జగనన్న ఆరోగ్యంగా ఉంటేనే... జనం చల్లగా ఉంటారు

4 Sep, 2013 00:35 IST|Sakshi
జగనన్న ఆరోగ్యంగా ఉంటేనే... జనం చల్లగా ఉంటారు

ప్రజాసంక్షేమం కోసం నిరంతరం తపించే ఒక డైనమిక్ లీడర్‌ని ప్రజల మధ్య లేకుండా నిర్బంధించడం సామాజిక నేరం. ఈ నేరానికి పాల్పడిన వారందరికీ రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన శిక్ష విధిస్తారు. జగనన్న అంటే ఎంత భయం లేకుంటే ఈ కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు ప్రజలకు ఆయన కనబడకుండా, ఆయన మాట వినబడకుండా చేస్తాయి! రాజకీయాలలో ప్రత్యర్థులను రాజకీయాలతోనే ఎదుర్కోవాలి కానీ, ఇలా వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవడం, కుటుంబాలపై పడి నోరు పారేసుకోవడం ధీరుల లక్షణం కాదు. ఆ మాట కొస్తే జగనన్న వంటి ధీరుడు ఏ పార్టీలోనైనా ఉన్నాడా? తనను విమర్శించినవారిని ఇంతవరకు ఆయన ఒక్క మాటైనా అనలేదు. తనను వేధించినవారిని దుయ్యబట్టలేదు.
 
  ఆఖరికి సీబీఐకి వ్యతిరేకంగా దురుసుగా గానీ, కోపంగా గానీ ఒక్క స్టేట్‌మెంట్ అయినా ఇవ్వలేదు. తనను ఎంతగా బాధపెట్టినప్పటికీ, ఎంతగా వేధించినప్పటికీ కాంగ్రెస్‌వారిని కానీ, తెలుగుదేశంవారిని కానీ అమర్యాదకరంగా మాట్లాడలేదు. అదీ ధీరత్వం అంటే. అదీ సంస్కారమంటే. ప్రజలకు కావలసింది కూడా ఇలాంటి ప్రజానాయకుడే కానీ, అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రజల్ని విస్మరించే రాజకీయనాయకులు కాదు. ఒక్క విషయం చెప్పమనండి... నీతులు వల్లించే ఈ నాయకులను! జగనన్నకు ఉన్నంత ప్రజాదరణ వీరికి ఎందుకు లేదు? జగనన్నను విశ్వసించినట్లుగా వీళ్లనెందుకు ప్రజలు నమ్మలేకపోతున్నారు? బయట ఉన్న నాయకులకంటే, జైల్లో ఉన్న జగనే మేలని, బయట ఉండీ వీరంతా ఇవ్వలేని భరోసా, లోపల ఉండీ ఆయన ఇవ్వగలుగుతున్నాడని ప్రజలు నేడు భావిస్తున్నారంటే అందుకు జగనన్న ఓదార్పే కారణం. కాంగ్రెస్ నుంచి ఒక్క నాయకుడైనా బాధిత కుటుంబాలను ఓదార్చడానికి వెళ్లలేదేం? ఎందుకంటే... వారికి ఓదార్చాలన్న ఆలోచన లేదు. ఒకవేళ ఓదార్చబోయినా అధిష్టానం ఏమంటుందోనన్న భయం. ఇలాంటి భయాలేవీ జగనన్నకు లేవు కాబట్టే ప్రజల మధ్యకు వెళ్లారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ప్రజలకూ అప్పుడే తెలిసింది... రాజన్న తర్వాత ప్రజల బాగోగుల్ని పట్టించుకునే నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్ ఒక్కడేనని. అందుకే జగనన్న త్వరగా విడుదల కావాలని కోరుకుంటున్నాం. ఆయన ఆరోగ్యం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాం. జగనన్న ఆరోగ్యంగా ఉంటేనే... జనం చల్లగా ఉంటారు.
 - గజ్జెల వరుణ్, రామలింగాపురం, ప్రకాశం జిల్లా

మరిన్ని వార్తలు