ఉపవాసంతో వ్యర్థానికి మోక్షం!

2 Mar, 2019 00:31 IST|Sakshi

లంఖణం పరమౌషధం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆధునిక శాస్త్రం కూడా ఈ విషయాన్ని చాలాసార్లు రుజువు చేసింది కూడా. హార్వార్డ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనలు కూడా నిరాహారంగా ఉండటం, తరచూ వ్యాయామం చేయడం శరీరంలోని కణ వ్యవస్థను పూర్తిగా చైతన్యవంతం చేస్తుందని గుర్తించారు. ఈ చర్యల ఫలితంగా పాడైపోయిన ప్రొటీన్లను బయటకు పంపేందుకు శరీరానికి మరింత శక్తి లభిస్తుందని పరిశోధన పూర్వకంగా తెలుసుకున్నారు. శరీరాన్ని తనను తాను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు స్వయంగా కొన్ని పనులు చేసుకుంటుంది. చెడిపోయిన ప్రొటీన్లు, కణాలను వదిలించుకోవడం ఇందులో భాగం. అయితే కొన్నిసార్లు ఈ వ్యవస్థలు సక్రమంగా పనిచేయక వ్యాధులు వస్తూంటాయి.

ప్రొటీన్‌ను ఒక నిర్దిష్ట పద్ధతిలో మడతపెట్టడం ద్వారా అవి బయటకు పోకుండా పోగుబడుతూంటాయని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఈ ప్రక్రియను నియంత్రించే మార్గాలను అన్వేషిస్తున్నారు. వ్యాయామం, ఉపవాసం వంటి చర్యల వల్ల శరీరంలో జరిగే హార్మోన్‌ మార్పులు కణాలపై ప్రభావం చూపుతున్నాయని... పాడైన ప్రొటీన్లను బయటకు పంపే వ్యవస్థను చైతన్యవంతం చేస్తున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వెట్‌ప్లాంక్‌ తెలిపారు. సైక్లింగ్‌ వ్యాయామం చేసే కొందరిపై పరీక్షలు జరిపినప్పుడు పాడైన ప్రొటీన్లు వేగంగా నశించిపోతున్నట్లు గుర్తించారు.  

మరిన్ని వార్తలు