రాజారావు

24 Sep, 2018 03:49 IST|Sakshi
రాజారావు

గ్రేట్‌ రైటర్‌

ఇంగ్లిష్‌లో రాసిన తొలితరం భారతీయ రచయితల్లో ఒకరు ‘పద్మ విభూషణ్‌’ కె.రాజారావు (1908–2006). కర్ణాటకలో జన్మించారు. తండ్రి హైదరాబాద్‌లో కన్నడ బోధిస్తుండటం వల్ల నిజాం కాలేజీలో చదువుకున్నారు. తత్వవిచారణ మీద ఆయన రచనలు ఎక్కువ దృష్టిని సారిస్తాయి. నాలుగేళ్లప్పుడు తల్లిని కోల్పోయారు. ఆ శూన్యం ఆయన రచనల్లో ప్రతిఫలిస్తుంది. తాతయ్యతో పెరిగిన అనుభవాలు కూడా ఆయన మీద ప్రభావాన్ని చూపాయి. స్వాతంత్య్రం కోసం సాగిన అహింసా పోరాటం మీద గాంధీజీ ప్రభావాన్ని తొలి నవల ‘కాంతాపుర’ (1938)లో చిత్రించారు.

ఫ్రాన్స్‌లో ఫ్రెంచ్‌ అభ్యసించిన రాజారావు అక్కడి ఫ్రెంచ్‌ వనితను పెళ్లాడారు. ఎనిమిదేళ్ల తర్వాత విడిపోయారు. ఈ నేపథ్యంలో ‘ద సర్పెంట్‌ అండ్‌ ద రోప్‌’ పేరుతో రాసిన ఆత్మకథాత్మక నవలలో భారతీయ, పాశ్చాత్య సంస్కృతుల మధ్య సంబంధాన్ని చిత్రించారు. సర్పెంట్‌ (సర్పం) భ్రాంతికీ, రోప్‌(తాడు) వాస్తవానికీ సంకేతాలు. అనంతరం అమెరికాలో తత్వశాస్త్ర ఆచార్యుడిగా పనిచేశారు. నేను అడవిలో ఉన్నాసరే నా కోసం రాసుకుంటాను, పదాల్లోని ఇంద్రజాలాన్ని ఆనందిస్తాను అనే రాజారావు, రచన మన నుంచి వచ్చినంత మాత్రాన అది మనది కాదని చెబుతారు. ‘ద కౌ ఆఫ్‌ ద బారికేడ్స్‌’, ‘ద పోలీస్‌మేన్‌ అండ్‌ ద రోజ్‌’ ఆయన కథాసంపుటాలు. 

మరిన్ని వార్తలు