ట్రీలకూ అంబులెన్స్‌

16 Nov, 2019 04:10 IST|Sakshi

గ్రీన్‌ సర్వీస్‌

తుఫాను గాలికి వేర్లతో సహా చెట్లు పడిపోయాయా? చెదలు పట్టి చెట్టు బలహీనమవుతోందా? నీళ్లు అందక ఎండిపోతోందా? ఒక చోటు నుంచి తీసి ఇంకో చోటుకి మార్చాలా? మొక్కలు నాటాలా? విత్తనాలు కావాలా? చెట్ల గురించి సర్వే చేపట్టాలా? చచ్చిపోయిన చెట్టును తీసేయాలా?  గార్డెన్‌ టూల్స్, ఎరువు, పురుగుల మందు, నీళ్లు కావాలా? అయితే ట్రీ అంబులెన్స్‌కు కబురు పెట్టడమే. క్షణాల్లో వచ్చి చెట్టుకు కావల్సిన చికిత్స చేసి.. సలహాలు, సూచనలు ఇచ్చి మరీ వెళ్తారు అంబులెన్స్‌ సిబ్బంది. ఆశ్చర్యపోకండి మీరు కరెక్ట్‌గానే చదువుతున్నారు.. నిజాన్నే తెలుసుకుంటున్నారు. అయితే ట్రీ అంబులెన్స్‌ సౌకర్యం ఉన్నది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు తమిళనాడులో.

ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్‌ అబ్దుల్‌ ఘనీ అండ్‌ టీమ్‌ ఈ ట్రీ అంబులెన్స్‌ సేవను ప్రారంభించారు. డాక్టర్‌ అబ్దుల్‌ ఘనీ ఈ పదేళ్లలో దాదాపు యాభై లక్షల మొక్కలు నాటి గ్రీన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా అనే కీర్తి తెచ్చుకున్నాడు. ఇప్పుడు చెట్ల బాగోగుల బాధ్యతనూ తీసుకున్నాడు స్వచ్ఛందంగా. ఈ అంబెలెన్స్‌లో ప్లాంట్‌ ఎక్స్‌పర్ట్స్, వలంటీర్లూ ఉంటారు. ఈ అంబులెన్స్‌ సర్వీస్‌ ద్వారా దేశం మొత్తాన్ని  పచ్చగా మార్చాలనుకుంటున్నాడు డాక్టర్‌ అబ్దుల్‌ ఘనీ. ప్రస్తుతం తమిళనాడులో మొదలైన గ్రీన్‌ సర్వీస్‌ ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుడుతూ ఢిల్లీ బాట పడ్తుంది. దార్లో ఉన్న చెట్లకు సర్వీస్‌ చేస్తూ!

మరిన్ని వార్తలు