‘డూయింగ్‌ బిజినెస్‌’ ఈజీ కాదు!!

15 Nov, 2017 23:15 IST|Sakshi

దిగువ స్థాయిల్లో ఇంకా అవినీతి ఉంది

పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌ అనిల్‌ ఖైతాన్‌ 

న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపార నిర్వహణ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) సులభతరంగా లేదని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) ప్రెసిడెంట్‌ అనిల్‌ ఖైతాన్‌ అభిప్రాయపడ్డారు. పరిస్థితులు మెరుగుపడలేదని తెలిపారు. దిగువ స్థాయిల్లో ఇంకా అవినీతి నెలకొని ఉందన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం వద్ద మాటలు మాత్రమే ఉన్నాయి. చేతలు కనిపించడంలేదు. పాలసీలు ప్రకటిస్తారు. కానీ వాటిని అమలు చేయరు. అప్పుడు వాటి వల్ల ఉపయోగం ఏముంటుంది? ప్రకటించిన వాటిని అమలు చేయలేకపోతే అవి వైఫల్యాలుగా మిగిలిపోతాయి’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పాలసీల అమలులో మాటలతో పాటు చేతలు కూడా చూపించాలన్నారు.

డీమోనిటైజేషన్‌ ప్రతికూల ప్రభావం నుంచి కంపెనీలు బయటపడటానికి కనీసం మరో 14 నెలలు పడుతుందన్నారు. కాగా ప్రపంచ బ్యాంక్‌ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ తాజా నివేదికలో భారత్‌ 30 స్థానాలు ఎగబాకి 100వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఖైతాన్‌ స్పందిస్తూ.. ‘నేను అలా అనుకోవడం లేదు. బిల్డర్లతో మాట్లాడితే పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదనే అంశం స్పష్టమౌతోంది’ వివరించారు.

మరిన్ని వార్తలు