గతాన్ని ఇష్టపడినవాడే..భవిష్యత్తుని మలుచుకోగలడు!

12 Jan, 2014 00:12 IST|Sakshi
గతాన్ని ఇష్టపడినవాడే..భవిష్యత్తుని మలుచుకోగలడు!

అరుంధతి, అంజి, అమ్మోరు... ఎలాంటి మనిషి ఈయన?
 అంటే?!
 దేవి, దేవుళ్లు, దేవీపుత్రుడు... ఏమీ స్పెషల్‌గా అనిపించడం లేదా?
 అన్నీ స్పెషలే కదా!
 అవన్నీ స్పెషలే. కోడి రామకృష్ణలో స్పెషలేమిటని?
 సెంటిమెంట్లు ఎక్కువలా ఉంది. పూర్వజన్మలపై మక్కువలా ఉంది.
 రెండూ కరెక్టే. మొదటిది ఇంకా కరెక్టు!
 రామకృష్ణ జననం పెద్ద సెంటిమెంటు.
 దాసరిగారి కారెక్కడం సెంటిమెంటు.
 చిరంజీవి పెట్టిన పరీక్ష సెంటిమెంటు.
 తలకు చుట్టుకున్న తుండుగుడ్డ సెంటిమెంటు.
 దేవతలపైనే కాదు, మనుషుల మీదా సినిమాలు తీశారు రామకృష్ణ.
 ఈ ఏడాది మరో రెండుమూడు రాబోతున్నాయి.
 మనుషులవా? దేవతలవా?
 ఏవైనా కావచ్చు.
 ఏడాదికొక్కటైనా సినిమా తియ్యాలన్న సెంటిమెంట్
 అయనకుందో లేదో కానీ...
 ఆయన చిత్రం ఏడాదికొక్కటైనా రిలీజ్ అయితే
 బాగుంటుందనుకునే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు.
 ఈవారం ‘తారాంతరంగం’ చదవండి.
 కోడి లైఫ్‌లో కొత్త సినిమా కనిపిస్తుంది.

 
 మీ జీవితాన్ని ఓ పుస్తకం అనుకుంటే.. దానిలో పేజీలన్నీ దాదాపు అందరూ చదివినవే. మీకు తెలిసి చదవని పేజీలు ఏమైనా ఉన్నాయా?
 కోడి రామకృష్ణ: ఎందుకుండవ్.. ఉంటాయి. నాన్న జ్ఞాపకాలు, అమ్మ ఉత్తరాలు, స్కూల్‌డేస్‌లో తోటి విద్యార్థుల ఫిర్యాదులు, ఊళ్లో వేసిన నాటకాలు.. చెప్పుకుంటూ పోతే.. ఎన్నో.
 
 అలా అయితే... కొన్ని చెప్పండి? ముందు మీ బాల్యం.
 కోడి రామకృష్ణ: మాది పాలకొల్లు. నాన్న పేరు కోడి నరసింహమూర్తి, అమ్మపేరు చిట్టెమ్మ. మా అమ్మానాన్నలకు నేనంటే చాలా ఇష్టం. మా వీధిలో అందరూ నన్ను అమితంగా ఇష్టపడేవారు. ఎందుకంటే... నేను పుట్టాకే మా వీధిలో అందరికీ పిల్లలు పుట్టారట. దాంతో నేనంటే అందరికీ పెద్ద సెంటిమెంట్. ఎంత సెంటిమెంట్ అంటే.. నెల పొడుపు రోజున సాయంత్రం  చంద్రుడు కనిపించగానే.. చూసినవారందరూ ఒక్కసారిగా కళ్లు మూసుకొని.. ‘పెద్దబాబూ.. రాముడూ..’ అని పెద్దగా అరిచేవారు. నేనెళ్లి.. ఒక్కొక్కర్నీ తాకేవాణ్ణి. అప్పుడు కళ్లు తెరిచి నా వైపు చూసేవారు. అంత సెంటిమెంట్! మా వీధిలో సెంటిమెంట్లు ఏ రేంజ్‌లో ఉండేవో చెప్పడానికి ఓ సరదా ఇన్సిడెంట్ చెబుతా. మా వీధిలో ఓ బ్రాహ్మలావిడ ఉండేది. వారి ఎదురింట్లో శిరోమణి అనే ఆవిడ ఉండేది. వీళ్లిద్దరికీ అస్సలు పడదు. ఈవిడ శిరోమణిని తెగ తిడుతుండేది. ఓరోజు అనుకోకుండా శిరోమణి చనిపోయింది. ఆమె చావు తర్వాత కూడా ఈవిడ గొడవ మానలేదు. శిరోమణి పిల్లల్ని కూడా చీటికిమాటికీ తిట్టేది. ఓ రోజు ఉన్నట్లుండి బ్రాహ్మలావిడ వింతగా ప్రవర్తించడం మొదలెట్టింది. కోడిమాంసం కావాలని గోల గోల. బ్రాహ్మణస్త్రీ చికెన్ అడగడమేంటని వీధంతా వింతగా చెప్పుకోవడం మొదలెట్టింది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, శిరోమణి దెయ్యమై.. ఆ బ్రాహ్మలావిడను పట్టిందట. ఆ శిరోమణి అమ్మకు బాగా పరిచయం. దాంతో అమ్మ వెళ్లి.. ‘శిరోమణి.. ఏంటే ఇదంతా..’ అంది. ‘ఇది నా పిల్లల్ని తిట్టిందక్కా.. దీంతో కోడిమాంసం తినిపించేదాకా వదల్ను’ అని బ్రాహ్మలామె. నాకేమో అంతా వింతగా ఉంది. చుట్టుపక్కల వాళ్లు కూడా ఎంతో చెప్పి చూశారు. కానీ శిరోమణి ఆత్మ మాత్రం శాంతించడంలా. ‘మాంసం తేవాల్సిందే. దీంతో తినిపించాల్సిందే.. లేకపోతే నా పిల్లల్ని తిడుతుందా’ అని ఊగిపోతోంది. అప్పుడొచ్చాడు నాన్న. ‘ఏంటి?’ అనడిగితే.. విషయం చెప్పారు. సరాసరి ఆమె ముందుకెళ్లాడు. నాన్నను చూడగానే.. ఆమె కర్టెన్ చాటున దాక్కుంది. ‘ఏంటే ఇదంతా.. బ్రాహ్మలు కదా.. అలా చేయొచ్చా?’ అన్నాడు నాన్న. ‘ఏంటి బావగారూ మీరూ అలా మాట్లాడతారు. ఇది నన్ను తిట్టిందండీ... ఇప్పుడు నా పిల్లలమీద పడింది. అందుకే.. చికెన్ తినిపించేదాకా వదల్ను’ అంది ఏడుస్తూ... ‘తప్పే.. అలా చేయడం పాపమే. వెళ్లిపో.. నీ పిల్లల్ని నేను చూసుకుంటా. నాపై నమ్మకం ఉంటే వెళ్లిపో’ అని నాన్నా... ‘ఇది నా పిల్లల్ని తిట్టింది బావగారూ..’ అని ఆమె... ‘తిడితే చావగొడదాం సరేనా..’ అని నాన్న. ఎట్టకేలకు శాంతించిందామె. ‘ఓ అరటిపండు పెట్టండి వెళతా’ అంది. అమృతపాణీ తెప్పించి నాన్నే స్వయంగా వలిచి పెట్టారు. ఆ క్షణంలో నాన్న కళ్లలో నీళ్లు చూశా. ఆ పండు తినగానే.. ఆమెకు స్పృహ తప్పింది. చూస్తున్న నాకు ఇదంతా వింతగా అనిపించింది. చనిపోయాక కూడా నాన్నపై గౌరవం తగ్గకపోవడం గ్రేట్ అనిపించింది. దెయ్యాలు, భూతాలు నిజమని చెప్పను కానీ, మా వీధి సెంటిమెంట్లు అలా ఉండేవి.
 
 అమ్మానాన్నలతో మీ అనుబంధం?
 కోడి రామకృష్ణ: మా అమ్మానాన్నలకు నేను తొలిసంతానం. నా లైఫ్‌లో నేను చూసిన తొలి హీరో నాన్న. ఆయన రిటైర్డ్ మేజర్.  మా నాన్న ఎంత చండశాసనుడో అంత అమాయకుడు కూడా. అప్పట్లోనే సినిమాల్లో వేషాలిప్పిస్తాం, సినిమాలు తీస్తాం అంటూ కొన్ని ఫ్రాడ్ బ్యాచ్‌లు మా ఊళ్లో తిరుగుతుండేవి. వాళ్లను ఇంటికి తీసుకొచ్చి, వాళ్లందరితో కూల్‌డ్రింకులు తాగించి, నా ఫొటోలు చూపిస్తుండేవారు నాన్న. నేను స్కూల్‌నుంచి వచ్చేసరికి వారందరూ వరండాలో కూర్చొని ఉండేవారు. వాళ్లను చూసి సెలైంట్‌గా ఇంట్లోకెళ్లేవాణ్ణి. నా వెనకే నాన్న వచ్చేవాడు. ‘వాళ్లు సినిమా తీస్తారంటరా. నీ గురించి చెప్పాను. నీ ఫొటోలు కూడా చూపించాను’ అని గుసగుసగా చెప్పేవారు. ‘అయ్యో నాన్నా, వాళ్లు దొంగలు. వృథాగా డబ్బులు ఖర్చు చేస్తున్నావ్. వాళ్లను పంపించేయ్’ అని మందలింపుగా చెప్పేవాణ్ణి. నిజం తెలుసుకొని వాళ్లను తరిమేసేవారు. ‘మనింట్లో డిగ్రీ చదివిన వాళ్లు లేరు. నువ్వు చదవాలి’ అని ఒకరోజు నాన్న నాతో అన్నారు. ‘మీ కోసం డిగ్రీ చదువుతాను. అయితే.. మధ్యలో ఎక్కడైనా తప్పితే మాత్రం అక్కడే ఆపేస్తా’ అని ఫిటింగ్ పెట్టాను. ‘నువ్వు తప్పవ్. నీపై నాకు నమ్మకం ఉంది’ అన్నారు నాన్న. మేం నాటకం రిహార్సల్స్‌లో ఉండగా పీయూసీ రిజల్ట్స్ వచ్చాయి. నా నంబర్ పేపర్‌లో లేదు. తప్పాను. ఇక చదవనవసరం లేదు. నిర్ణయం తీసేసుకొని, ఇంటికెళ్లాను. అక్కడి పరిస్థితి చూడగానే షాక్. ఇరుగుపొరుగు వాళ్లకు నాన్న స్వీట్స్ పంచుతున్నారు. ‘ఓరి నాయనో.. ఈయన పేపర్ చూడలేదులా ఉంది..’ అనుకుంటూ ఆయన ముందుకెళ్లాను. నన్ను చూడగానే, ‘ఏయ్.. డిగ్రీ కూడా ఇలాగే పాసవ్వాలి. లేకపోతే చంపేస్తా’ అన్నారు ప్రౌడ్‌గా. నాకేమో అయోమయం! ఇంతలో మా తమ్ముడొచ్చి ‘నువ్వు సెకండ్‌క్లాస్‌లో పాసయ్యావ్రా’ అన్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు. నేను థర్డ్ క్లాస్‌లో మాత్రమే చూశానని, సెకండ్ క్లాస్‌లో చూడలేదని.
 
 కాలేజ్ టైమ్‌లో ప్రేమకథ ఏమైనా నడిపారా?
 కోడి రామకృష్ణ: అప్పట్లో మాకు ఆత్మీయత తెలుసు, అందం తెలుసు. మా ఆలోచనలు అంతవరకే. పరిధులు దాటేవి కావు. మీరు అడిగారు కాబట్టి గుర్తున్న ఓ సంఘటన చెబుతాను. కాలేజ్ టైమ్‌లో నాకు ఓ స్టడీరూమ్ ఉండేది. నేను బొమ్మలు బాగా వేసేవాణ్ణి. అందుకే... సైన్స్ రికార్డ్స్‌లో బొమ్మలు గీయించుకోవడానికి అమ్మాయిలు నా రూమ్‌కొచ్చేవారు. అందరూ లవ్‌లీగా ఉండేవారు. ఆ అమ్మాయిల్లో ‘5 నంబర్ గోల్డ్’ అనే ఓ అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. తన రోల్ నంబర్ 5. ఇంటిపేరేమో ‘బంగారు’. అందుకే ‘5 నంబర్ గోల్డ్’ అని పిలిచేవాళ్లం. అసలు పేరు గుర్తులేదు. నాతో బొమ్మలు గీయించుకోవడానికి తానూ వచ్చేది. ఇంతమంది ఆడపిల్లలు నా దగ్గరకొస్తుంటే.. జెలసీగా ఫీలయ్యేవారు కూడా ఉంటారు కదా. ఎవడో వెళ్లి ‘5 నంబర్ గోల్డ్’ వాళ్ల అన్నయ్యకు చెప్పాడు ‘మీ చెల్లెలు రామకృష్ణతో క్లోజ్‌గా ఉంటోంది’ అని. నేను కాలేజ్‌కి వెళ్లే దారిలో వాళ్లన్నయ్య కాపు కాశాడు. నన్ను ఆపాడు. ‘జాగ్రత్త ఏమనుకున్నావో! ఏంటి? మా చెల్లితో మాట్లాడుతున్నావంట’ అన్నాడు సీరియస్‌గా. ‘మాట్లాడితే ఏమైంది’ అన్నాను. ‘మీ ఇద్దరూ దగ్గరగా ఉంటున్నారట’ అని సణిగాడు. ‘దగ్గరగా ఉంటే ఏమైందిరా?’ అని నేను దీటుగా ప్రశ్నించా. ‘సరేలే... నీ నాటకంలో నాకూ వేషం ఇస్తావా?’ అని అడిగాడు నింపాదిగా. ‘ఇస్తాలే’ అని మాటిచ్చాను. నా కాలేజ్ రోజుల్లో ఇలాంటి అనుభవాలు ఎన్నో.
 
 సినిమాపై మీ తొలి అడుగులు ఎలా పడ్డాయి?
 కోడి రామకృష్ణ: చిన్నప్పట్నుంచీ పెయింటింగ్ అంటే ఇష్టం. అజంతా ఆర్ట్స్ పేరుతో మా ఊళ్లో పెయింటింగ్ షాప్ కూడా పెట్టాను. గోడల మీద వాటర్ పెయింటింగ్ బోర్డ్స్ రాసేవాణ్ణి. అలాగే.. ఆయిల్ పెయింటింగ్ బోర్డ్స్ కూడా. సినిమా హాళ్లకు ‘పొగత్రాగరాదు’, ‘నిశ్శబ్దం’, ‘ముందు సీట్లపై కాళ్లు పెట్టరాదు’.. ఇలా రకరకాల స్లయిడ్స్ ఫ్రీగా చేసిచ్చేవాణ్ణి. ఆ స్లయిడ్స్‌కి ఓ మూల ‘కోడి రామకృష్ణ’ అని నా పేరు రాసుకునేవాణ్ణి. తెరపై నా పేరు చూసుకోడానికే థియేటర్‌కి వెళ్లేవాణ్ణి. ప్రొజెక్టర్ దగ్గర నిలబడి, నా స్లయిడ్ పడేదాకా ఉండి, తెరపై నా పేరును చూసుకొని అప్పుడు షాప్‌కి వెళ్లేవాణ్ణి. సినిమాపై అభిమానానికి బీజం పడింది అక్కడే. అలాగే.. చిన్నప్పట్నుంచీ నాటకాల పిచ్చి. పసుపు, కుంకుమ, బొగ్గు, పౌడర్లతో మేకప్ చేసుకొని... వీధి మధ్యలో ఓ నులక మంచాన్ని నిలబెట్టి, దానికో తెరకట్టి పిల్లలందరం నాటకాలు వేసేవాళ్లం. రైటర్‌ని, డెరైక్టర్‌ని, హీరోని నేనే. మా వీధిలో కొన్ని కుటుంబాల్లో జరిగిన సంఘటనల్నే స్ఫూర్తిగా తీసుకొని కథల్ని, పాత్రల్ని సృష్టించేసేవాణ్ణి. లైవ్‌లో డైలాగులు చెప్పించేసేవాణ్ణి. తర్వాత ట్రూప్ నాటకాల స్థాయికి చేరా. పరిషత్తులకు కూడా వెళ్లేవాళ్లం. దాదాపు వందకు పైగానే నాటకాలు రాసి, ప్రదర్శించాను. నా ఫ్రెండ్ లైఫ్‌ని ప్రేరణగా తీసుకొని రాసిన ‘రేపు సెలవు’ నాటిక నాకు మంచి పేరు తెచ్చింది. అల్లు రామలింగయ్యగార్కి అప్పట్లో నాటకం ట్రూప్ ఉండేది. ‘ఆడది’ అనే కమర్షియల్ నాటకం ఆడుతూ ఉండేవారు. ఆ నాటకంలో నేనే హీరో. లింగయ్యగారు దర్శకుడు. ఇదిలావుంటే.. టి.నాగేశ్వరరావుగారనీ... పెయింటింగ్‌లో నా గురువు. ఆయన దగ్గర నేను లితోలకు వర్క్ చేసేవాణ్ణి. ఆయనకు ఓ ఫొటో స్టూడియో కూడా ఉంది. అక్కడ నా ఫొటోలు తీసి... ‘కొత్త హీరో కావాలి’ అనే ప్రకటన పేపర్లలో కనిపిస్తే పంపించేరు. నాకూ ఫస్ట్‌లో ఆర్టిస్ట్ అవ్వాలనే ఉండేది. అలాంటి టైమ్‌లోనే మా ఊళ్లో ఓ సినిమా రిలీజైంది. ఆ సినిమా దర్శకుడికి అదే తొలి సినిమా. ఏ వీధిలో చూసినా ఆ సినిమా డిస్కషనే. ఆ సినిమా సంచలనం చూశాక అనిపించింది... ‘యాక్టర్ అయితే... ఒక్క పాత్రనే చెప్పచ్చు. అదే డెరైక్టరయితే.. ఎన్నో పాత్రల్ని చెప్పొచ్చు’ అని. నాలో డెరైక్టర్ అవ్వాలనే కాంక్షను పెంచిన ఆ సినిమానే ‘తాతా మనవడు’. ఆ డెరైక్టరే మా గురువుగారు దాసరి నారాయణరావు. ఎలాగైనా ఆయన్ను కలవాలి. ఇదే నా ఆలోచన.
 
 మరి ఎలా కలిశారు?
 కోడి రామకృష్ణ: గురువుగార్ని నా చిన్నప్పట్నుంచీ చూస్తూనే ఉన్నాను. ఆయన చదివిన స్కూల్లోనే నేను చదువుకున్నా. నేను ఫస్ట్ ఫారం.. ఆయనేమో ఇంటర్ సెకండియర్. ‘నేను నా స్కూల్’ అనే నాటికను గురువుగారు స్వయంగా రాసి మా స్కూల్లో ప్రదర్శించారు. గ్రీన్ రూమ్‌లో వాళ్లు మేకప్‌లు చేసుకుంటుంటే... మేమందరం కిటికీల్లోంచి చూసేవాళ్లం. ఆ రోజుల్లో సుబ్బరాయశాస్త్రిగారని మా స్కౌట్ మాస్టారు ‘పంచవర్ష ప్రణాళికలు’ అనే నాటికను రాశారు. దాన్ని గురువుగారు డెరైక్ట్ చేసి నటించారు. ఢిల్లీలో ఆ నాటికను ప్రదర్శిస్తే.. నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సందర్భంగా గురువుగారినీ ఆయన ట్రూప్‌ని పాలకొల్లులో లారీపై ఊరేగించారు. ఆర్టిస్ట్ అయితే క్రేజ్ ఎలా ఉంటుందో అప్పుడే తెలిసింది. ‘తాతా మనవడు’ సూపర్‌హిట్ అయినప్పుడు... అదంతా నా అదృష్టమే అనుకున్నా. ఆ సినిమా యాభై రోజుల పండుగ సందర్భంగా గురువుగారు నేరుగా పాలకొల్లే వస్తున్నారనే సంగతి తెలిసింది. సరిగ్గా ఆ టైమ్‌లోనే ‘జై ఆంధ్ర’ ఉద్యమం నడుస్తోంది. పైగా ‘తాతామనవడు’ రిలీజైన థియేటర్ వాళ్లకు, మా స్టూడెంట్లకు పడదు. అలాంటి వేడి వాతావరణంలో ఫంక్షన్. ఎలాగైనా ఫంక్షన్ పాడుచేయాలని స్టూడెంట్లందరూ కంకణం కట్టుకున్నారు. పైగా అప్పట్లో స్టూడెంట్ లీడర్‌ని నేనే.నాకేమో.. ఎలాగైనా గురువుగారిని కలిసి అవకాశం అడగాలనుంది. తోటి విద్యార్థులేమో.. ఫంక్షన్ పాడు చేయాలంటున్నారు. ఇక నేను అందర్నీ రిక్వెస్ట్ చేసుకున్నా. ‘గురువుగారు వస్తున్నారు. ఎలాగైనా ఆయన్ను కలవాలి. అవకాశం అడగాలి. మళ్లీ ఇలాంటి అవకాశం రాదు.. ప్లీజ్’ అని బతిమాలుకున్నాను. దాంతో ఓ షరతుపై వాళ్లు ఒప్పుకున్నారు. అదేంటంటే... ‘మేం థియేటర్‌కి వస్తాం. నేల టికెట్లో కూర్చుంటాం. ఆ థియేటర్ ఓనర్‌గాడు.. ఎక్కువ తక్కువగా మాట్లాడితే మాత్రం కొట్టేస్తాం. అందుకు నువ్వు ‘ఓకే’ అయితే.. మేమూ ‘ఓకే’ అని. నాకేమో టెన్షన్. గురువుగారు, కె.రాఘవగారు, ఎస్వీ రంగారావుగారు ఇలా... అందరూ వచ్చారు. నేనెళ్లి ధైర్యంగా గురువుగార్ని కలిశాను. ‘మీ దగ్గర సహాయకునిగా చేరాలనుకుంటున్నాను. అవకాశం ఇవ్వండి సార్’ అని ప్రాధేయపడ్డాను. ‘ఏం చదివావ్’ అనడిగారు. ‘బీకాం చదువుతున్నాను సార్’ అని చెప్పాను. అయితే.. ‘పూర్తి చేసి రా’ అన్నారు. సన్మానపత్రం రాసి స్వయంగా చదివాను. అంతా ప్రశాంతంగా జరిగిపోతోంది అనుకుంటుండగా... ఆ థియేటర్ ఓనర్ మైక్‌లో మాట్లాడ్డం మొదలెట్టాడు. ‘పాలకొల్లుకే పేరు తెచ్చిపెట్టారు దాసరి. యువతరం దాసరిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయనలా ఎదగాలి. అంతే కానీ... మీలా కుక్కల్లా, పందుల్లా వీధుల్లో తిరగడం కాదు కుర్రాళ్లు చేయాల్సింది’ అనేశాడు. ఇంకేముంది? వాతావరణం రణరంగాన్నే తలపించింది. ఏదిఏమైనా గురువుగారి మాట ప్రకారం బీకాం పూర్తి చేసి చెన్నయ్ రెలైక్కాను.  
 
 వెళ్లగానే దాసరిగారు ఎలా రిసీవ్ చేసుకున్నారు?
 కోడి రామకృష్ణ: ఆయన రిసీవింగ్ గమ్మత్తుగా జరిగింది. నేను పాలకొల్లులో ఉన్నప్పుడే.. కాకినాడలో ‘రాధమ్మపెళ్లి’ షూటింగ్ జరిగింది. గురువుగారు వచ్చారని తెలిసి... కాకినాడ వెళ్లాను. నన్ను చూడగానే.. ఓ కేరక్టర్ ఇచ్చేశారు గురువుగారు. శారదగారికి అందులో ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ఆ ఇద్దరిలో నేనొకణ్ణి. మా కాంబినేషన్ సీన్స్ తీసేసి, మద్రాస్ వెళ్లిపోయారు. ఆ సన్నివేశాలకు సంబంధించిన ప్యాచ్‌వర్క్ మాత్రం మిగిలి ఉంది. దాన్ని మద్రాస్‌లోని శివాజీ గార్డెన్స్‌లో తీస్తున్నారు. నేను చేసిన పాత్రకు ఓ డూప్‌ని ఏర్పాటు చేశారు. కానీ అతగాడు సెట్ కావడం లేదు. దాంతో కంగారు పడిపోతున్నారు. అలాంటి టైమ్‌లో నేను మద్రాసు వచ్చి, గురువుగారిని వెతుక్కుంటూ శివాజీ గార్డెన్స్‌లో అడుగుపెట్టాను. నన్ను చూడగానే.. ఆ యూనిట్‌కి ఆనందం ఆగలేదు. భలే వచ్చావయ్యా... అంటూ గబగబా.. కాస్ట్యూమ్స్ తొడిగేశారు. మేకప్ వేసేశారు. నాపై క్లాప్ కొడుతుండగా గురువుగారొచ్చారు. ‘అరే... ఎప్పుడొచ్చావ్. నీక్యారెక్టర్ పెద్దటెన్షనే పెట్టింది. భలే వచ్చావే. ఇక్కడకు రాగానే.. మొహానికి రంగేయించుకున్నావ్. క్లాప్ కొట్టించుకున్నావ్. అదృష్టవంతుడవయ్యా. ఇకనుంచి నువ్వు నాతోనే ఉంటావ్’ అని మాటిచ్చేశారు. ఆ రోజే ఆయన కారెక్కాను. అప్పట్నుంచి కారుల్లో తిరుగుతూనే ఉన్నాను.
 
 మీ తొలిచిత్రం ఇంట్లో ‘రామయ్య-వీధిలో కృష్ణయ్య’ విషయంలో ఏమైనా టెన్షన్ పడ్డారా?
 కోడి రామకృష్ణ: ఆ కథను నిర్మాత కె.రాఘవగారికి, చిరంజీవిగారికి చెప్పి, ఒప్పించే విషయంలో కాస్త టెన్షన్ పడ్డాను. అయితే... విపరీతంగా టెన్షన్ పడ్డ సంఘటన ఒకటుంది. ఆ సినిమా షూటింగ్‌ని గోదావరి ఒడ్డున ప్లాన్ చేశాం. చిరంజీవి.. బోట్‌లో కూర్చొని కమలాపండు తింటున్నారు. నేనేమో నది ఒడ్డున ఇసుకలో కూర్చున్నాను. చిరంజీవిగారు కమలా పండు తొనలు వొలుస్తూ... ‘రామకృష్ణా.. ఈ తొన నీపై విసురుతున్నా.. నువ్వు దాన్ని నోటితో క్యాచ్ చేయాలి. పట్టుకుంటే... సినిమా హిట్. మిస్ చేశావా.. సినిమా ఫ్లాప్’ అన్నారు. తొలి సినిమా. పైగా నాకు సెంటిమెంట్లు ఎక్కువ. ‘సార్... ఇది అన్యాయం’ అని మొత్తుకుంటున్నా ఆయన వినలేదు. తొనను విసిరారు. ఆ తొనను ప్రాణాలను సైతం పణంగా పెట్టి నోటితో క్యాచ్ పట్టుకున్నాను. ఆ తొనను నేను పట్టుకున్న తీరు గుర్తొస్తే ఇప్పటికీ ఆశ్చర్యమేస్తుంది. చిరంజీవిగారు ఇప్పటికీ అంటుంటారు. ‘భలే పట్టుకున్నావ్ రామకృష్ణా.. అప్పుడు ఏదో అనేశాను కానీ.. ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది.. నువ్వెంత టెన్షన్ పడ్డావో’ అని.
 
 ‘మంగమ్మగారి మనవడు’లో భానుమతిని మంగమ్మగా తీసుకోవడం మీ ఆలోచనేనా?
 కోడి రామకృష్ణ: అవును. ఆ ఆలోచన నాదే. అప్పటికి భార్గవ్ ఆర్ట్స్ బేనర్‌లో ‘ముక్కుపుడక’ సినిమా చేశాను. అది పెద్ద హిట్. రెండోసినిమా బాలకృష్ణతో చేద్దాం అన్నారు గోపాలరెడ్డి. కొంతమంది భయపెట్టారు. ‘ఎందుకు హీరోలతో తీయడం. ‘ముక్కుపుడక’లా మంచి కథల్తో వెళ్లొచ్చు కదా..’ అని. కానీ మొండిధైర్యంతో బాలయ్యతో వెళ్లాం. మంగమ్మ పాత్ర కథకు కీలకం. అందుకే భానుమతిగారైతే... కరెక్ట్ అని చెప్పాను. ఆమెతో తలనొప్పి అని, నచ్చకపోతే మధ్యలో వెళ్లిపోతుందని, పైగా మర్యాద లేకుండా మాట్లాడుతుందని ఏవేవో చెప్పారు. అవేమీ లెక్క చేయకుండా గోపాలరెడ్డిగారు, నేను భానుమతిగారిని కలిశాం. ‘మన్‌వాసనే’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నామని, అందులో కాంతిమతి చేసిన పాత్రను తమరు చేయాలని చెప్పాను. భానుమతిగారితో కంపేర్ చేస్తే.. కాంతిమతి చాలా చిన్ననటి. ఆమె పాత్రకు భానుమతిగార్ని అడిగేసరికి ఆమె మొహంలో రంగులు మారాయి. ‘కాంతిమతి పాత్ర నేను చేయాలా?’ అన్నారు సీరియస్‌గా. ‘అమ్మా... పాత్రను మీకు తగ్గట్టుగా డెవలప్ చేశాం. మీరు చేస్తే తప్ప ఈ ప్రాజెక్ట్‌కి నిండుదనం రాదు’ అని బతిమాలాను. ఎలాగో ఒప్పుకున్నారు. ‘అది సరేకానీ... నిన్ను ఏమని పిలవాలయ్యా... మా వారిపేరు నీ పేరు ఒకటే. నిన్ను పేరు పెట్టి పిలవలేను. అందుకే ‘డెరైక్టర్’ అని పిలుస్తా సరేనా’ అన్నారు. అలాగేనమ్మా అన్నాను. ఆ విధంగా ‘మంగమ్మగారి మనవడు’ షూటింగ్ మొదలైంది.
 
 ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ అందులో హీరో అంటే భానుమతి ఎలా రియాక్టయ్యారు?
 కోడి రామకృష్ణ: ఎనీఆర్‌గారంటే భానుమతిగారికీ అభిమానమే. ‘భానుమతిగారు కారు దిగగానే.. ముందు నువ్వే వెళ్లి డోర్ తీయ్’ అని ఎన్టీఆర్‌గారే బాలయ్యకు చెప్పారట. తండ్రి మాట ప్రకారం భానుమతిగారి కారు ఆగగానే.. స్వయంగా బాలయ్యే వెళ్లి డోర్ తీశారు. ఆ క్షణం భానుమతిగారిలో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. ‘మీ నాన్నలోని సంస్కారం మొత్తం నీలో ఉందిరా అబ్బాయ్’ అని పొంగిపోయారు. ఆమె ఎంత బోళామనిషో చెప్పడానికి ఇంకో ఇన్సిడెంట్ చెబుతాను. ‘మంగమ్మగారి మనవడు’లో కొన్ని డైలాగుల్ని కాస్త ఘాటుగానే రాశారు గణేశ్‌పాత్రో.  భానుమతిగారిపై తొలి షాట్. ‘బావగారొచ్చారని బట్టలేసుకోకుండా నిలబడిందంట.. నీ లాంటి భయంగల  బల్లి’ అనేది డైలాగ్. అది చదివి.. మరీ డైలాగు ఇంత ఘాటుగా ఉంటే ఎలాగురా.. నేను చెప్పను’ అనేశారు. ‘అమ్మా.. ప్లీజ్’ అని బతిమాలినా వినలేదు. ‘కొంచెం సరళంగా మార్చుకొని చెబుతా’ అన్నారు. సరే... అని ‘యాక్షన్’ చెప్పా... అంతకు ముందు చదివి ఉన్న డైలాగునే ఠకీమని చెప్పేశారు. ఆ సినిమా తీసింది ఓ పల్లెటూరిలో. దాంతో భానుమతిగారిని చూడటానికి తండోపతండాలుగా జనాలొచ్చేశారు. భానుమతిగారు ఈ డైలాగ్ చెప్పగానే... విజిల్సూ, కేకలు. ‘చూశారా.. మీరు మచ్చుకు ఒక్క డైలాగు చెబితేనే రెస్పాన్స్ ఎలా ఉందో. అదే ఇందులోని డైలాగులన్నీ ఇదే మూడ్‌తో చెప్పారంటే, స్పందన ఎలా ఉంటుందో అర్థంచేసుకోండి’ అన్నాను. ‘అంతేనంటావా.. సరే చెప్పేద్దాం’ అన్నారు. ఇక అప్పట్నుంచి ఎలాంటి ఇబ్బందీ పెట్టలేదు. స్క్రిప్ట్‌లో ఉన్న డైలాగుల్నే చెప్పారు. అంతటి బోళా మనిషి ఆమె. భానుమతిగారితో చేయగలగడం నేను చేసుకున్న అదృష్టం.
 
 మంగమ్మగారి మనవడు, ముద్దులకృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దులమామయ్య.. ఈ చిత్రాల్ని పక్కనపెట్టి బాలకృష్ణ కెరీర్‌ని ఊహించలేం. ఉన్నట్టుండి ఇద్దరూ ఎందుకు బ్రేకయ్యారు?
 కోడి రామకృష్ణ: మేం బ్రేక్ అవలేదండీ... అన్నీ కుదిరితే మా కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది. ‘భార్గవ్ ఆర్ట్స్’లో బాలయ్యతో నిజంగా గొప్ప సినిమాలే తీశాను. ఎస్.గోపాల్‌రెడ్డిగారిక్కూడా బాలయ్య అంటే అమితమైన అభిమానం. ‘మంగమ్మగారి మనవడు’ తర్వాత ఆయన టాప్‌స్టార్ అయిపోయాడు. అందుకు తగ్గట్టే.. బాలయ్యతో ఏ సినిమా తీసినా.. అడక్కుండానే పారితోషికం పెంచేసేవారు గోపాల్‌రెడ్డి. ‘ముద్దులమావయ్య’ తర్వాత బాలయ్య దాదాపు నంబర్‌వన్ అయ్యారు. ఆయన పారితోషికం కూడా చాలా పెరిగిపోయింది. ‘ఇప్పుడు బాలయ్యతో మనం సినిమా తీస్తే... మనకోసం ఆయన పారితోషికం తగ్గించుకోవాలి. అలాంటి పరిస్థితి నా బాలయ్యకు రాకూడదు. ఆ స్థాయి పారితోషికం ఇచ్చే స్థాయికి మనం చేరుకున్నాకే సినిమా తీద్దాం’ అన్నారు గోపాల్‌రెడ్డి. అందుకే మళ్లీ భార్గవ్ ఆర్ట్స్‌లో మా ముగ్గురి కాంబినేషన్‌లో సినిమాలు రాలేదు.
 
 మీ కాంబినేషన్‌లో ఓ జానపదం మొదలై, మధ్యలో ఆగిపోయింది. దానివిషయంలో గొడవలు జరిగాయని టాక్?
 కోడి రామకృష్ణ: అలాంటిదేం లేదు.. మేం ముగ్గురం పరస్పరం అభిమానించుకునేవాళ్లమే. కొందరు మధ్యవర్తుల కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఇందులో అంతకుమించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిజానికి సినిమా 60 శాతం పూర్తయింది. రెడ్డిగారు బతికుంటే..పూర్తి చేసేవాళ్లం.
 
 మీ నిర్మాతలు.. మరొకరితో సినిమాలు చేయడానికి ఇష్టపడరు. కారణం?
 కోడి రామకృష్ణ: ప్రొడ్యూసర్‌కు తెలియకుండా నేను ఏదీ చేయను. నిర్మాత అభిరుచికి తగ్గట్టే కథల్ని ఎంచుకుంటాను. అభిరుచి లేని వ్యక్తులతో పనిచేయను. నా సినిమాల్లో కచ్చితంగా నిర్మాత ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలని కోరుకుంటాను. ‘మీరు చూసిన పాత సినిమాల్లో మీకు బాగా నచ్చిన కథ ఏంటి? వాటిల్లో ఒక కథను ఎంచుకొని సినిమా తీయాల్సి వస్తే... ఏ కథను ఎంచుకుంటారు? అని మురారి గారిని అడిగాను. ‘ఆత్మీయులు సినిమా కథంటే ఇష్టం. దాన్ని మళ్లీ తీయాలని ఉంది’ అని చెప్పారు. వెంటనే ఆ రాత్రి ఆత్మీయులు సినిమా చూసి, ‘శ్రీనివాసకల్యాణం’ కథ చేశాను. ఇలా తొలినుంచి నిర్మాతను బట్టే నడుచుకుంటున్నా. అమ్మోరు, అరుంధతి సినిమాలను కూడా శ్యామ్ అభిరుచికి తగ్గట్టే తీసిపెట్టాను. ‘దేవి’ చేసినా, ‘దేవుళ్లు’ చేసినా అన్నీ నిర్మాతల అభిరుచికి తగ్గట్టే ఉంటాయి. సినిమా రషెస్ చూసి.. ‘మనం అనుకున్నదానికంటే సినిమా బాగా తీశారండీ..’ అని నిర్మాత అన్నప్పుడే నేను దర్శకునిగా సక్సెస్ సాధించినట్లు. నా సినిమా నిర్మాతకు నచ్చాలి. తర్వాతే జనాలకి.
 
 తలకు గుడ్డ కట్టుకుంటారు. చేతికి దారాలు. ఎందుకని?
 కోడి రామకృష్ణ: ‘మా పల్లెలో గోపాలుడు’ షూటింగ్‌ని మద్రాస్ కొవలం బీచ్‌లో చేస్తున్నాం. నాకు గుర్తు అది మే నెల. విపరీతమైన ఎండలు. ఆ టైమ్‌లో మోకా రామారావుగారని ఎన్టీఆర్‌గారి కాస్ట్యూమర్. ‘మా పల్లెలో గోపాలుడు’కి కూడా కాస్ట్యూమర్ ఆయనే. ఓ మధ్యాహ్నం ఆయన నా దగ్గరకొచ్చి ‘మీ ఫోర్ హెడ్ చాలా పెద్దది. ఎండలో అది బాగా ఎక్స్‌పోజ్ అయిపోతోంది’ అని తన బాక్స్‌లోంచి ఓ జేబు రుమాల తీసి నా నుదుటికి కట్టాడు. ఆ రోజు మొత్తం ఆ రుమాల అలాగే ఉంది. రెండోరోజు ఆయనే వచ్చి, ‘సార్ మీకు కట్టాక అనిపిస్తోంది. ఇది ఇప్పటిది కాదు.. ప్రీవియస్ బర్త్‌ది. నాకు తెలిసి చాలామంది ఇలా కట్టుకున్నారు కానీ... మీకు మ్యాచ్ అయినట్లు ఎవరికీ కాలేదు’ అని చెప్పి, ఓ టర్కీటవల్‌తో ప్రత్యేకంగా నా నుదురు కొలత ప్రకారం ఓ బ్యాండ్‌లా చేయించి, నాకిస్తే... కట్టుకున్నాను. అది చూసిన ప్రతివారూ బాగుంది అన్నారు. చివరకు బాలచందర్‌గారు కూడా. ఓ సారి ఆయన మా సెట్‌కి వచ్చారు. నన్ను చూసి ‘ఓసారి అద్దంలో చూసుకో’ అన్నారు. చూసుకుంటే.. నా బ్యాండ్‌పై ఓ సీతాకోక చిలుక వాలి ఉంది. దాని కారణంగా అందంగా కనిపిస్తున్నాను. అప్పుడన్నాడాయన.. ‘ఇది ఈ జన్మది కాదయ్యా... కచ్చితంగా పూర్వజన్మదే. అందుకే నీకు అంతబాగా అతికింది’ అని. అప్పట్నుంచి ఈ కట్టు నాకు సెంటిమెంట్ అయిపోయింది. నా ఫ్రెండ్సందరూ ఆస్ట్రాలజర్స్. వారందరూ ప్రతినెలా కొన్ని తాళ్లు, ఉంగరాలు పంపిస్తుంటారు. అవి కట్టుకోకపోయినా, ఉంగరాలు తొడుక్కోకపోయినా వాళ్లూరుకోరు. అందుకే వారికోసం అవన్నీ కట్టుకుంటా. ఒకవేళ అవన్నీ తీసేసినా... యాదృచ్ఛికంగా ఎవరో ఒకరు వచ్చి కట్టి వెళుతుంటారు. నిజంగా ఇది విచిత్రమే.  సెంటిమెంట్లను నేను బాగా నమ్ముతాను.
 
 ఇప్పటికి ఎన్ని సినిమాలు తీసుంటారు?
 కోడి రామకృష్ణ: అంకె ఎవరికీ చెప్పలేదు. మీకే చెబుతున్నా. ప్రస్తుతం అర్జున్‌తో చేస్తున్న సినిమా, అవతారం, పుట్టపర్తి సాయిబాబా చిత్రాలను మినహాయిస్తే... ఇప్పటికి 138 అయ్యాయి. ‘వందవ సినిమా ఫలానా’ అని చెప్పుకోవడం నాకిష్టంలేదు. అందుకే ఎవరికీ చెప్పలేదు. ‘అంకుల్ ఆంజనేయస్వామి’ అని ఓ సినిమా చేయబోతున్నాను. వెరైటీ కాన్సెప్ట్. ఆంజనేయుడు, నలుగురు పిల్లలు కథ ఇది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లబోతోంది.
 
 త్వరలోనే గురువుగార్ని క్రాస్ చేయబోతున్నారన్నమాట?
 కోడి రామకృష్ణ: ఆ మాటనకండి. ఆయనెక్కడ... నేనెక్కడ!
 
 - బుర్రా నరసింహ
 
 మీతో మాట్లాడుతుంటే అర్థమవుతోంది... మీరు గతాన్ని బాగా ఇష్టపడతారని..!
 కోడి రామకృష్ణ: గతాన్ని ఇష్టపడినవాడు మాత్రమే భవిష్యత్తుని అందంగా మలచుకోగలడు. నా సినిమా కథలన్నీ నా జీవితంలో ఎదురైన అనుభవాలు, అనుభూతులే. మీకో విషయం తెలుసా? నా కెరీర్ ప్రారంభంలో మా అమ్మరాసిన ఉత్తరాలు ఇప్పటికే నేను చదువుతుంటాను. ‘పెద్దోడా... నిన్ను ఓసారి నానమ్మ చూడాలంటోంది రా, అమ్మమ్మావాళ్లు మొన్న ఇంటికొచ్చి వెళ్లారు. నిన్ను పదే పదే అడిగారు. మామయ్య వాళ్లు నిన్ను చూడ్డానికి వస్తాం అంటున్నారు’ అంటూ మా ఇంటి విషయాలన్నీ ఉత్తరాల్లో రాసేది. ఆ ఉత్తరాలు తీసి అప్పుడప్పుడు చదువుతుంటాను. అవి చదివినప్పుడల్లా... ఆ కేరక్టర్లన్నీ మళ్లీ నా దగ్గరకు వచ్చి వెళుతుంటాయి. నన్ను పలకరిస్తుంటాయి. మీకోవిషయం తెలుసా? వాళ్లల్లో ఎవరూ బతికిలేరు. చివరకు మా అమ్మతో సహా.
 
 150 సినిమాలు తీసిన దాసరి నుంచి 138 సినిమాలు తీసిన కోడి రామకృష్ణ లాంటి గ్రేట్ డెరైక్టర్ బయటకొచ్చారు. మరి మీ నుంచి గొప్ప దర్శకులు రాకపోవడానికి కారణం?

 కోడి రామకృష్ణ: గ్రేట్ డెరైక్టర్ అనిపించుకోవాలంటే... పట్టుదల అవసరం. పరిశీలనాత్మక దృష్టి అవసరం. నేను ఇరవైనాలుగ్గంటలూ గురువుగార్నే అబ్జర్వ్ చేస్తుండేవాణ్ణి. అదే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. గురువుగారిలా నేను కూడా నాటకరంగం నుంచే వచ్చినవాణ్ణి. అది కూడా నాకు హెల్ప్ అయ్యింది. పైగా మా భావాలను ధైర్యంగా మా గురువుగారికి చెప్పేవాళ్లం. అప్పట్లో గురువుగారి షూటింగ్‌లు రోజుకు నాలుగైదు జరుగుతుండేవి. ఓసారి స్క్రిప్ట్‌లో ఓ సన్నివేశం తృప్తిగా రాకపోవడంతో దాన్ని షూట్ చేయకుండా పక్కన పెట్టేశారు గురువుగారు. నేను ఆ సన్నివేశం గురించి అర్ధరాత్రి దాకా ఆలోచించి, అందులో ఓ చిన్న ఛేంజ్ చేసి, ఆ అర్ధరాత్రే గురువుగారి రూమ్ తలుపు తట్టాను. పద్మగారు తలుపు తీశారు. ‘ఏంటి రామకృష్ణ?’ అనడిగారు. ‘రేపు తీయబోయే సీన్ గురించి గురువుగారితో మాట్లాడాలి’ అన్నాను. ‘ఆయనతో పని చేసి ఆ పిచ్చి మీకూ తగులుకుంది. అర్ధరాత్రుళ్లు కూడా సినిమాల గోలేంట్రా’అని మందలించి, లోపలికి పంపించారు. ఆ టైమ్‌లో నేను రావడం చూసి ఎవరికైనా ఏమైనా జరిగిందేమోనని గురువుగారు కంగారు పడిపోయారు. ‘ఏంటి రామకృష్ణా..’ అన్నారు కంగారుగా. సీన్ గురించి చెప్పాను. ‘చాలా బాగుంది’ అని అభినందించారు. అయితే.. తెల్లారితే ఆ సీన్ తీయాలి. దానికి ఓ ముసలి మాస్టారు, 40 మంది పిల్లలు అవసరం. మాస్టారి పాత్రకు మా డెరైక్షన్ డిపార్ట్‌మెంట్లో ఉండే దుర్గా నాగేశ్వరరావుగారిని తీసుకున్నాం. 40 మంది పిల్లల కోసం ఆ రాత్రి మొత్తం ఊరంతా తిరిగి, తెల్లారేసరికి 40 మంది పిల్లల్ని పోగు చేశాను. ఒక సహాయ దర్శకుణ్ణి అయ్యుండి, సినిమా కోసం అంత కష్టపడేవాణ్ణి. అంతగా ఆలోచించేవాణ్ణి. సినిమాను అంతగా ప్రేమించేవాణ్ణి. పైగా ‘ఇగో’ అంటే తెలీని గొప్ప గురువు మాకు దొరికారు. ‘స్వర్గం-నరకం’ ఎడిటింగ్ టైమ్‌లో అనుకుంటా... గురువుగారు ఓ డైలాగ్ చెప్పారు. మేం పగలపడి నవ్వాం. ‘ఏమయ్యా.. మీ గురువు... దర్శకుడిగా ఫెయిలైపోయాడనుకో.. డైలాగులు రాస్కునైనా బతకొచ్చు కదా’ అన్నారు. అంతగా కలిసిపోయేవారాయన. నా శిష్యులతో కూడా నేనూ అలాగే ఉండటానికి ప్రయత్నిస్తా. ఒక మనిషి పైకి రావాలంటే.. ప్రతిభ, అదృష్టంతో పాటు పదిమంది సహకారం కూడా అవసరం.
 

మరిన్ని వార్తలు