మహాతల్లి కథాసారం 

25 Jun, 2018 02:52 IST|Sakshi
హమీద్‌కు అడుగు ముందుకు పడలేదు. పనసచెట్టు ఆదాయంతో కాలక్షేపం చేస్తున్నదనుకొని పొరపాటు చేశాననుకొన్నాడు. తల్లికి మొఖం చూపించడమెలా?

మాష్టరు హమీద్‌ ఢిల్లీలో బారహటోటేలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు. అతడి అసలు నివాసస్థానం రషీదాబాద్‌లోని పహాడీ మొహల్లా. అతని తండ్రి రషీదాబాదులో కంచరిపని చేస్తూ ఉండేవాడు. హమీద్‌ బాల్యంలో తన పేటలోని మసీదులోనూ, తరువాత కొద్ది రోజులు ముల్లా సాహెబు బడిలోనూ, ఆ తరువాత తండ్రిగారి ఇష్టప్రకారం కొంతకాలం తాలూకా స్కూలులోనూ చదువుకొన్నాడు. హమీద్‌ ఉర్దూ ప్యాసయిన రోజుల్లో రషీదాబాద్‌లో ప్లేగువ్యాధి వ్యాపించి హమీద్‌ తండ్రిని బలిగొన్నది. ఆయన అంత్యకర్మలన్నీ పూర్తిచేసిన తరువాత హమీద్‌ తల్లి దగ్గర లెక్ఖ చూసుకొంటే డెబ్భయి రూపాయలు మిగిలినవి. మిడిల్‌ ప్యాసయిన తరవాత హమీద్‌కు ఇంగ్లీషుగూడా చదువు కొందామని అభిలాష కలిగినది. కాని ఎలాగా చదువుకోడం?

వీరి పేటలో ఉండే ఒకాయన ఢిల్లీలో పోలీసుగా ఉండటం వల్ల హమీద్‌ రెండు మూడు సార్లు ఢిల్లీని గురించి విని ఉన్నాడు. అందువల్ల తల్లి దగ్గర పదిహేను రూపాయలు తీసుకొని మెల్లగా ఢిల్లీ చేరుకొన్నాడు. పోలీసు కానిస్టేబుల్‌ నసరుల్లాఖాన్‌ ఇల్లు చచ్చిచెడి తెలుసుకొన్నాడు. నసరుల్లాఖాన్‌ హమీద్‌ తండ్రిని బాగా ఎరుగును. అందువల్ల అతడు హమీద్‌ను ఆదరించి తన ఇంట్లో ఉండి చదువుకోవడానికి అవకాశం కలుగజేశాడు.

హమీద్‌ మూడు సంవత్సరాల్లో పదో క్లాసుకు వచ్చాడు. లెక్ఖల్లో హమీద్‌ నిధి. ఒక సహధ్యాయుడికి పాఠం చెప్పడం ప్రారంభించి నెలకు ఏడు రూపాయలు సంపాదించడం ఆరంభించాడు. ఏడు రూపాయలు తన భోజనానికి సరిపోతవి గనుక వేరుగా ఉంటానని బ్రతిమిలాడినా నసరుల్లాఖాన్‌ అంగీకరించనందున హమీద్‌ అక్కడే ఉండిపోయినాడు. పదినెలల్లో హమీద్‌ డెబ్బయి రూపాయలు సంపాదించాడు. తల్లి దగ్గరినుండి తెచ్చినవి పది రూపాయలు మిగిలి ఉన్నవి. ఒకసారి తల్లి రెండు రూపాయలు మనియార్డరు పంపించింది. మొత్తం ఎనభయి రెండు రూపాయలు పోగుపడినవి. స్కూలుకు వేసవికాలపు సెలవులిచ్చారు. నసరుల్లాఖాన్‌ గూడా సెలవుబెట్టాడు. ఇద్దరూ కలిసి రషీదాబాద్‌ వచ్చారు.

అప్పటికి హమీద్‌ తల్లి దగ్గర భర్త అంత్యక్రియలు చేయగా మిగిలిన పన్నెండు రూపాయలు ఉన్నవి. ఇంటిముందున్న పనసచెట్టు అమ్మడం వల్ల ప్రతి సంవత్సరం పాతిక రూపాయల ఆదాయం వస్తూ ఉండేది. ఇంటికి పోయేటప్పటికి తల్లి హమీద్‌కు వివాహ సంబంధం మాట్లాడి సిద్ధం చేసి పెట్టింది. ఆ డబ్బు, హమీద్‌ దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చుపెట్టి  ఏదోవిధంగా హమీద్‌ఖాన్‌ వివాహం పూర్తిచేసింది. పెళ్లి అయిన ఏడోరోజున తిరిగి హమీద్‌ ఢిల్లీ వెళ్లాడు. ఆ సంవత్సరం పరీక్షలో కృతార్థుడు అయినాడు.

ఒక ప్రైవేట్‌ స్కూల్లో నౌకరీ కుదిరింది. నెలకు ఇరవయి రూపాయల జీతం. నసరుల్లాఖాన్‌ మూడు రూపాయలు అద్దెకు ఒక చిన్న ఇల్లు కుదిరించి పెట్టాడు. హమీద్‌ భార్యను తీసుకొచ్చి ఆ ఇంట్లో కాపురం పెట్టాడు. రషీదాబాద్‌లో తల్లి ఒంటరిగా ఉండిపోయింది.

హమీద్‌ భార్యను ఢిల్లీ తీసుకొనివచ్చి ఏడు సంవత్సరాలు గడిచింది. అతనికి ముగ్గురు మొగపిల్లలూ, ఒక ఆడపిల్లా పుట్టారు. వారిలో ఒక మొగపిల్లవాడూ, ఆడపిల్లా చనిపోయినారు. హమీద్‌ భార్యకు గూడా చాలా జబ్బు చేసింది. ఒకసారి హమీద్‌కు ఎండదెబ్బ తగిలి పదిహేను రోజులు మంచంలోనే ఉండిపోయినాడు. అటు స్కూల్లో పని పెరిగిపోయింది. జీతం కూడా ముప్ఫయి రూపాయలయింది. పది రూపాయలు ప్రైవేటు చెప్పి సంపాదించేవాడు. కానీ ఆ డబ్బు అతనికి ఏమాత్రమూ సరిపోయేది కాదు. తల్లి రషీదాబాద్‌ రమ్మని ఉత్తరాల మీద ఉత్తరాలు వ్రాసేది. కాని డబ్బులేక తల్లిని చూడవలెనని ఎంత కుతూహలమున్నా హమీద్‌ పోలేకపోయినాడు.

రోజూ ఉదయమే లేచి మసీదుకు పోయి నమాజు చేసుకోవడం, ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఖురాన్‌లోనుండి ఒక అధ్యాయం పారాయణం చేయడం అతనికి అలవాటు. మసీదు నుంచి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు రోజూ జానకి నడుము వంగిపోయి కర్రపోటు వేసుకొంటూ చాకిరేవుకు పోతూ కనపడేది. కాని ఎందువల్లనో ఐదు రోజుల నుండి జానకి కనపడటం లేదు. హమీద్‌కు ఆశ్చర్యం వేసింది. తెలుసుకుందామని జానకి ఇంటికి వెళ్లాడు. ఏమైందని ప్రశ్నిస్తే నిన్నరాత్రి చనిపోయిందని జవాబు చెప్పారు.

జానకి చనిపోయిందని వినగానే హమీద్‌ గుండె గుభీలుమన్నది. జానకికి హమీద్‌కు ఏమి సంబంధమున్నదో భగవంతునికి తెలియాలి! స్కూలుకు పోయినాడు. ఏమీ తోచలేదు. స్కూలు వదిలిపెట్టగానే ఇంటికి చేరాడు. తెల్లవార్లూ అతనికి నిద్ర పట్టలేదు. మర్నాడు బక్రీదు. స్కూలుకు సెలవు. స్టేషనుకు పోయి రషీదాబాద్‌ టిక్కట్టు కొన్నాడు. బక్రీదు రోజు పగలల్లా రైల్లోనే గడిచింది. నమాజు లేదు. కుర్బానీ లేదు. ముసలితల్లి ధ్యాసే.

భార్య, పిల్లల మీద మక్కువ వల్ల హమీద్‌ తల్లిని మరిచిపోలేదు. నాలుగైదుసార్లు ఏడెనిమిది రూపాయలు మనియార్డరు గూడా పంపించాడు. ఆ డబ్బు పంపినప్పుడల్లా తనూ, పిల్లలూ చాలా ఇబ్బంది పడేవాళ్లు. తల్లికి ఉత్తరాలు వ్రాసినప్పుడు పిల్లల చేత గూడా ఏవో గీతలు గీయించేవాడు. ఆ పిచ్చిగీతలు చూసి తల్లి సంతోషించవలెనని అతని అభిప్రాయం. అతని భార్య గూడ వ్రాయడం నేర్చుకొన్నది. అత్తగారికి సలాములు తెలియపరుస్తూ ఉండేది.

అటునుండి తల్లి మాటమాటకీ రమ్మని పక్కింటి దర్జీ ఆమె చేత ఉత్తరాలు వ్రాయిస్తూ ఉండేది. వచ్చే సంవత్సరం పంట రోజుల్లో తప్పక వస్తానని వ్రాసేవాడు. కుటుంబంతో పోవాలి. చేసేది ఉద్యోగం గనుక యేవో కానుకలు తీసుకొనిపోవాలి. అందుకు డబ్బు గావాలి. వచ్చే జీతంతో తిండి గడవడమే కష్టంగా ఉండేది. అందువల్ల ఎప్పటికప్పుడు ప్రయాణం ఆపుకొనేవాడు. కాని జానకి మరణవార్త విని గుండె పగిలినట్లయి ఆగలేక ఒంటరిగా బయలుదేరాడు.

బక్రీదునాడు సూర్యాస్తమయం సమయానికి హమీద్‌ రషీదాబాద్‌ చేరాడు. పైనుండి భోరున వర్షం కురవడం ఆరంభించింది. మోకాళ్ల లోతు నీళ్లలో యింటికి చేరుకొన్నాడు. తలుపు వేసివున్నది. ‘‘అమ్మా’’ అని పెద్దగా పిలిచాడు.

లోపలనుండి ఒక లావుపాటివాడు వచ్చి తలుపులు తెరిచాడు. మూడు సంవత్సరాల క్రితం ఆ యిల్లును కొన్నట్లున్నూ, హమీద్‌ తల్లి దర్జీ ఆమె ఇంట్లో వున్నదనిన్నీ చెప్పాడు.
హమీద్‌కు అడుగు ముందుకు పడలేదు. ఇల్లుగూడా అమ్మవలసినంత కష్టంలో తల్లి పడిపోయింది కాబోలు అనుకున్నాడు. పనసచెట్టు ఆదాయంతో కాలక్షేపం చేస్తున్నదనుకొని పొరపాటు చేశాననుకొన్నాడు. తల్లికి మొఖం చూపించడమెలా?
దర్జీ ఆమె ఇంటికి కాళ్లీడ్చుకుంటూ చేరాడు. దర్జీ సోతీ తలుపు తీసింది. ‘‘హమీద్‌ వచ్చాడు’’ అంటూ పరుగెత్తింది.
హమీద్‌ తల్లి ఈమధ్య అశక్తత వల్ల ఇంట్లో అటూయిటూ నడవడం గూడా మానుకొన్నది. హమీద్‌ వచ్చాడనడంతోనే గభీమని లేచి ఆలింగనం చేసుకొన్నది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె శరీరంలో ఎముకలు తప్ప ఏమీలేవు. చాలాసేపు ఇద్దరూ మాట్లాడలేకపోయినారు. ‘‘నాయనా! చాలా దూరంనుండి వచ్చావు. గుడ్డలన్నీ తడిసిపోయినవి. గుడ్డలు మార్చుకో. టీ తీసుకొని వస్తాను. పిల్లలంతా కులాసాగా ఉన్నారా?’’ అని ప్రశ్నించింది.

‘‘అమ్మా! ఇల్లు అమ్మివేశావా? నాకు తెలియజేయలేదేమి?’’ అని అడిగాడు.
‘‘నీకు మాత్రం కష్టాలు తక్కువగా ఉన్నవి గనుకనా? నా బాధకూడా నీకెందుకు నాయనా? ఈ జన్మలో నిన్ను చూడలేనేమో అనుకున్నాను’’ అన్నది.
హమీద్‌ బొటబొటా నీళ్లు కార్చాడు. ‘‘నీవు ఇంకా పనిచేస్తూనే ఉన్నావా?’’
‘‘చేతులు బాగానే ఉన్నవి గాని కళ్లుమాత్రం నెలరోజుల నుండి కనపడడం లేదు నాయనా.’’
‘‘కళ్లు కనపడడం లేదా?’’ అన్నాడు ఆతురతతో హమీద్‌.
‘‘నీవు కనపడుతూనే ఉన్నావు. రోజూ సూర్యుడు కనబడతాడు. అంతే. చిన్నపిల్లవాడు కులాసాగా ఉన్నాడా? వాడి వయస్సెంత?’’
‘‘సంవత్సరంనర’’
‘‘అయితే చొక్కా, టోపీ వాడికి సరిపోతవి’’ అంటూ ఒక పాత గుడ్డల మూట విప్పి అందులోనుండి ఒక చొక్కాను, బుటేదారి పనిచేసియున్న ఒక టోపీని బయటకు తీసింది.
‘‘మజీద్‌ కోసం ఇవి తయారుచేశావా?’’ అని హమీద్‌ కన్నీళ్లు కార్చాడు.
‘‘సలామా కోసం పంపుదామంటే నీవు రానేలేదు. తర్వాత చచ్చిపోయిందని ఉత్తరం వ్రాశావు’’ అని కన్నీళ్లు పెట్టుకొన్నది.
ఏమిటేమిటో ఆలోచనలు. పక్క ఇంటి నసీబన్‌ గూడా వచ్చింది. నసీబన్, హమీద్‌ తల్లి, సోతీ వంట ఇంట్లో ఏమేమిటో చేస్తూ ఉండిపోయినారు. ఎనిమిది గంటలకు తల్లి బయటకు వచ్చి భోజనానికి లేవమన్నది. బీదస్థితిలో ఉన్నది గనుక తల్లి జొన్నరొట్టె చేసి ఉంటుందనుకొన్నాడు. కాని కబాబు, మేక గుండెకాయ కూర, పొరాఠాలు, మినప్పప్పు, మామిడికాయ పచ్చడి, ఒక కప్పులో మీగడ. తల్లి కూర్చొని కొసరి కొసరి వడ్డించింది.
‘‘నాయనా! ఒక్క మాట చెపుతాను. వింటావా?’’
హమీద్‌ గుండె దడదడలాడింది. తనతోగూడా ఢిల్లీ వస్తానంటుందనుకొన్నాడు.

‘‘నీవు పట్టణంలో ఉండేవాడివి. నేను పరాయివాళ్ల పంచల్లో తలదాచుకొంటున్నాను. నీకు ఎలా మర్యాద చేయగలను? నసీబన్‌ను పంపించి ఖాన్‌సాహెబ్‌ గారి ఇంట్లో ఒక గది బాగు చేయించాను. మంచం, పక్కా వేయించాను. కాని నీవు నాతోబాటే ఉంటే బాగా ఉంటుందని నా మనస్సు కోరుతున్నది.’’
తల్లి మాటలకు హమీద్‌ గుండె కరిగిపోయింది. ‘‘నీ దగ్గర ఉండకపోతే నేను యింకెక్కడకు పోతాను?’’ అన్నాడు.

నసీబన్‌ను పిలిచి మంచం తన గదిలో వేయించింది. ఒక మూట విప్పి తెల్లటి దుప్పటి బయటకు తీసింది. దుప్పటి మీద రకరకాల లతలు కుట్టివున్నవి. రెండు దిండ్లు బయటకు తీసింది. తెల్లటి గలీబులు తొడిగివున్నవి. చిన్న సీసాలోనుంచి తీసి గలీబులకు అత్తరు రాసింది. మంచం కింద ఒక పీక్‌దానును పెట్టించింది. ఢిల్లీపూల నల్ల చెప్పుల జోడు– కొత్తది– మంచం కాళ్లవైపున పెట్టి, నిద్రపొమ్మన్నది.
హమీద్‌ ఈ తమాషానంతా చూస్తున్నాడు. యా అల్లాహ్‌! ఈ సామానంతా ఎలా వచ్చింది? తల్లిని అడిగాడు.

‘‘ఏడు సంవత్సరాలు ఎదురుచూశాను. ఇల్లు అమ్మాను. పొట్ట బిగించుకొని నీ కోసం, నీ పిల్లల కోసం ఈ వస్తువుల్ని సేకరించాను. సలామాను చూడనే లేదు’’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
తల్లి మాటలను విని శాంతిదేవత ఆ చిన్నగదినిండా తన రెక్కలను విప్పింది. ఇక ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
తెల్లవారింది. హమీద్‌ తల్లి ఇక కళ్లు తెరవలేదు.

‘ఉర్దూ కథా సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించుకొన్న’ రుకైయ్యా రీహానా కథ ‘తల్లి’కి సంక్షిప్త రూపం ఇది. దీన్ని వేమూరి ఆంజనేయశర్మ తెలుగులోకి అనువదించారు. విశ్వసాహిత్య గ్రంథమండలి 1946లో ప్రచురించిన ‘ఉర్దూ కథలు’ సంకలనంలో ఈ కథ ఉంది. సౌజన్యం: kathaaprapancham.in

మరిన్ని వార్తలు