'నేను మళ్లీ నటిస్తున్నాను...'

8 Jul, 2015 11:57 IST|Sakshi
'నేను మళ్లీ నటిస్తున్నాను...'

అనూ అగర్వాల్ పేరు వినబడగానే మణిరత్నం ‘దొంగా దొంగా’ సినిమాలో ‘కొంచెం నీరు..’ పాట పెదాల మీద ఇప్పటికీ పలుకుతుంది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఆషికీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనూ అగర్వాల్‌కు ఆ తరువాత చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. ఈలోపే ఆమెను దురదృష్టం వెంటాడింది. 1999లో ముంబాయిలో ప్రమాదానికి గురై చాలారోజులు కోమాలో ఉంది. దేవుడి దయ వల్ల ఆమె మృత్యువు నుంచి బయటపడింది.

 ఆ తరువాత మాత్రం అగర్వాల్ రూపంలో మార్పులు వచ్చాయి. కొందరైతే ఆమెను గుర్తు కూడా పట్టలేదు.  తాజా వార్త ఏమిటంటే, ‘‘నేను మళ్లీ నటించనున్నాను’’ అని అనూ అగర్వాల్ సోషల్ నెట్‌వర్కింగ్ పేజీలో రాసింది. తన ఆటోబయోగ్రఫీ‘అనూజువల్-మెమరీ ఆఫ్ ఏ గర్ల్ హు కేమ్ బ్యాక్ ఫ్రమ్ ది డెడ్’ గురించి కూడా ప్రకటించింది.

ఈ పుస్తకం వచ్చే నెలలో విడుదల కానుంది. ‘ఢిల్లీ యూనివర్శిటీ’ నుంచి సోషియాలజీలో గోల్డ్‌మెడల్ గెలుచుకున్న అగర్వాల్ మొదట్లో మోడలింగ్ చేసింది. మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటున్న ఆమె  ముందు అవకాశాలు క్యూ కట్టడం లేదుగానీ, అనూ అగర్వాల్ ‘ఆటోబయో గ్రఫీ’లోని విషయాల గురించి ఆ నోటా ఈ నోట విన్న ఒక దర్శకుడు ఆమెను కలిసి- ‘‘వేరే కథ ఎందుకు? మీ జీవితకథనే సినిమాగా తీద్దాం’’ అన్నాడట. అందుకు అగర్వాల్ ఒప్పుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి!
 
 

మరిన్ని వార్తలు