వ్యాయామంతో వ్యాధులకు చెక్‌

17 Oct, 2018 16:50 IST|Sakshi

లండన్‌ : క్యాన్సర్‌, మధుమేహం, డిమెన్షియా, కుంగుబాటు వంటి జబ్బుల బారిన పడిన వారిని వ్యాయామం చేసేలా వైద్యులు, హెల్త్‌కేర్‌ సిబ్బంది ప్రోత్సహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దైనందిన జీవితంలో మరింత చురుకుగా ఉండటం ద్వారా ఆయా వ్యాధుల తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు.

వైద్యులు తమ రోగుల శారీరక చురుకుదనం గురించి ఆరా తీయాలని, వ్యాయామం ద్వారా చేకూరే శారీరక, మానసిక ప్రయోజనాలను వివరించాలని సూచించారు. డాక్టర్‌ లేదా నర్సు చెబితే నలుగురు రోగుల్లో ఒక్క రోగైనా శారీరకంగా చురుకుగా ఉండేందుకు చొరవ చూపుతారని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వైద్యుల్లో మూడొంతుల మంది రోగుల శారీరక చురుకుదనం గురించి మాట్లాడటం లేదని తాజా అథ్యయనం వెల్లడించింది.

వ్యాయామం ద్వారా స్ధూలకాయం ముప్పును తగ్గించడం ద్వారా జీవనశైలి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని ప్రజారోగ్య నిపుణులు చెబుతున్నారు. చురుకైన జీవనశైలిని పాటించడం ద్వారా టైప్‌ 2 మధుమేహ ముప్పును తగ్గించుకోవండం ద్వారా అధిక రక్తపోటు ముప్పు నుంచి బయటపడవచ్చని నిపుణులు పేర్కొన్నారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బుల ముప్పును 40 శాతం మేర తగ్గించవచ్చని, స్ర్టోక్‌, కుంగుబాటు ముప్పును కూడా 30 శాతం మేర తగ్గించవచ్చని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌, స్పోర్ట్‌ ఇంగ్లండ్‌ స్పష్టం చేశాయి.

మరిన్ని వార్తలు