గుజ్ వెజ్

18 Mar, 2016 23:02 IST|Sakshi
గుజ్ వెజ్

పాలకూర, పచ్చిమిర్చి, మొక్కజొన్నతోనైనా... బెండకాయ, ఎండుకొబ్బరి, ఎండు మెంతి ఆకైనా    శనగపిండి, కొత్తిమీర, అల్లం, ఆవాలైనా... దినుసులు మామూలే అయినా ఆకలి తీర్చే ఆహారాలూ... చవులూరించే పదార్థాలు జిహ్వకు ఇంపైన వంటకాలంటే నిజం... అవి గుజరాతీ వెజ్ రుచులే!  శాకాహారపు షడ్రుచులే!!
 
 
భేండి సమ్‌ధానియా
కావల్సినవి: బెండకాయలు - 6
బంగాళదుంప - 1 (ఉడికించాలి)
పచ్చిమిర్చి - 2; ఎండుకొబ్బరి - టీ స్పూన్
నువ్వులు - టీ స్పూన్
కసూరి మెంతి (ఎండు మెంతి ఆకులు) - అర టీ స్పూన్
నూనె - వేయించడానికి తగినంత
తయారి:  నువ్వులు వేయించి, పక్కనుంచాలి.

బెండకాయలను నిలువుగా మధ్యకు కట్ చేసి, నూనెలో వేయిం చుకోవాలి.  బంగాళదుంప, పచ్చిమిర్చి, మెంతి ఆకులు, అర టీ స్పూన్ ఉప్పు, పంచదార, పచ్చిమిర్చి కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని వేయించిన బెండకాయల మధ్యలో కూరాలి.  పైన నువ్వులు చల్లి, అలంకరణకు క్యాబేజీ, క్యారట్ తరుగులను పెట్టి సర్వ్ చేయాలి.  
 
ఢోక్లా
కావల్సినవి: శనగపిండి - 2 కప్పులు
పెరుగు - కప్పు; ఉప్పు - తగినంత
పసుపు - అర టీ స్పూన్
పచ్చిమిర్చి ముద్ద - అర టీ స్పూన్
అల్లం ముద్ద - అర టీ స్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - టేబుల్ స్పూన్
వంటసొడా - టీ స్పూన్; ఆవాలు - టీ స్పూన్
కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
పచ్చి కొబ్బరి తరుగు - అర కప్పు
 
తయారి
వెడల్నాటి గిన్నెలో శనగపిండి, బాగా గిలక్కొట్టిన పెరుగు, కప్పు వేడి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. దీంట్లో ఉప్పు వేసి మరోసారి బాగా కలపాలి. 3-4 గంటలు వదిలేయాలి. తర్వాత పసుపు, పచ్చిమిర్చి ముద్ద వేసి కలపాలి.ఢోక్లా చేసే గిన్నె అడుగున నెయ్యి రాయాలి. (కుకర్ లో కూరగాయలను ఉడికించడానికి మరో అల్యూమీనియమ్ పాత్ర వస్తుంది. దీనిని వాడచ్చు) చిన్న గిన్నెలో నిమ్మరసం, సొడా, టీ స్పూన్ నూనె వే సి కలపాలి. ఈ మిశ్రమాన్ని పిండిలో వేసి మరోసారి బాగా కలపాలి. ఈ పిండిని నెయ్యి రాసిన గిన్నెలో పోయాలి.కుకర్ అడుగు భాగాన నీళ్లుపోసి, దానిపైన పిండి మిశ్రమం ఉన్న గిన్నెపెట్టాలి, పైన మూతపెట్టాలి కానీ, వెయిట్ (విజిల్)ను పెట్టకూడదు.మంట మీద కనీసం 20 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో నీళ్లు ఆవిరైపోయాయో లేదో సరిచూసుకుంటూ మరో 2 కప్పుల నీళ్లు కుకర్ అడుగు భాగాన పోస్తూ ఢోక్లాను పూర్తిగా ఉడనివ్వాలి.
     
ఢోక్లా ఉన్న గిన్నెను బయటకు తీసి, ప్లేట్‌లో బోర్లించాలి. గుండ్రంగా వచ్చిన ఢోక్లాను కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి.చిన్న మూకుడులో నూనె, పోపుగింజలు, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లికాడల తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. దీనిని ఢోక్లా మీద వేసి కలిపి, పచ్చికొబ్బరి తరుగు, కొత్తిమీర ఆకులతో అలంకరించి సర్వ్ చేయాలి.
 
 కోయా మట్‌కి
కావల్సినవి: కోవా - 250 గ్రా.లు
పిస్తాపప్పు - టేబుల్ స్పూన్ (వేయించి, తరిగి పెట్టుకోవాలి); నెయ్యి - టేబుల్ స్పూన్
 
తయారీ
కడాయిలో నెయ్యి వేసి, కరిగాక అందులో కోవా వేసి వేయించాలి.
రొట్టెల పీట మీద కోవా వేసి, చపాతీలా అదమాలి. (పలచగా కాకుండా మందంగా ఉండాలి)
కోవా మీద పిస్తాపప్పు తరుగు వేసి, మడవాలి.
కత్తితో డైమండ్ ఆకారంలో కట్ చేయాలి.
అలంకరణకు సిల్వర్ లీఫ్‌ను ఉపయోగించాలి.
 
 మకరాజ్వాడీ

 కావల్సినవి:
పాలకూర - 250 గ్రా.లు
క్యాప్సికమ్ - 1 (తరగాలి)
క్రీమ్ (పాలమీగడ) - టీ స్పూన్
పచ్చిమిర్చి - 3
నూనె - టేబుల్ స్పూన్
మొక్కజొన్న గింజలు (మకై) - 50 గ్రా.లు
జీలకర్ర - అర టీ స్పూన్
ఆవాలు - అర టీ స్పూన్
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
 
తయారీ
కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు వేయించాలి.
దీంట్లో మొక్కజొన్న, పచ్చిమిర్చి, పాలకూర వేసి ఉడికించాలి.
పసుపు, ఉప్పు వేసి కలపాలి.
చివరగా బాగా గిలకొట్టిన పాల మీగడ వేసి కలిపి దించాలి.
అన్నం లేదా రోటీలోకి వడ్డించాలి.
 
 కర్టెసి
 షెఫ్: పంకజ్
 టూరిజం ప్లాజా, బేగం పేట్, హైదరాబాద్
 
 

మరిన్ని వార్తలు