ఇదా లోకం!

3 Feb, 2018 00:17 IST|Sakshi
సనూష 

ఘటన

మలయాళీ నటి సనూషకు బుధవారం రాత్రి రైల్లో కన్నూర్‌ నుంచి తిరువనంతపురానికి ప్రయాణిస్తున్నప్పుడు ఒక చేదు అనుభవం ఎదురైంది! సమాజం మీద సనూషకు నమ్మకం పోగొట్టిన ఘటన అది! రాత్రి ఒంటిగంటప్పుడు తన పెదవులకు ఏదో తగిలినట్లనిపిస్తే చప్పున నిద్ర నుంచి లేచి చూశారు సనూష. ఒకతను ఆమెను ముద్దుపెట్టుకోబోతున్నాడు. సనూష అతని గట్టిగా పట్టుకుని, చెయ్యి మెలితిప్పుతూ, లైట్లు వేసి బోగీలోని మిగతా ప్రయాణికుల్ని అలెర్ట్‌ చేసింది. ‘ప్లీజ్‌.. దీన్ని ఇష్యూ చెయ్యకండి’’ అని అతను బతిమాలుతున్నాడు. ఇదంతా గమనిస్తూ కూడా.. బోగీలోని ఒక్కరూ సనూషకు సపోర్టుగా రాలేదు. అతడినీ ఏమీ అనలేదు! చోద్యం చూస్తున్నట్లుగా ఉండిపోయారు. సనూషతో పాటు ప్రయాణిస్తున్న రైటర్‌ ఉన్ని, రంజిత్‌ ఇంకొకతను మాత్రం అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తెల్లారే మీడియాకు ఈ విషయం చెబుతూ, సనూష ఎంతో బాధపడ్డారు.

‘‘ఇదే విషయాన్ని నేను ఫేస్‌బుక్‌లో పెట్టి ఉంటే ‘ఐయామ్‌ విత్‌ సనూష’ అని కామెంట్లు పెట్టేవాళ్లు. వాళ్ల డిస్‌ప్లే పిక్‌లను కూడా నాకు మద్దతుగా మార్చుకునేవారు. కానీ ఇదంతా సోషల్‌ మీడియా వరకేనా? నిజ జీవితంలో ఎవరూ బాధితులకు అండగా నిలబడే ధైర్యం చేయలేరా?’’ అని సనూష అన్నారు. అంతేకాదు, ‘‘రాత్రి జరిగిన ఘటన ఈ సమాజంపైన నాకు నమ్మకాన్ని పోగొట్టింది’’ అని ఆవేదన చెందారు. బోగీలో ఆమెను ముద్దుపెట్టుకోబోయిన వ్యక్తి పేరు ‘ఆంటో బోస్‌’. ‘నేను సనూష అభిమానిని’ అని పోలీసులకు చెప్పుకున్నాడు. అతడి మీద కన్నా కూడా, అతడిని చూస్తూ ఊరుకున్న వారిపైనే సనూష ఎక్కువ కోపంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు