పంటలు..  ఇబ్బడి ముబ్బడి!

10 Jan, 2019 00:12 IST|Sakshi

పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా అత్యధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రవేత్తలు ఒక కొత్త మార్గం కనుక్కున్నారు. కిరణజన్య సంయోగ క్రియ వ్యవస్థలో ఉన్న లోపాన్ని సరిచేయడం ద్వారా మొక్కలు అతితక్కువ కాలంలో ఎక్కువ కాపునిచ్చేలా చేయవచ్చునని దీనిద్వారా పంట దిగుబడులు కనీసం 40 శాతం వరకూ పెరుగుతాయని పాల్‌ సౌత్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు శక్తిగా మార్చుకునే ప్రక్రియకు కిరణ జన్య సంయోగ క్రియ అంటారన్నది తెలిసిందే. అయితే యుగాలుగా ఈ ప్రక్రియ పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు.

ఒక దశలో కార్బన్‌డయాక్సైడ్‌ కణాలను లాక్కునేందుకు రుబిస్‌కో అనే ఎంజైమ్‌ ఉపయోగపడుతూంటుంది.అయితే కొన్నిసార్లు ఈ ఎంజైమ్‌ కార్బన్‌డయాక్సైడ్‌కు బదులుగా ఆక్సిజన్‌ను లాగేసుకుంటుంది. దీని ప్రభావం దిగుబడులపై ఉంటుంది. సౌత్‌ తన బృందంతో కలిసి చేసిన పరిశోధనల్లో ఈ ఎంజైమ్‌ను నియంత్రించేందుకు ఒక పద్ధతిని తెలుసుకోగలిగారు. ఈ పద్ధతితో సాగైన పొగాకు పంట తక్కువ కాలంలోనే 40 శాతం వరకూ ఎక్కువ దిగుబడిని ఇచ్చింది. సోయా, వరి, బంగాళాదుంప, టమోటా వంటి పంటల్లోనూ ఈ పద్ధతిని పరీక్షించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఆ తరువాత విస్త్రత వినియోగానికి అందుబాటులోకి తెస్తామని సౌత్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు