అనారోగ్యానికి ఆనవాళ్లు... మూత్రపిండాల్లో రాళ్ళు

24 Sep, 2013 00:29 IST|Sakshi
అనారోగ్యానికి ఆనవాళ్లు... మూత్రపిండాల్లో రాళ్ళు

మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ళకు సరైన చికిత్స కనుక అందించకపోతే వాటి పనితీరు మందగించి మూత్రపిండాల వ్యాధికి కారణమవుతాయి. దానితో మూత్రపిండాల వడపోత సామర్థ్యం తగ్గి రోగి ఆరోగ్యం ఇంకా దిగజారుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా హోమియో చికిత్సను అందిస్తే కిడ్నీరాళ్ల సమస్యను నివారించవచ్చు.

కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కారణాలు: ఈ సమస్య స్త్రీ, పురుష, వయోపరిమితితో నిమిత్తం లేకుండా రావచ్చు. శారీరకశ్రమ తక్కువగా ఉండడం. రోజూ తగినంత నీళ్ళు తాగకపోవడం, గౌట్ రకం కీళ్ళవ్యాధి, వంశపారంపర్యత, స్థూలకాయం, శరీరంలో రాళ్ళు ఏర్పడే లక్షణం ఉండడం, చలికాలం, మద్యపానం ముఖ్యకారణాలు.
 
 సికెడి (దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి), పుట్టుక నుండి ఒకటే కిడ్నీ ఉండడం లేదా చిన్న కిడ్నీలు ఉండడం, పిసికెడి (పాలిసిస్టిక్ కిడ్నీ డిసీస్) లాంటి కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు తక్కుగా నీళ్ళు తాగాల్సి ఉంటుంది. అందువల్ల వీరిలో కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
 
 లక్షణాలు: మూత్రపిండాలు నడుము భాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. అందువల్ల నొప్పి ఈ ప్రాంతంలో మొదలై పొత్తికడుపు వరకు పాకుతుంది. మూత్రవిసర్జన సమయంలో నొప్పి తీవ్రత పెరుగుతుంది. మూత్రవిసర్జన తరచు చేయాల్సి రావడం, మూత్రం తక్కువ పరిమాణంలో, మంటగా రావడం, మూత్రం పసుపురంగు లేదా ఎరుపురంగులో రావడం, కడుపులో నొప్పి, వికారం, ఆకలి తగ్గిపోవడం, మలవిసర్జనకు వెళ్ళాల్సి వచ్చినట్లుండటం, తరచుగా వాంతులు అవడం, జ్వరం రావడం.
 
 రాళ్ళు ఏర్పడే ప్రదేశాలు: 1. మూత్రపిండాలు- వీటిల్లో ఒకటి కంటే ఎక్కువ రాళ్ళ పెద్ద పరిమాణంలో ఉన్నప్పుడు కిడ్నీ పనితీరుపై ప్రభావం ఏర్పడుతుంది. 2. మూత్రనాళాలు- వీటిలోని రాళ్ళు మూత్రనాళాలను మూసివేయడం ద్వారా కిడ్నీలో మూత్రం నిండిపోయి వాపు వస్తుంది. సమస్య ముదిరితే కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడం లేదా వాటి పనితీరు తగ్గడం 3. మూత్రాశయంలోని రాళ్ళు మూత్రవిసర్జనకు అడ్డురావడం వల్ల మూత్రం చుక్కలు చుక్కలుగా ఎరుపురంగులో తీవ్రమైన నొప్పి, మంటతో ఉంటుంది. 4. కొందరిలో కుడివైపు, కొందరిలో ఎడమవైపు, మరికొందరిలో రెండువైపులా స్టోన్స్ తయారవవచ్చు. ఒకటి లేదా అంత కంటే ఎక్కువరాళ్ళు ఏర్పడవచ్చు. వీటి పరిమాణం ఒకటి నుంచి 15 మి.మీ. వరుకు ఉండే అవకాశం ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటూ చికిత్స అందించడం ద్వారా మంచి ఫలితాలను అందించవచ్చు.

నిర్థారణ పరీక్షలు: సిబిపి, సియుఇ, ఇఎస్‌ఆర్, స్కాన్ అబ్డామెన్, ఎక్స్‌రే-కెయుబి, ఐఐపి, యూరియా, క్రియాటిన్ మొదలగు పరీక్షల ద్వారా రాయి పరిమాణం, అది ఏర్పడిన ప్రదేశం, మిగతా మూత్రవిసర్జన వ్యవస్థపై స్టోన్స్ ప్రభావాన్ని తెలుసుకోవడం ద్వారా సరియైన చికిత్స అందించగలం.
 
 నివారణ మార్గాలు: రోజు శారీరక వ్యాయామం, నడక ఉండడం, నాలుగు నుంచి ఐదు లీటర్ల మంచినీళ్ళు తాగడం, మద్యపానానికి దూరంగా ఉండడం, ఆక్సలేట్ ఎక్కువగా ఉండే పాలకూర, టమోటా, సోయాబీన్, చాక్లెట్‌లను వీలైనంతగా తగ్గించడం ద్వారా స్టోన్స్ సమస్య రాకుండా, పెరగకుండా నివారించవచ్చు. చిన్నపిల్లలు, ఎదిగే వయసు పిల్లలు తరచూ ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వారిలో ఆకలి తగ్గి, జీర్ణక్రియ మందగించడం, తద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదల దెబ్బతింటుంది. సమస్యను తొలిదశలో గుర్తించి, సమూలంగా వ్యాధిని నిర్మూలించే చికిత్స తీసుకోవడం ఉత్తమ మార్గం.
 
 హోమియో చికిత్స: హోమియో వైద్య విధానంలో రాళ్ళను ఆపరేషన్ అవసరం లేకుండా కరిగించడమే కాకుండా, అవి మళ్ళీ తయారవకుండా చేయగలిగే చికిత్స అందుబాటులో ఉంది. హోమియో మందులకు ఎటువంటి దుష్ర్పభావాలు ఉండకపోవడం వల్ల అన్ని వయసుల వారికి ఇది మంచి విధానం, నిపుణులైన హోమోయోకేర్ వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే ఆపరేషన్ అవసరం లేకుండా సమస్యను సమూలంగా, శాశ్వతంగా నివారించవచ్చు.
 
 డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి.,
 హోమియోకేర్ ఇంటర్నేషనల్

 

మరిన్ని వార్తలు