చర్మం కాంతివంతం ఇలా...

26 Aug, 2019 08:00 IST|Sakshi

బ్యూటిప్స్‌

తేనె, చక్కెర సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి కళ్ల చుట్టూ మినహాయించి, ముఖానికి, మెడకు పట్టించి, వలయాకారంగా మర్దన చేయాలి. ఇది చర్మానికి నునుపుదనం తీసుకురావడంతోపాటు మృతకణాలను తొలగిస్తుంది. మొటిమలతో గుంతలు పడిన చర్మానికి తరచుగా ఈ ట్రీట్‌మెంట్‌ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
రెండు టేబుల్‌స్పూన్ల టొమాటో జ్యూస్, 50 గ్రా.ల ఓట్స్, 25 గ్రా.ల పెరుగులో కప్పుడు నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గి చర్మం మృదువుగా కాంతివంతంగా కనిపిస్తుంది.
రెండు టీ స్పూన్ల క్యారెట్‌ తురుము, టీ స్పూన్‌ తేనె కలపాలి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ చేర్చి దీనితో ముఖాన్ని మృదువుగా రబ్‌ చేసి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి జీవకాంతి లభిస్తుంది.
రెండు టీ స్పూన్ల తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి అప్లై చేసి వేళ్లతో 20 నిమిషాలపాటు మృదువుగా మసాజ్‌ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా చేస్తుంటే ముఖంపైన జిడ్డు, మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది.
మూడు టీ స్పూన్ల దోసరసం, రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్‌ పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్‌ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్‌ సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది.
బంగాళదుంపని మెత్తగా ఉడకబెట్టి పొట్టు తీయకుండా మెదుపుకోవాలి. దీంట్లో పాలు, కొబ్బరి నూనె జత చేసి పేస్ట్‌లా కలపాలి. మెడపై ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మెడ మీద నలుపు తగ్గి చర్మం కాంతివంతం అవుతుంది.

మరిన్ని వార్తలు