రుధిర నేత్రి

20 Jun, 2020 08:53 IST|Sakshi

ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లోని ఆప్తమాలజిస్ట్‌లకు తాజాగా ఈ 11 ఏళ్ల బాలిక కేసు సవాలుగా మారింది. ఈ అమ్మాయి ఏడ్వకుండానే కన్నీరు ఎర్రగా వస్తున్నాయి. సాధారణంగా పిల్లలు ఏడ్చినప్పుడు మాత్రమే కన్నీరు వస్తాయి. కాని ఇక్కడ ఈ అమ్మాయి ఏడవకుండానే రోజులో మూడు నాలుగుసార్లు కళ్ల నుంచి ఎర్రనీళ్లు కారుతున్నాయి. తల్లి భయపడి స్థానిక ఐ క్లినిక్‌లో చూపించింది. వారికి ఏమీ తెలియలేదు. ఏ.ఐ.ఎం.ఎస్‌లోని కంటి నిపుణులకు కూడా ఏమీ తెలియడం లేదు.

పిల్లల్లో కనిపించే ఈ అరుదైన స్థితిని ‘హిమోలాక్రియా’ అంటారు. గతంలో మనదేశంలో ఒక కేసు, బంగ్లాదేశ్‌లో ఒక కేసు కనిపించింది. మన దేశంలోని మరో కేసులో తల్లి కావాలని లేపిన పుకారని బయటపడింది. కాని ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో నిజంగా ఎర్రకన్నీరు వస్తున్నాయి. ‘ఇలా రావడానికి కచ్చితమైన కారణం అంటూ ఏదీ ఉండదు’ అని వైద్యులు అంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత ఒక కారణం అయ్యే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ అమ్మాయి వైద్యుల పర్యవేక్షణలో ఉంది. తల్లికి ఓదార్పు ఏమిటంటే ‘ఇవి ఎలా మొదలయ్యాయో అలాగే పోతాయి’ అని వైద్యులు చెప్పడం. అంటే ఈ బాధ ఎల్లకాలం ఉండదు అని అర్థం.

మరిన్ని వార్తలు