వేల ఆకాశాల సూర్యుడు

18 Apr, 2017 23:44 IST|Sakshi
వేల ఆకాశాల సూర్యుడు

ఒక ఆకాశం... ఒక సూర్యుడు...
ఇంతవరకే మనం చూసింది.
వేయి ఆకాశాలు... ఒక సూర్యుడు..
ఇప్పుడు మనం చూడబోతున్నది!
ఒక్కో ఆశా ఒక్కో ఆకాశం అనుకుంటే
వేల ఆకాశాలలో ప్రకాశిస్తున్న సూర్యుడు...
అచ్యుత సామంత!
సూర్యుడు జీవశక్తిని ప్రసాదిస్తున్నట్లే..
ఈ ఒడిశా సూర్యుడు...
వేల మంది గిరిజన బాలబాలికలకు
బతుకు శక్తిని ఇస్తున్నాడు.
చేరదీసి, ‘చదువుముద్ద’ పెట్టి...
ఆశయాల దారులు పరుస్తున్నాడు.
గిరులలో వెన్నెల్లు కురిపిస్తున్నాడు.


ఆ కుర్రాడికి అప్పటికింకా నాలుగేళ్లే. ఓ రోజు అమ్మ భోరున ఏడుస్తోంది. బంధుమిత్రులు ఓదారుస్తున్నారు. అన్న, అక్క చెల్లెళ్లు ఆరుగురూ బిత్తరపోయి చూస్తున్నారు. ఎదురుగా చలనం లేకుండా తండ్రి! ఏం జరుగుతోందో తెలియదు... ఏదో జరిగిందని మాత్రం తెలుస్తోంది. రోజులు గడిచాయి. అమ్మ పల్లెటూరికి చేరింది. తోబుట్టువులు ఒక్కొక్కరూ ఒక్కో బంధువు ఇంట్లో చేరిపోయారు. పూరి గుడిసెలో అమ్మ, తను, చిట్టి చెల్లెలు! అంతే! బడికి తీసుకెళతానన్న నాన్న ఎంతకీ రాడు. ఓ పూట తింటే ఇంకోపూట పస్తు... కట్టుకునే బట్ట అరకొరే. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితి. ఈ పరిస్థితులే... అచ్యుత సామంత మనీషిగా ఎదిగేందుకు ప్రేరణయ్యాయి. ఆ సంకల్పం ఎంత బలమైందంటే... పాతికేళ్లు తిరక్కుండానే ఒడిశాలో చదువుకు అడ్రస్‌గా మారేంత!

కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌... కుప్తంగా కిస్‌! మనలో చాలామంది ఈ పేరు కూడా విని ఉండం. కానీ ఈ దేశ రాష్ట్రపతులు మొదలుకొని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వరకూ... ముఖ్యమంత్రులు, దేశాధ్యక్షులు, సినీతారలు. క్రీడాకారులు... ఒక్కరనేమిటి... సమాజంలోని అన్ని వర్గాల వారికీ ఇప్పుడు ఇదో పర్యాటక స్థలం. చదువు అనేది పేదరిక నిర్మూలనకు ఎలా ఉపయోగపడుతుందో ఈ పాఠశాలను చూసి తెలుసుకోవాలని ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థ ప్రపంచానికి చెబుతోందంటే...ఈ పాఠశాల ప్రాముఖ్యత అర్థమవుతుంది. 1993– 94లో డాక్టర్‌ అచ్యుత సామంత స్థాపించిన ఈ విద్యాలయం ఎన్నో రకాలుగా ప్రత్యేకమైంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో గిరిజన విద్యార్థులున్న పాఠశాలగా రికార్డు సృష్టించింది ఇది. ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లలోని దాదాపు 62 గిరిజన తెగల బాలబాలికలు ఇక్కడ కేజీ నుంచి పీజీ వరకూ ఉచితంగా విద్యనభ్యసిస్తున్నారు.

దాదాపు 80 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న కిస్‌ పూర్తిగా రెసిడెన్షియల్‌ కూడా. గిరిజన భాషల్లోనే ఓనమాలు నేర్పించడంతో మొదలయ్యే కిస్‌ విద్యాభ్యాసం ఆ తరువాత నెమ్మదిగా సంప్రదాయ క్లాస్‌రూమ్‌లకు మారుతుంది. ఇందుకోసం 62 గిరిజన తెగలకు చెందిన 18 భాషల్లో ప్రత్యేకమైన సిలబస్‌ సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కలలోనైనా ఊహించలేనన్ని సౌకర్యాలు. వేళకి ఇంత అన్నం వండిపెట్టేందుకు అత్యాధునిక సౌరశక్తి, విద్యాలయం మొత్తం వెలుగులు నింపేందుకు ఎల్‌ఈడీ బల్బులు, స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రెండు ఆర్‌వో ప్లాంట్లు ఉన్నాయి దీంట్లో. పిల్లలకు జబ్బు చేస్తే వైద్యమందించేందుకు 200 పడకల ఆసుపత్రి కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పిల్లల మాసిన గుడ్డలు ఉతకడానికి అత్యాధునికమైన వాషింగ్‌ మెషీన్లు, డ్రయ్యర్లు ఉన్నాయి. ఇంకో విశేషం ఏమిటంటే... ఇక్కడ పిల్లలు తమ యూనిఫాం తామే కుట్టుకుంటారు.

చదువు నేర్చుకుంటూనే... డబ్బులు సంపాదించుకునేందుకు కూడా కిస్‌లో ఏర్పాట్లు ఉన్నాయి. పచ్చళ్ల తయారీ, సంప్రదాయ గిరిజన కళలు... పెయింటింగ్, బొమ్మల తయారీ, వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇలా తయారైన వస్తువులను మార్కెట్‌లో విక్రయించి... వచ్చిన లాభాల్లో సగం పిల్లల ఖాతాల్లో జమవేస్తారు. ఆటలకీ, క్రీడలకీ అత్యాధునికమైన ఆటస్థలం, సదుపాయాలతో పాటు ఒక జూడో శిక్షణా విభాగం కూడా ఉంది. మొత్తం పాఠశాలకీ, హాస్టలుకీ అన్నిటికీ కలిపి 1087 మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు

ఉచితం... ఎలా సాధ్యమైంది?
ఒకరా ఇద్దరా... దాదాపు పాతికవేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అంటే ఆషామాషీ కాదు కదా? బోలెడంత డబ్బు అవసరమవుతుంది. మరి అచ్యుత సామంత ఒక్కడే ఇంత మొత్తాన్ని ఎలా తెచ్చిపెట్టగలుగుతున్నాడు? అన్న ప్రశ్న వస్తే... కిస్‌ కంటే ఏడాది ముందు ప్రారంభమైన కళింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్టియ్రల్‌ టెక్నాలజీ... క్లుప్తంగా కిట్‌ గురించి చెప్పుకోవాలి. ఉత్కళ యూనివర్శిటీ నుంచి రసాయన శాస్త్రంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన తరువాత అచ్యుత సామంత కొన్నేళ్లపాటు ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశాడు. కట్టు పేదరికం నుంచి లెక్చరర్‌ స్థాయికి ఎదిగినా... జీవితం ఇక సాఫీగానే సాగిపోతుందని కచ్చితంగా తెలిసినా అచ్యుత సామంతలో ఏదో వెలితి. ఏదో చేయాలన్న తపన. ఈ ఆలోచనలతోనే చేతిలో ఉన్న ఐదువేల రూపాయల మొత్తంతో ఓ రెండు గదుల ఇల్లు అద్దెకు తీసుకున్నాడు ఆయన. వృత్తివిద్యా కోర్సులు నేర్పే కిట్‌ అందులోనే మొదలైంది.

బ్యాంకులు అప్పు ఇచ్చేందుకు నిరాకరించడంతో బంధువులు, స్నేహితుల వద్ద చేబదుళ్లు తీసుకుని కీట్‌ను నడపటం మొదలుపెట్టాడు. ఒకదశలో రూ.15 లక్షల అప్పులు చెల్లించమని అందరూ ఒత్తిడి తీసుకువస్తే చచ్చిపోదామన్న ఆలోచన కూడా అచ్యుతలో మెదిలిందట. అయితే విధి చాలా బలీయమైందని అంటారు కదా... ఓ బ్యాంకు ఈయనకు పాతిక లక్షలు అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఆ తరువాత అచ్యుత వెనుదిరిగి చూసుకోలేదు. కిట్‌ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందుకు తగ్గట్టుగానే కిట్‌ ఇప్పుడు డీమ్డ్‌ యూనివర్సిటీ స్థాయికి చేరింది. కిట్‌కు ఇప్పుడు 300 ఎకరాల విశాలమైన సొంత క్యాంపస్‌ ఉంది. దేశ విదేశాలకు చెందిన 25 వేల మంది విద్యార్థులిప్పుడు అక్కడ వేర్వేరు కోర్సులు చేస్తున్నారు. కిట్‌ విజయవంతం కావడం కిస్‌కు వరంగా మారింది. ఎందుకంటే కిట్‌లో వచ్చే ఫీజులో కొంతభాగం కిస్‌ ఫౌండేషన్‌కు వెళుతుంది. అంతేకాదు... ఇక్కడి బోధన, బోధనేతర సిబ్బంది కూడా తమ జీతాల్లోంచి నెలనెల మూడు శాతం మొత్తాన్ని కిస్‌ నిర్వహణ కోసం విరాళంగా అందజేస్తారు. యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌  తన వంతు సాయం అందిస్తూంటే... ఒడిశా ప్రభుత్వం నిరుపయోగంగా పడి ఉన్న ఇండస్టియ్రల్‌ ఎస్టేట్‌ భూముల్ని కీట్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు ఇచ్చింది.

కిట్‌... కిస్‌ రెండూ నా సంతానం..
అట్టడుగు వర్గాల పిల్లలకు విద్యనందివ్వడం... అంధుడికి చూపునివ్వడంతో సమానమని విశ్వసించే డాక్టర్‌ అచ్యుత సామంత తన జీవితాన్ని మొత్తం కిట్, కిస్‌ల కోసం ధారపోశాడంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. పెళ్లి చేసుకుంటే తన జీవితంలో కొంత సమయాన్ని కుటుంబం కోసం వెచ్చించాల్సి వస్తుందని అవివాహితుడిగానే మిగిలిపోయాడు. అంతేకాదు... తనకంటూ ఏ రకమైన ఆస్తిపాస్తులు ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే దాదాపు పదివేల కోట్ల రూపాయల విలువైన విద్యాసంస్థలకు అధిపతి అయినప్పటికీ అన్ని ఆస్తులు కిస్‌ ఫౌండేషన్‌ పేరుమీదే ఉన్నాయి. సంస్థ యజమానిగా అచ్యుత తీసుకుంటున్న గౌరవ వేతనం ఇప్పుడు నెలకు రూ.30 వేలు మాత్రమే. ఇప్పటికీ రెండు గదుల అద్దెఇంట్లో ఉంటున్నారు. అచ్యుత సామంతను మీ లక్ష్యమేమిటి? అని ఎవరైనా ప్రశ్నిస్తే... ఇంకో మూడేళ్లలో అంటే 2020 నాటికి ఒడిశాలోని 30 జిల్లాల్లో 30 కిస్‌ శాఖలను, అలాగే దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఒక్కో కిస్‌ శాఖను స్థాపించాలంటారు. మరింత మంది గిరిపుత్రులను పేదరికం ఊబి నుంచి బయటకు తీసుకురావచ్చు... అంటారాయన.
– గిళియార్‌ గోపాలకృష్ణ మయ్యా

ఉప్పుడు బియ్యం చేసి... నూక తిన్నారు!
డాక్టర్‌ అచ్యుత సామంత 1965లో జమ్‌షెడ్‌పూర్‌లో జన్మించారు. కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న తండ్రి 1969లో ఓ రైలు ప్రమాదంలో మరణించారు. తండ్రి మరణం తరువాత తల్లి స్వగ్రామమైన కటక్‌ జిల్లా కలరాబంకా వెళ్లిపోయాడు. ఊరంతా తిరిగి ఎండుటాకులు ఏరుకు రావడం... మిగిలిన సమయాల్లో ఇరుగుపొరుగు పిల్లలతో కలిసి బలాదూరు తిరగడం ఇదీ చిన్నప్పటి అచ్యుత సామంత దినచర్య. ఒక రోజు స్కూల్‌ వద్ద గోల చేస్తూ ఆడుకుంటూంటే హెడ్మాస్టర్‌ చెవి మెలేశాడు. ఆనక అచ్యుత కుటుంబం పరిస్థితి తెలుసుకుని చలించిపోయాడు. స్కూల్‌లో చేరతావా? అని అడిగి పలక బలపం కొనిచ్చి అక్షరాలు దిద్దించాడు. సాయంత్రం ఇల్లిల్లూ తిరిగి వడ్లు సేకరించడం... వాటిని ఉప్పుడు బియ్యంగా మార్చడం మొదలుపెట్టాడు. ఈ శ్రమకు కొంత కూలీ దక్కేది. నూక రూపంలో ఇంట్లోకి తిండిగింజలూ చేరేవి. కష్టాలను ఎదుర్కొంటూ ఉత్కళ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ చేశారు సామంత.

►1993– 94లో డాక్టర్‌ అచ్యుత సామంత స్థాపించిన ఈ విద్యాలయం... ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో గిరిజన విద్యార్థులున్న పాఠశాలగా రికార్డు సృష్టించింది. 62 గిరిజన తెగల బాలబాలికలు కేజీ నుంచి పీజీ వరకూ  ఉచితంగా విద్యనభ్యసిస్తున్నారు.

►ఇందులో గిరిజన భాషల్లోనే ఓనమాలు నేర్పిస్తారు. ఆ తరువాత నెమ్మదిగా సంప్రదాయ క్లాస్‌రూమ్‌లకు మారుతుంది. ఇందుకోసం 62 గిరిజన తెగలకు చెందిన 18 భాషల్లో ప్రత్యేకమైన సిలబస్‌ తయారు చేశారు.

►చదువుతోపాటు దుస్తులు కుట్టడం, పచ్చళ్ల తయారీ, పెయింటింగ్, బొమ్మల తయారీలో కూడా శిక్షణ ఇస్తారు.

►చేతిలో ఉన్న ఐదువేల రూపాయలతో రెండు గదుల ఇల్లు అద్దెకు తీసుకుని కిట్‌ను ప్రారంభించారు. బంధువులు, స్నేహితుల వద్ద చేబదుళ్లు తీసుకుని కీట్‌ను నడపటం మొదలుపెట్టాడు.

►ఒకదశలో రూ.15 లక్షల అప్పులు చెల్లించాల్సిన ఒత్తిడి తట్టుకోలేక చచ్చిపోదామనుకున్నారు. అయితే విధి చాలా బలీయమైంది. ఓ బ్యాంకు పాతిక లక్షలు అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఆ తరువాత అచ్యుత వెనుదిరిగి చూసుకోలేదు.

మరిన్ని వార్తలు