ఉద్యమనాయకులు సత్యపాల్, డా. సైఫుద్దీన్ల అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ అమృత్సర్(పంజాబ్)లోని జలియన్వాలాబాగ్లో వందలాదిమంది దేశభక్తులు సమావేశమయ్యారు. ఎలాంటి కవ్వింపు చర్యల్లో లేవు. ఎలాంటి హింసాత్మక సంఘటనలూ చోటు చేసుకోలేదు. అయినప్పటికీ బ్రిటిష్ వాడికి కోపం వచ్చింది. ఒంటిని రాక్షసత్వం ఆవహించింది.
జనరల్ డయ్యర్ ఆదేశాలతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న దేశభక్తులపై పదినిమిషాల పాటు విచక్షణరహితంగా కాల్పులు జరిగాయి. 370 మంది చనిపోయారని, 1200 మంది గాయపడ్డారని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి. 1000 మందికిపైగా మరణించారు. మాటలకందని ఈ విషాదం చరిత్ర పుటలపై తడి ఆరని నెత్తుటి చుక్కై మెరుస్తూనే ఉంది.