ఉప్పు ద్రావణంతో కొవ్వు కరిగిస్తారు!

17 Jan, 2020 02:04 IST|Sakshi

పరిపరిశోధన

శరీరంలో కొవ్వు పెరిగిపోయిందా? కడుపు కట్టుకున్నా.. తెగ వ్యాయామం చేస్తున్నా కరగడం లేదా? ఇంక కొంత కాలం ఆగండి. ఎంచక్కా ఒకట్రెండు సూది మందులతోనే మీ కొవ్వు సగం తగ్గిపోతుంది. అదెలాగో తెలుసుకోవాలంటే హార్వర్డ్, మసాచూసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ శాస్త్రవేత్తల పరిశోధనల గురించి తెలుసుకోవాల్సిందే. నిజానికి ఈ పద్ధతి చాలా సింపుల్‌. గడ్డకట్టించి, ఉప్పు ద్రావణాన్ని కొవ్వు ఉన్న ప్రాంతంలోకి నేరుగా జొప్పించడమే మనం చేయాల్సిన పని. చల్లదనం కారణంగా శరీరంలోని కొవ్వుకణాలు స్పటికాల్లా మారిపోయి నాశనమైపోతాయి.కొన్నివారాల తరువాత చనిపోయిన కణాలను శరీరమే బయటకు తోసేస్తుంది. శరీరంలోని ఏ ప్రాంతంలో ఉన్నా.. ఎంత లోతులో ఉన్నా ఈ కొత్తపద్ధతి ద్వారా కొవ్వును కరిగించవచ్చు.

కేవలం కొవ్వు కణాలపై మాత్రమే ప్రభావం చూపుతూ... మిగిలిన కణజాలానికి ఏమాత్రం హాని జరక్కపోవడం ఈ పద్ధతి తాలూకూ విశేషం. ఈ పద్ధతిని తాము పందులపై ప్రయోగించి చూశామని, ఎనిమిది వారాల్లో దాదాపు 55 శాతం కొవ్వు తగ్గిపోయిందని లిలిత్‌ గార్బియాన్‌ అనే శాస్త్రవేత్త తెలపారు. లిలిత్‌ గార్బియాన్‌ నేతత్వంలోని శాస్త్రవేత్తల బృందం గతంలోనూ కూల్‌స్కల్‌ప్టింగ్‌ పేరుతో కొవ్వును కరిగించే ఓ పద్ధతిని అభివద్ధి చేసింది. అయితే ఆ పద్ధతి అంతగా విజయవంతం కాలేదు. అయితే లిలిత్‌ బృందం అభివృద్ధి చేసిన రెండు పద్ధతులు కూడా పేరుకుపోయిన కొవ్వులను తగ్గించగలవేగానీ.. లివర్‌ పనితీరును ఏమీ మెరుగుపరచవు. పరిశోధన వివరాలు ప్లాస్టిక్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు