కీళ్ల కదలికలతోనూ విద్యుత్తు...

22 Jul, 2019 11:09 IST|Sakshi

మనం నడుస్తూంటే.. కీళ్లు కూడా కదులుతూంటాయి. మరి ఈ కదలికలను కాస్తా  విద్యుదుత్పత్తికి వాడుకునేలా చైనీస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హాంగ్‌కాంగ్‌ శాస్త్రవేత్తలు ఒక పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఒక్కో పరికరం ఉత్పత్తి చేసే 1.6 మైక్రోవాట్ల విద్యుత్తుతో జీపీఎస్‌ పరికరాలు, ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఉపయోగించే పరికరాలను నడిపేందుకు ఉపయోగించుకోవచ్చునని అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. ప్రత్యేకమైన మైక్రోఫైబర్‌ పదార్థంతో తయారైన ఈ పరికరాన్ని మోకాళ్ల వద్ద బిగించుకోవాల్సి ఉంటుందని... శరీరంలోని ఇతర కీళ్ల కంటే మోకాలి కీలు ద్వారా ఎక్కువ కదలికలు ఉంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లియావ్‌ తెలిపారు.

మనిషి కదలికల ద్వారా పుట్టే కంపనాలు చాలా నెమ్మదిగా ఉంటాయని ఫలితంగా విద్యుదుత్పత్తి చేయడం కష్టమవుతుందని.. తాము మాత్రం ఈ సమస్యను అధిగమించేందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నామని లియావ్‌ వివరించారు. ప్రస్తుతం తాము అభివృద్ధి చేసిన యంత్రం దాదాపు 307 గ్రాముల బరువు ఉందని, గంటకు రెండు నుంచి 6.5 కిలోమీటర్ల వేగంతో నడిచే మనుషులపై తాము ఈ యంత్రాన్ని పరిక్షించి చూశామని వివరించారు. యంత్రం ధరించినప్పుడు, సాధారణ పరిస్థితుల్లో వీరి ఉచ్ఛ్వాస నిశ్వాసలను పరిశీలించిన తరువాత యంత్రాన్ని మోసేందుకు ఉపయోగిస్తున్న శక్తి కంటే విద్యుదుత్పత్తి ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని వివరించారు. 

>
మరిన్ని వార్తలు