ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయా?

10 Dec, 2017 01:36 IST|Sakshi

ఒక్కొక్కసారి ఎంత కష్టపడుతున్నా ఆర్థిక ఇక్కట్ల నుంచి గట్టెక్కడం కష్టంగా ఉంటుంది. కాలం పగబట్టిందేమో అనేంతగా గడ్డు పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అసంతృప్తి, నిస్పృహ మనసును కుదురుగా ఉండనివ్వవు. అలాంటి పరిస్థితుల్లో ఈ పరిహారాలను పాటించండి.

కాకులకు, కుక్కలకు, ఆవులకు ఆహారాన్ని పెట్టండి. ఇంట్లోని బీరువాలు, నగలు వంటి విలువైన వస్తువులను భద్రపరచుకునే పెట్టెలను ఖాళీగా ఉంచకండి. వాటిలో ఉంచడానికి ఏమీ లేనట్లయితే, కనీసం నాలుగు బాదం గింజలైనా వేసి ఉంచండి.
 అనైతిక కార్యకలాపాలకు, అవినీతికి, జూదానికి, స్పెక్యులేటివ్‌ లావాదేవీలకు దూరంగా ఉండండి.
 నిత్యపూజలో భాగంగా లక్ష్మీదేవిని తెల్లని పూలతో అర్చించండి. తెలుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టండి.
 కనీసం ఆరు ఆదివారాలు నిరుపేద అంధులకు అన్నదానం చేయండి.
 శనివారం పూర్తిగా మద్య మాంసాలకు దూరంగా ఉండండి.
 చిన్నారులు ఉండే ఇళ్లకు వెళ్లినప్పుడు వాళ్ల కోసం మిఠాయిలు తీసుకు వెళ్లండి. దక్షిణావర్త శంఖాన్ని సేకరించి, ఇంట్లోని పూజ గదిలో ఉంచి, దానికి నిత్యం ధూపదీపాలు సమర్పించండి.
 మీ కోసం పనిచేసే వారికి చెల్లించాల్సిన ప్రతిఫలాన్ని సకాలంలో చెల్లించడాన్ని అలవాటు చేసుకోండి. ఇతరుల వద్ద తీసుకున్న చేబదుళ్లను వీలైనంత త్వరగా తీర్చేయండి.
 ప్రతి శనివారం ఆలయాల వద్ద కనీసం పదకొండు మంది నిరుపేదలకు రొట్టెలు పంచిపెట్టండి. గోశాలలకు పెసలతో కూడిన దాణాను దానంగా ఇవ్వండి.
 ఇంట్లో ప్రతిరోజూ చేసే నిత్యపూజలో లక్ష్మీస్తోత్రాన్ని పఠించండి. లక్ష్మీపూజను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీదేవి ఎదుట నేతిదీపం వెలిగించండి.

– పన్యాల జగన్నాథదాసు

మరిన్ని వార్తలు