హార్డ్‌డిస్క్‌లకు  కాలం చెల్లినట్లేనా?

9 Aug, 2018 00:45 IST|Sakshi

కంప్యూటర్లు, ల్యాప్‌టాపలలో బోలెడంత బరువుండే హార్డ్‌ డిస్క్‌లకు ఇక కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. ఎందుకంటారా? శ్యాంసంగ్‌ కంపెనీ ఏకంగా నాలుగు టెరాబైట్ల సమాచారాన్ని ఇముడ్చుకోగల మెమరీ కార్డును ఆవిష్కరించింది మరీ! అంతేకాదు.. ఈ మెమరీ డివైజ్‌లోకి ఏదైనా ఫైల్‌ను నిక్షిప్తం చేయడం కూడా చాలా వేగంగా జరిగిపోతుంది. సెకనుకు 540 మెగాబిట్ల వేగంతో ఫైళ్లను చదవడం.. 520 మెగాబిట్ల వేగంతో రాయడం చేస్తుంది ఈ మెమరీ కార్డు. ఇంకోలా చెప్పాలంటే ఒకే రెండు సెకన్లలో ఓ మోస్తరు హెచ్‌డీ సినిమా మొత్తాన్ని స్టోర్‌ చేసేసుకోవచ్చు.

ఒక్కో మెమరీ సెల్‌లో తాము మూడు స్థానంలో నాలుగు బిట్ల సమాచారాన్ని నిక్షిప్తం చేయగలిగామని ఇందుకోసం మూడు బిట్ల ఎస్‌ఎస్‌డీ కంట్రోలర్, టర్బోరైట్‌ టెక్నాలజీలను వాడామని శాంసంగ్‌ ప్రతినిధి ఒకరు వివరించారు. ఈ మెమరీ కార్డులో 64 పొరలున్న వీ–ఎన్‌ఏఎన్‌డీ మైక్రోప్రాసెసర్లు 32 వాడామని ఫలితంగా ఇతర నాలుగు టెరాబైట్ల సామర్థ్యం ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేయగలదని చెప్పారు. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న 2.5 అంగుళాల సైజు డ్రైవ్‌లకు కొత్త 4 టెరాబైట్ల మెమరీకార్డు తోడవనుందని.. ఇదే టెక్నాలజీతో తాము స్మార్ట్‌ఫోన్లలోనూ మెమరీ సామర్థ్యాన్ని పెంచగలమని శాంసంగ్‌ చెబుతోంది!


 

మరిన్ని వార్తలు