హమారా భారత్ మహాన్...

13 Aug, 2014 23:51 IST|Sakshi
హమారా భారత్ మహాన్...

ప్రపంచదేశాలకు భగవద్గీత రూపంలో భరోసాను అందించిన దేశం మనది... స్వేచ్ఛావాయువుల కోసం ప్రాణాలను ఒడ్డి పోరాడటం నేర్పిన భగత్‌సింగ్, మహాత్మాగాంధీల చరిత్రలను ప్రపంచానికి అందించిన దేశం మనది. ఏ మతం వారికైనా ఉన్నతపీఠం ఇచ్చి మతం కన్నా మానవత్వం గొప్పదన్న విషయాన్ని చాటుతున్న దేశం మనది...
 
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాదు కానీ... గణతంత్రదినోత్సవం సందర్భంగా  యువతలో జాతీయవాదం,  జాతీయాంశాలపై అవగాహన గురించి ఔతా్సిహ కులు కొందరు చిన్న అధ్యయనం నిర్వహించారు.  

 అత్యంత సాధారణమైన ప్రశ్నలను అడిగి.. వారి అవగాహన ఎంత? అనే అంశం గురించి అంచనా వేయడానికి ప్రయత్నించారు. ఈ అధ్యయనాన్ని వీడియో రూపంలో కూర్చి యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేశారు. విషాదకరమైన విషయం ఏమిటంటే... ఆ వీడియోలో అడిగేది ఐదో తరగతి స్థాయి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలే అయినా.. చెప్పే సమాధానాలు మాత్రం బాధను కలిగిస్తాయి!

 భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
 మన జాతీయ గీతం ఏది? ఎవరు రాశారు?
 రిపబ్లిక్ డే సందర్భంగా జాతినుద్దేశించి ఎవరు ప్రసంగిస్తారు?

 మహాత్మాగాంధీ  భారత ప్రధానమంత్రి అయ్యారా? లాంటి ప్రశ్నలు అడి గారు అధ్యయనకర్తలు.అడిగింది ఎవరినో అనామకులను కాదు. మెట్రో యూత్‌ను! స్టైల్‌కు ఐకాన్‌లలా కనిపించే యువతీ యువకులను. అయితే వాళ్లు చెప్పే సమాధానాలు మాత్రం వారి పట్ల సానుభూతి కలిగేలా ఉన్నాయి. ‘జాతీయ గీతమా? దాన్ని రవీంద్రనాథ్ ఛటోపాధ్యాయ రాశారా? ’ అనే ఎదురు ప్రశ్నలు. ‘రిపబ్లిక్‌డే రోజున.... ఐ థింక్ ...అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగిస్తారు కదా!’ అనే సందేహాలు. ‘గాంధీ... 1947లో దేశానికి ప్రధానమంత్రి అయ్యారు...’ అంటూ నమ్మకంగా చెప్పే  వారి మొహాలు కనిపిస్తాయి ఆ వీడియోలో. మన దేశానికి సంబంధించిన చాలా ప్రాథమిక విషయాలు యువతకు తెలియవనే నిజాన్ని ఆ వీడియో ద్వారా చెప్పడానికి ప్రయత్నించారు అధ్యయనకర్తలు. అందరూ అలాగే ఉంటారా?! అంటే ఔనని చెప్పలేం.
  ఇదే సమయంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఫేస్‌బుక్‌లో జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టేసుకొనేంత దేశభక్తి కూడా మనకే సొంతం.

మరి అవగాహనకూ దేశాభిమానానికీ సం బంధం లేకపోవచ్చు. అయితే కొన్నింటిపై నైనా కనీస అవగాహన కలిగి ఉండటం అవసరం. ఉద్యోగరీత్యా మరోదేశానికి వెళ్లితే అక్కడ మీ దేశం గురించి చెప్పండని ఎవరైనా అడిగితే  నీళ్లు నమలకూడదు కదా! అందుకోసమైనా కొన్ని విషయాలపై అవగాహన సంపాదించుకోవాలి.దేశానికి సంబంధించిన విషయాలపై అవగాహన అనేది కేవలం పోటీ పరీక్షలకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు. దేశ ఔన్నత్యాన్ని గురించి తెలుసుకోవడం మన  కనీస బాధ్యత. అలా తెలుసుకోవడానికి, చెప్పుకోవడానికి ఎన్నోవిషయాలున్నాయి. ఉదాహరణకు..

సంఖ్యామానానికి  ఒక రూపం ఇచ్చింది భారతీయులే. భారతీయుడైన ఆర్యభట్ట ‘సున్న’ ను ఆవిష్కరించారు.గత పదివేల సంవత్సరాల్లో ఏనాడూ కూడా భారతదేశం మరో దేశంపై దండెత్తిందీ లేదు. ఆక్రమించుకొన్నదీ లేదు. క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితమే తక్షశిల విశ్వవిద్యాలయం ఏర్పడింది. అందులో అప్పట్లోనే దాదాపు పదివేల ఐదువందల మంది విద్యార్థులు అభ్యసించేవారట. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో ఏర్పాటు చేసిన నలంద విశ్వవిద్యాలయం భారతీయ విద్యావిధానం ఎంత అమోఘమైనదో చాటి చెప్పింది.
   
 చెస్‌ను ఆవిష్కరించింది భారతదేశంలోనే. పురాతన యుద్ధవిద్య ‘చతురంగ’ ఆధారంగా చదరంగాన్ని ఆవిష్కరించారు. ప్రపంచదేశాలకు భగవద్గీత రూపంలో భరోసాను అందించి దేశం మనది... స్వేచ్ఛావాయువుల కోసం ప్రాణాలను ఒడ్డి పోరాడటం నేర్పిన భగత్‌సింగ్, మహాత్మాగాంధీల చరిత్రలను ప్రపంచానికి అందించిన దేశం మనది...  ఏ మతం వారికైనా ఉన్నతపీఠం ఇచ్చి మతం కన్నా మానవత్వం గొప్పదన్న విషయాన్ని చాటుతున్న దేశం మనది. ప్రపంచానికి ఆర్యభట్ట వంటి ఖగోళ శాస్త్రజ్ఞుడిని అందించిన దేశం మనది. అదంతా గతం అనుకొంటే... భవిష్యత్తూ ఉంది.  అయితే కొంత జడత్వమూ మన దగ్గర ఉంది. దాన్ని జయిస్తే హమారా భారత్ మహాన్ అని గర్వంగా చెప్పుకోవచ్చు.
 

మరిన్ని వార్తలు