దేవుని ఆశ్రయిస్తే అంతా బలవంతులే!

7 Feb, 2016 00:46 IST|Sakshi
దేవుని ఆశ్రయిస్తే అంతా బలవంతులే!

సువార్త
తనకన్నా బలవంతులు లేరని విర్రవీగే ఒక ఏనుగు మీరెంత, మీ బలమెంత? అని చీమల్ని అవమానించేదట. దానికి బుద్ధి చెప్పాలనుకున్న ఒక చీమ మెల్లిగా ఎగబాకి దాని చెవిలో దూరి నానా గందరగోళం చేయసాగింది. చెవిలో ఏం జరుగుతోందో తెలియక ఆ బాధ భరించలేక ఏనుగు భీకరంగా అరుస్తూ మెలికలు తిరుగుతోంది. ఇప్పుడర్థమైందా నీ బలం నీది, మా బలం మాదని చీమ చెవిలో అంటే, క్షమించి తనను వదిలేయమని ఏనుగు ప్రాధేయపడిందట.
 
రోమా పాలకులతో పోల్చితే మొదటి శతాబ్దపు ఆదిమ విశ్వాసులు చీమలే, బలహీనులే! ప్రపంచమంతా తిరుగులేకుండా ఆధిపత్యాన్ని చలాయించే రోమా పాలకులు కొత్త మతంగా ఆరంభమైన క్రైస్తవం వ్యాప్తిని అడ్డుకునేందుకు నానా చిత్రహింసలు పెట్టారు. సజీవదహనం చేశారు, నడి వీదుల్లో ఉరి తీశారు, వారిని సింహాలకు ఆహారంగా వేసి వినోదం చూశారు. వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులు పునాదిగా గల క్రైస్తవం ప్రబలితే తమ సామ్రాజ్యపు పునాదులు కదిలిపోతాయని వారు భయపడ్డారు. అయినా రోమా సామ్రాజ్యమంతా సువార్త వ్యాపించి అంతటా చర్చిలు వెలిశాయి.

విశ్వాసులు ఏర్పడ్డారు. ఈ సువార్త ఉద్యమానికి సారథిగా చెప్పదగిన అపొస్తలుడైన పౌలు ఎక్కువ కాలం రోమా జైళ్లలోనే మగ్గినా ఉద్యమం ఉధృతంగా సాగింది. చివరగా పౌలుకు సీజర్ చక్రవర్తి శిరచ్ఛేదనం ద్వారా మరణశిక్ష అమలు చేయాలని తీర్పునిస్తే, మరణశిక్ష పడ్డ ఖైదీగా పౌలు రోమా చెరసాలలో ఉంటూ కూడా చక్రవర్తి సీజర్ పరివారంలోని వారిని కూడా యేసుక్రీస్తుకు అనుచరులను చేశాడు. అలా చెరసాలలో నుండి ఫిలిప్పీ చర్చికి రాసిన లేఖలో ‘సీజర్ గృహం నుంచి పరిశుద్ధులు మీకు వందనం చెబుతున్నారని’ పౌలు రాయడమే దానికి రుజువు (ఫిలిప్పీ 4:22). క్రైస్తవ్యాన్ని అడ్డుకోవడానికి కంకణం కట్టుకున్న చక్రవర్తి సీజర్ రాజభవనం లోనికే సువార్తను వ్యాపింపజేసి వారిని రక్షించడం మాటలు కాదు. పౌలు ఉద్యమ శక్తికి జోహార్లు.
 
సృష్టిలో ఏ జీవికీ, ఏ జాతికీ దేవుడు
నిస్సహాయతనివ్వలేదు. మనకు కనిపించే అణచివేత, దౌర్జన్యం, హింస ఇవన్నీ మనిషి తన స్వార్థం, అహంకారంతో సృష్టించినవే. ఎవరి పరిధిలో వాళ్లు గొప్పవాళ్లే, బలవంతులే! ముఖ్యంగా యేసుక్రీస్తును ఆశ్రయించిన విశ్వాసిలో నిస్సహాయతకు, నిరుపయోగత్వానికి, జడత్వానికి తావులేదు. విశ్వాసి లోకంతో రాజీ పడితే సమస్యలే లేవు. కాని దేవుని పద్ధతుల్లో జీవించాలనుకుంటేనే సవాళ్లు, ప్రతికూలతలు. అయితే ఒక సరళరేఖలాగా ససమస్యలు లేకుండా సాఫీగా సాగే జీవితాన్ని దేవుడు విశ్వాసికి వాగ్దానం చేయలేదు.

మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెల్లాగా పంపుతున్నానని యేసుక్రీస్తు తన శిష్యులతో అన్నారు. అంతమాత్రాన గొర్రెల్ని తోడేళ్లు పీక్కుతింటాయని కాదు. గొర్రెల కాపరియైన యేసుక్రీస్తు కొదమ సింహంలా కాపలా కాస్తుంటే తోడేళ్లేం చేయగలవు? ప్రతికూలతలు తప్పవన్నది సారాంశం. విశ్వాసి జీవితం పోరాటమే కాని అతనిదే అంతిమ విజయం కూడా! తాను బలహీనుడనని గ్రహించి దేవుని శక్తిని ఆశ్రయించి ఆయన మీద పూర్తిగా ఆనుకున్న వాడే అత్యంత బలవంతుడు.

అందువల్ల నేను బలవంతుడనని విర్రవీగే వాడు లోకంలో అత్యంత బలహీనుడు. పతనం, ఓటమి అతని కోసం కాచుకొని ఉంటాయి. దేవుని విశ్వసించాలే తప్ప చింతించడం విశ్వాసి లక్షణం కాదు. చింతిస్తే రేపటి సమస్యలు సమసిపోవు, నేడున్న మన బలం ఆవిరైపోతుంది. ‘భయపడవద్దు, నీ దేవుడనైన నేను నీకు సహాయం చేస్తాను. నీ కుడి చెయ్యి పట్టుకుంటాను. అన్నది విశ్వాసికి దేవుడిచ్చే గొప్ప వాగ్దానం (యెషయా 41:13).
 - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్

మరిన్ని వార్తలు