మధుమేహులకు బెస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ ఇదే..

25 Apr, 2019 18:48 IST|Sakshi

న్యూయార్క్‌ : టైప్‌ టూ డయాబెటిస్‌తో బాధపడేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే మేలని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. వీరు బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ రోజంతా నియంత్రణలో ఉండాలంటే మధుమేహులు అధిక కొవ్వు, తక్కువ కార్బోహైడ్రేట్లతో కూడిన అల్పాహారం తీసుకుంటే మంచిదని పరిశోధకులు పేర్కొన్నారు. తృణధాన్యాలు, ఓట్స్‌, పండ్లు సహా పాశ్చాత్య బ్రేక్‌ఫాస్ట్‌లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో టైప్‌ 2 మధుమేహంతో బాధపడేవారికి ఉదయాన్నే బ్లడ్‌ షుగర్‌ అధికమవుతుందని అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనంకి నేతృత్వం వహించిన జొనాథన్‌ లిటిల్‌ చెప్పారు.

టైప్‌ టూ మధుమేహుల్లో అల్పాహారమే బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ను పెంచేస్తోందని తమ అధ్యయనంలో వెల్లడైందని అన్నారు. వీరిలో షుగర్‌ లెవెల్స్‌ను భారీగా తగ్గించేందుకు తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక కొవ్వుతో కూడిన ఆహారంతో రోజును ప్రారంభించడం మేలని చెప్పారు. ఇది షుగర్‌తో వచ్చే అనుబంధ లక్షణాలను కూడా నియంత్రించేందుకు దోహదపడుతుందని వెల్లడించారు. లంచ్‌, డిన్నర్‌లో కూడా కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. మధుమేహులే కాకుండా అందరూ ఈ తరహా ఆహారాన్ని అనుసరించడం ఆరోగ్యకరమని చెప్పారు.

మరిన్ని వార్తలు