రోడ్డు ఎక్కితే చాలు.. కరెంటే కరెంటు!

15 Apr, 2018 01:45 IST|Sakshi

విద్యుత్తుతో నడిచే వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో స్వీడన్‌ ఓ వినూత్న ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ఈ–రోడ్‌ ఆర్లాండా అని పిలుస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు కిలోమీటర్ల రహదారిని నిర్మించారు. ఇందులో గొప్పేముంది అనుకోవద్దు. ఎందుకంటే ఈ రోడ్డుపై విద్యుత్తు వాహనాలు ఛార్జ్‌ అవుతూంటాయి మరి! రహదారి ఉపరితలంపై రైలు పట్టాలాంటిది ఒకదాన్ని ఏర్పాటు చేశారు. వాహనాల అడుగు భాగం నుంచి చిన్న పరికరం ఈ పట్టాను తాకినప్పుడు విద్యుత్తు ప్రవహిస్తుంది. కారులోని బ్యాటరీ నిండిపోతుంది.

తద్వారా బ్యాటరీ ఖర్చయిపోతే ఛార్జింగ్‌ కోసం వాహనాన్ని ఆపాల్సిన అవసరం ఉండదని అంచనా. ప్రయోగాత్మకంగా సిద్ధం చేసిన ఈ రహదారి సత్ఫలితాలిస్తే మరింత ఎక్కువ దూరం ఈ ఎలక్ట్రిక్‌ రహదారులను నిర్మించాలని స్వీడిష్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆలోచన చేస్తోంది. దేశం మొత్తం మీద దాదాపు 20 వేల ఎలక్ట్రిక్‌ రహదారుల నిర్మాణానికి పెట్టే ఖర్చును మూడేళ్లలో తిరిగి రాబట్టుకోవచ్చునని అంచనా వేస్తోంది. ఇంకో విషయం.. వాన వచ్చినా.. విద్యుత్తు షాక్‌ కొట్టకుండా ఈ పట్టా, కారులలోని ప్రత్యేక పరికరంలో ఏర్పాట్లు ఉన్నాయి! 

మరిన్ని వార్తలు