పద్మశ్రీ– మాతృశ్రీ

28 Jan, 2020 08:35 IST|Sakshi
కుమారుడు రవికపూర్‌తో ఏక్తాకపూర్‌

ఏక్తాకపూర్‌ రెట్టింపు సంతోషాలలో మునిగి తేలుతోంది. జనవరి 25న ఆమెకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించింది. జనవరి 26న ఆమె తన కుమారుడు ‘రవి కపూర్‌’ మొదటి పుట్టిన రోజును ముంబైలో ఘనంగా నిర్వహించింది. ఏక్తాకపూర్‌అవివాహిత. కాని సహజాతమైన మాతృత్వ వాంఛను పరిపూర్ణం చేసుకోవడానికి సరొగసి ద్వారా ఆమె బిడ్డకు తల్లి అయ్యారు. పెళ్లికి దూరంగా ఉండదలిచిన ఆమె సోదరుడు, నటుడు తుషార్‌ కపూర్‌ కూడా సరొగసి ద్వారానే కుమారుడిని పొందాడు. టీవీనిర్మాతగా, నం.1 ప్రొడక్షన్‌ హౌస్‌ అధినేతగా ఏక్తాకపూర్‌ సాధించిన విజయాలు చిన్నవి కాదు. భారతీయ టీవీ సీరియళ్ల ధోరణిని మార్చేసిన వినోద సామ్రాజ్ఞి ఆమె.

అయితే ఆ గొప్పదనాలన్నీ తన కుమారుడి చిరునవ్వు ముందు దిగదుడుపే అంటుంది ఏక్తా. తన తండ్రి జితేంద్రతో (అసలు పేరు రవికపూర్‌) ఉండే విపరీతమైన అనుబంధం వల్ల ఆమె తన కుమారుడికి ఆయన అసలు పేరు ‘రవి కపూర్‌’ అని పెట్టుకుంది. న్యూమరాలజీని విపరీతంగా విశ్వసించే ఏక్తా కొడుకు స్పెల్లింగ్‌లో  'ravi' అని కాకుండా 'ravie' అనే అక్షరాలను ఉంచింది. ముంబై శివార్లలో జరిగిన ఈ పుట్టిన రోజువేడుకలకు జితేంద్ర, తుషార్‌లతో పాటు రితేష్‌–జెనీలియా, హేమమాలిని కుమార్తె ఈషా డియోల్‌లతో పాటు టెలివిజన్‌ రంగం నుంచి తారలు చాలామంది హాజరయ్యారు.

మరిన్ని వార్తలు