పదం పలికింది – పాట నిలిచింది
ఆలుమగల మధ్య ఎడబాటులోని అనంతమైన దుఃఖాన్నీ, అంతటి దుఃఖంలోనూ కనబడే సన్నటి ఆశారేఖనీ, మళ్లీ ఏమీ వెలుగు కనబడటం లేదని తెలిసినప్పుడు కలిగే దాంపత్యమంతటి లోతైన వేదననీ...
ఏకకాలంలో వ్యక్తం చేసిందంటే, అది గుంటూరు శేషేంద్ర శర్మ కవిత అయివుండాలి, ముత్యాలముగ్గు కోసం ఆయన రాసిన పాట అయివుండాలి.
‘నిదురించే తోటలోకీ పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది’ పాట మొత్తం ఒక వేదనామయ కవిత! ఆకురాలిన అడవి మీద వసంతం దయచూపినట్టూ, విఫలమైన కోర్కెలు గుమ్మంలో వేలాడినట్టూ, నదినే (సర్వస్వాన్ని) నావ దోచుకుపోతున్నట్టూ దానికి రేవు బావురుమన్నట్టూ చిత్రించడం శేషేంద్రకే చెల్లింది.
‘శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ
ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది
‘విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి
‘కొమ్మల్లో పక్షుల్లారా, గగనంలో మబ్బుల్లారా
నది దోచుకు పోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని నావకు చెప్పండి’
ఈ ముత్యాలముగ్గు చిత్రానికి సంగీతం సమకూర్చింది కె.వి.మహదేవన్. పాడింది సుశీల. 1975లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు బాపు. సంగీత, శ్రీధర్ నటీనటులు.
గుంటూరు శేషేంద్ర శర్మ