార్తలు