ఫియర్‌లెస్‌ జర్నలిస్ట్‌

8 Mar, 2019 02:48 IST|Sakshi

పేరు ఫే డిసూజా.. ఫియర్‌లెస్‌ జర్నలిస్ట్‌. మిర్రర్‌ నౌ ఎడిటర్‌. ఆశారాం బాపూ దగ్గర్నుంచి శానిటరీ నాప్కిన్స్‌ దాకా అన్ని విషయాల మీద నిష్పక్షపాతంగా చర్చను కొనసాగిస్తుంది. జర్నలిస్ట్‌గా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడ్డానికి కృషిచేస్తోంది. ఈ క్రమంలో చాలాసార్లు ట్రోలింగ్‌కి గురైంది. అయినా వెరవలేదు. తన పంథా మార్చుకోలేదు. ఫే డిసూజా నిర్వహించే ప్యానెల్‌ డిస్కషన్‌కి రావడానికి చాలామంది పెద్దలు ఇష్టపడ్తారు. అరవడాలు, వచ్చిన వాళ్ల నోరు మూయించే ప్రయత్నాలు లేకుండా.. చర్చ చక్కగా.. ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించేలా ఉంటుందని.

జెండర్‌ ఈక్వాలిటీ గురించి కుండబద్దలు కొట్టేలా మాట్లాడుతుంది. ఆమె ఎక్కడ కనపడ్డా.. గుర్తుపట్టి పరిగెత్తుకొస్తారు.. ‘‘మీరంటే నాకు ఇష్టం’’ అని.. ‘‘మీరంటే మాకు అడ్మిరేషన్‌’’ అని, ‘‘మీరు మాకు ఇన్‌స్పిరేషన్‌’’ అని అభిమానం కురిపిస్తారు. ఆమె స్వస్థలం బెంగుళూరు. అక్కడి మౌంట్‌ కార్మెల్‌ కాలేజ్‌లో జర్నలిజం చదివింది. అప్పుడే బెంగళూరు ఆల్‌ ఇండియా రేడియోలో న్యూస్‌రీడర్‌గా పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేసింది.  సీఎన్‌బీసీ టీవీ18తో కెరీర్‌ మొదలుపెట్టింది. తర్వాత బిజినెస్‌ రిపోర్టింగ్‌ వైపు మళ్లింది. 2008లో ఈటీ(ఎకనమిక్‌ టైమ్స్‌)లో పర్సనల్‌ ఫైనాన్స్‌ ఎడిటర్‌గా చేరింది ఫే డిసూజా.  

మరిన్ని వార్తలు