మోసాల చిత్రాల కరోనా

23 Apr, 2020 06:51 IST|Sakshi

కరోనా గురించి, దాని లక్షణాలూ, నివారణ చర్యల గురించి ఇప్పటికే మనకు తెలుసు. కానీ ఆ వైరస్‌కు మరికొన్ని చిత్ర విచిత్ర గుణాలున్నాయి. మన కణంతో వ్యవహరించే సమయంలో అది చేసే మోసాలున్నాయి. నిపుణులకూ, డాక్టర్లకూ తెలిసినా... చాలామందికి పెద్దగా తెలియని ఆ వైరస్‌ తాలూకు చిత్రవిచిత్ర వ్యవహారాలెన్నెన్నో. వాటిలో కొన్నింటిని వైద్య  సాంకేతిక పరిభాషలో కాకుండా మనదైన సామాన్య భాషలో తెలుసుకుందాం రండి. 

‘కరోనా’ అనేది వైరస్‌ తాలూకు కుటుంబానికి ఉన్న పేరు. ఇన్‌ఫ్లుయెంజా, సార్స్, మెర్స్‌ లాంటి ఏడు ప్రధానమైనవి దాదాపుగా మనలో చాలామందికి తెలుసు. కానీ ఆ కుటుంబంలో దాదాపు 40 వరకు వైరస్‌లు ఉన్నాయి. అవన్నీ గ్రహణం పట్టినప్పుడు సూర్యుడి చుట్టూ వచ్చే అగ్నికీలల్లా కనిపిస్తుంటాయి. ఆ కీలలు కిరీటంలోని పైకి పొడుచుకొచ్చేలాంటి నిర్మాణాన్ని పోలి ఉంటాయి కాబట్టీ... ఇంగ్లిష్‌లో కిరీటాన్ని కరోనా అంటారు కాబట్టీ... ఆ కుటుంబానికి ఆ పేరు వచ్చింది. ఇంగ్లిష్‌లో పైకి పొడుచుకొచ్చిన ఆ నిర్మాణాలను ‘స్పైక్స్‌’ అనీ, తెలుగులో మనం వాటిని కొమ్ములనీ వాడుకభాషలో వ్యవహరిస్తున్నాం.

మన ఇప్పుడు ఆ కొమ్ముల్లాంటి స్పైక్స్‌ చేసే మాయను తెలుసుకుందాం. నిజానికి కరోనా వైరస్‌ చాలా మోసకారి. మనలోని చాలామంది ఇప్పటికే వైరస్‌ ఆకృతిని చూసి ఉన్నాం కదా. గుండ్రని వైరస్‌ మీద కొమ్ముల్లా పొడుచుకొచ్చిన ఆ స్పైక్స్‌ చివర్లో ‘లవ్‌’ గుర్తు లాంటి చివరిభాగాన్నీ చూసే ఉన్నాం. లవ్‌ గుర్తు లాంటి ఆ చివరి భాగం మన కణానికి ఉపయోగపడే ఓ పదార్థం (మాలెక్యూల్‌)లాగా మన జీవకణాన్ని నమ్మిస్తుంది. దాంతో మన జీవకణంలోని రిసెప్టార్‌ అనే భాగాలు... దాని మోసాన్ని గ్రహించలేక ఆ దాన్ని తమ దగ్గరకు ఆహ్వానిస్తాయి. అంతే... తొలుత ఆ లవ్‌ మార్కులా ఉన్న  భాగాన్ని ఆశచూపి... వెంటనే కొమ్ములాంటి పైప్‌ సహాయంతో వైరస్‌ లోపల ఉన్న ‘ఆర్‌ఎన్‌ఏ’ అనేది లోపలికి ప్రవేశించి, మన కణాన్ని హైజాక్‌ చేసి, దాన్ని తన అదుపులోకి తీసుకుని, తన తాలూకు జీవక్రియలను నెరిపి తనలాంటి అనేక కాపీలను పుట్టించమంటూ తీవ్రమైన ఒత్తిడి చేస్తుంది.. తాను ఆ కార్యక్రమాన్ని నిర్వహించే క్రమంలో తనకు అవసరమైన జీవక్రియలను నిర్వహించుకోలేక మన జీవకణం మరణిస్తుంది. దాంతో అందులో తయారైన వైరస్‌ కాపీలు చుట్టూ ఉన్న కణాలను మళ్లీ ముట్టడించి, వాటిని హైజాక్‌ చేస్తాయి. ఇలా మన జీవకణాల్లోని చాలా కణాలను నాశనం చేయడం వల్ల మనకు ప్రమాదం ఏర్పడుతుంది. 

► ఇక్కడ మరో మోసమూ జరుగుతుంటుంది. మానవ పరిణామక్రమంలో మన వ్యాధి నిరోధకశక్తికి దోహదపడే మన కణాలు ఎన్నెన్నో వైరస్‌లను గుర్తు పెట్టుకున్నాయి. అయితే మనలోకి చేరిన కరోనా అనే శత్రుకణంలోని కొన్ని ప్రోటీన్‌లు... మన కణాల్లో ఉండే ప్రోటీన్లతో పోలి ఉండటం వల్ల మన వ్యాధి నిరోధక కణాలు... ఏది శత్రుకణమో ఏది మిత్రకణమో తెలియని అయోమయంలో పడి మోసపోతాయి. ఈ గందరగోళంలో మన వ్యాధినిరోధక శక్తి ఎవరిపై దాడి చేయాలో తెలియక ఒక్కోసారి మన కణాలనూ దెబ్బతీసే ప్రమాదానికి ఒడిగడతాయి. అందుకే మన సొంత కణాలేమిటో తెలిసే సమయానికి కాస్త ఆలస్యమవుతుంది. 

► ఇలా చాలా వేగంతో చాలా త్వరితంగానూ, చాలామందికి సోకే వైరస్‌ల విషయంలో ఒక సౌకర్యం ఉంది. అది చాలామందికి సోకే ప్రమాదం ఉన్నందున త్వరగా హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే... సమాజంలోని చాలామందికి దానినుంచి వ్యాధినిరోధకత వృద్ధి చెందడం జరుగుతుందన్నమాట. ఇది ఒక మంచి పరిణామం అనుకున్నా ఇక్కడ మరో ప్రమాదం ఉంది. దీని ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ (అంటే సోకిన నాటి నుంచి లక్షణాలు బయటపడే వ్యవధి) 14 రోజులుగా ఉన్నందున... చాలామందిలో వాళ్లకు తెలియకుండానే దాగుండి... చాలామందిని రోగగ్రస్తం చేసే అవకాశం ఉంది. ఇది చెడు పరిణామం. ఇలా కరోనాలో మంచీ... చెడూ రెండూ ఉన్నాయి. కానీ చెడు చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. అందుకే లాక్‌డౌన్‌ పాటించాల్సిన అవసరం, జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత చాలా ఎక్కువ. 

► దక్షణ కొరియాలో ఒక రోగిని ప్రత్యేకంగా ‘పేషెంట్‌ 31’ అని వ్యవహరించారు. దీనికో కారణం ఉంది. ఆ దేశంలో వారు తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల ఆ వ్యాధిని కేవలం 30 మందికే పరిమితమయ్యేలా చాలా జాగ్రత్తలు తీసుకోగలిగారు. కానీ అక్కడి 31వ రోగికి ప్రార్థనల్లో నమ్మకం ఎక్కువ. అందుకే తనకు విపరీతమైన దగ్గు ఉన్నా, తీవ్రమైన జ్వరం ఉన్నా, తన ఆనవాయితీ తప్పనివ్వకూడదంటూ... రోజూ ప్రార్థనాస్థలానికి వెళ్లింది. దాంతో చాలామందికి వ్యాప్తి చేసింది. అందుకే ఆ రోగికి ‘పేషెంట్‌ 31’ అనే ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. దాంతో కేవలం పది రోజుల్లో రోగుల సంఖ్య 30 నుంచి 5,000లకు పెరిగిపోయింది. 

► ప్రపంచంలో కరోనా వైరస్‌ రోగుల సంఖ్య 1,00,000 చేరడానికి తొలుత 67 రోజుల పట్టింది. ఆ తర్వాత కేవలం 11 రోజుల్లోనే మరో లక్షమంది రోగులు ఆ జాబితాకు చేరారు. ఇక ఆ తర్వాత కేవలం నాలుగు రోజులకే మరో లక్షమంది రోగులు దానిబారిన పడ్డారు. ఇదీ దాని వ్యాప్తి వేగం. కొన్ని దేశాల్లోనైతే... రోగుల సంఖ్యలో మూడో వంతు మంది ఆ మర్నాటికి రోగుల జాబితాకు చేరుతున్నారు. 

► ఈ కొత్త కరోనా వైరస్‌ అన్నది మొదట గబ్బిలాల నుంచి ప్రారంభమై... ఆ తర్వాత ‘సివెట్‌ క్యాట్స్‌’ అనే రకం జంతువుల నుంచి అని కొందరు, ప్యాంగోలిన్‌ అనే చీమలు తినే జీవి నుంచి అని ఇంకొందరు వాదిస్తున్నారు. అయితే ఈ విషయం ఇంకా ఇదమిత్థంగా నిర్ధారణ కాలేదు. ఇతర జీవుల్లోనే ఇది మానవులకు హానికరంగా మారి... ఇప్పుడు వారికి సంక్రమించిందా... లేక మానవులకు సంక్రమించాకే హానికరమైన వైరస్‌గా మ్యూటేట్‌ అయ్యిందా అనే అంశంపై ఇంకా పరిశోధనలు సాగుతున్నాయి. 

► కరోనా వైరస్‌ మనిషికి ప్రమాదకరమైనదని గుర్తించిన కొన్నాళ్ల తర్వాత... దీన్ని ఓ పులిలోనూ, పిల్లిలోనూ కనుగొన్నారనే వార్తలు వచ్చాయి. జంతువుల నుంచి ఇది సోకిందన్న వార్తలు రాగానే కుక్కలూ, పిల్లల్లాంటి తమ పెంపుడు జంతువులను కొందరు రోడ్లపై విడిచిపెట్టి వెళ్లారు. కానీ... ఇది మనుషుల నుంచి పులికీ, పిల్లికీ పాకిన దాఖలాలున్నా... కుక్కలూ, పిల్లుల వంటి మన పెంపుడు జంతువుల నుంచి మనకు వచ్చిన దాఖాలాలైతే లేవు. కాబట్టి పెంపుడు జంతువులను అలా వదిలేయడం మంచిది కాదు అన్నది నిపుణుల మాట. 

► ఈ వైరస్‌ నివారణకు సబ్బు, శానిటైజర్‌తో చేతులను శుభ్రపరచకోవడం ఓ మంచి మార్గం. అయితే సబ్బు, శానిటైజర్‌ లభించని పక్షంలో వైద్యవర్గాలకు అందుబాటులో ఉండే ‘హ్యాండ్‌జెల్‌ యాంటీసెప్టిక్‌’ను కూడా వాడవచ్చని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. గదులను, పెద విశాలమైన ప్రదేశాలను డిస్‌ఇన్ఫెక్ట్‌ చేయడానికి ‘మినామిస్టిన్‌’ లేదా ‘క్లోర్‌హెక్సిడిన్‌’ మంచివనీ... అవి బ్యాక్టీరియా, వైరస్‌లను తుదముట్టిస్తాయంటూ నిపుణుల చెబుతున్నారు. 

► యాంటీబయాటిక్స్‌ వైరస్‌ను చంపేయలేవు. అందుకే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పాటు అజిథ్రోమైసిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌ వాడి, దాని నుంచి రక్షణ పొందవచ్చనే వార్తలు విని విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ వాడటం మంచిది కానే కాదు. ఆ మాత్రలు కేవలం ఫస్ట్‌లైన్‌ సోల్జర్స్‌గా... నిత్యం రోగులతో ఉండేవారికి ప్రొఫిలాక్సిస్‌గా మాత్రమే వాడాలి. మిగతావారికి అవి ఒక్కోసారి ప్రమాదకరం కావచ్చు.

► కరోనా వైరస్‌తో వచ్చే కోవిడ్‌–19 వ్యాధికి వైద్యం చేసేందుకు మలేరియా మందు అయిన ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌’, హెచ్‌ఐవీ రోగులకు వాడే ‘లోపినవిర్‌’, ఎబోలా వైరస్‌ వ్యాధికి వాడే ‘రెమ్‌డెసివిర్‌’ మందులతో పాటు జపాన్‌ వంటి దేశాల్లో యాంటీ–ఫ్లూ మందుగా వాడే అవిగాన్‌ (ఫేవిపిరవిర్‌) వంటి రకరకాల మందులు వాడుతున్నారు. 

► ఇక వ్యాధి బాగా ముదిరి... ఏమాత్రం వెనక్కిరారనుకునే రోగులకు మాత్రం కోలుకున్న రోగుల రక్తంలోని ప్లాస్మాలోని యాంటీబాడీస్‌తో చేసే ‘ప్లాస్మాథెరపీ’ ప్రక్రియనూ అవలంబిస్తున్న విషయం తెలిసిందే. ఇవీ... కరోనాకు సంబంధించి... అందరికీ అంతగా తెలియని... కొంతమందికి మాత్రమే తెలిసిన కొన్ని చిత్రవిచిత్ర విషయాలలో కొన్ని. - డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ 

మరిన్ని వార్తలు