మెడలో మంగళసూత్రం మదిలో మంగళయానం

6 Aug, 2019 08:49 IST|Sakshi
‘మిషన్‌ మంగళ్‌’ చిత్రం టీజర్‌లో అక్షయ్‌ అండ్‌ టీమ్‌ : నిత్యా మీనన్, తాప్సీ పన్నూ, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, షర్మన్‌ జోషి, కీర్తి కులకర్ణి

అబౌనెస్‌

స్త్రీ, పురుషులు ఒకర్నొకరు కో–హ్యూమన్‌గా మాత్రమే గుర్తించి గౌరవించుకునే ‘నాన్‌–జెండర్‌’ జీవులుగా పరిణామం చెందుతున్న క్రమంలో కొత్తగా ఇప్పుడు తలెత్తుతున్న కొన్ని అత్యుత్సాహ వాదనలు స్త్రీలను స్త్రీలుగా, పురుషులను పురుషులుగా వేరు చేయడంతో పాటు, స్త్రీలను మళ్లీ వాళ్లలోనే వాళ్లను అనేక వర్గాలుగా విభజించడం ద్వారా ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌కు అసలైన అర్థమేదో చెప్పేందుకు విఫలయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

అక్షయ్‌కుమార్‌ తన ఉద్విగ్న అజ్ఞానంతో భారతీయ మహిళలంతా ఒక్కటే అనేభావనను వ్యక్తీకరిస్తే, సమీరా సూద్‌ అనే కాలమిస్టు  తన ఉద్యమ జ్ఞానంతో భారతీయ మహిళల్ని హిందువులుగా, ముస్లింలుగా
వేరు చేసి చూశారు!!-
మాధవ్‌ శింగరాజు

‘స్త్రీలు సాధించారు’ అనకండి. ‘సాధించారు’ అనండి చాలు. సాధనకు స్త్రీ ఏమిటి, పురుషుడేమిటి?.. అనే వాదనలోని గొప్ప ఉద్యమ భావన..  ‘పురుషుడొచ్చి పక్కన నిలబడి చేత్తో చెయ్యెత్తించి.. అండ్‌ షీ ఈజ్‌ ద అచీవర్‌ అంటూ లోకానికి చూపిస్తేనే ఆమె ఘన విజయం సాధించినట్లవుతుందా?’ అని వాదించడంలో కనిపించదు. అదొట్టి వాదనగానో, పాయింట్‌ ఆఫ్‌ వ్యూగానో ఉండిపోతుంది. అలా ‘ఉండిపోయే’ ఒక ఆర్గ్యుమెంట్‌ను సమీరా సూద్‌ అనే కాలమిస్ట్‌ ‘ది ప్రింట్‌’ వెబ్‌సైట్‌లో ఇటీవల చేసుకొచ్చారు. బాలీవుడ్‌ చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’ ప్రోమో వీడియోలో వాయిస్‌ ఓవర్‌గా అక్షయ్‌ చెప్పిన భావ కవిత్వం మీద ఆమె ప్రధాన అభ్యంతరం. సినిమా ఈ ఆగస్టు 15న విడుదల అవుతోంది. ఆరేళ్ల క్రితం అంగారక గ్రహం మీదకు ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన ‘మంగళ్‌ యాన్‌’ ప్రాజెక్టు మీద స్టోరీ. ప్రాజెక్టు మీద కాదు, ప్రాజెక్టుకు పని చేసిన మహిళా సైంటిస్టుల ఘనత మీద. ‘‘డిటర్‌మైండ్‌గా, ఫియర్‌లెస్‌గా, ఇన్‌స్పైరింగ్‌గా మంగళ్‌యాన్‌కు పని చేసిన మహిళా సైంటిస్టులను కీర్తించడమే ఈ సినిమా’’ అని ప్రోమో వీడియోలో చాలా పొయెటిక్‌గా వెనుక ఉండి చెబుతుంటారు అక్షయ్‌. స్క్రీన్‌ మీద మహిళా సైంటిస్టులు విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ పన్నూ, నిత్యా మీనన్, కీర్తికులకర్ణి కనిపిస్తుంటారు. ‘ఆమె గాజులు విశ్వాంతరాళాల్లో «ధ్వనించాయి. ఆమె నుదుటి సిందూరం నింగిని స్పృశించింది. ఆమె  కాటుక చరిత్రను లిఖించింది.

ఆమె మెడలో మంగళసూత్రం.. ఆమె మదిలో మంగళయానం’.. ఇలా సాగుతుంది అక్షయ్‌ పొయెట్రీ. ‘‘మాటల్తో భలే అల్లాడు మన జాతీయవాద స్త్రీజన రక్షకుడు.. ప్రాథమిక పాఠశాల పిల్లల కవితల పోటీకి సరిపోతుంది’ అని సమీర తన వ్యాసంలో సెటైర్‌లు వేశారు అక్షయ్‌ మీద. ‘‘ఈ హీరో మహిళా సైంటిస్టుల గొప్పతనం గురించి చెబుతున్నారా లేక భారతీయ హైందవ వనితల మహోన్నతమైన కట్టూబొట్ల సంస్కృతిని శ్లాఘిస్తున్నారా?!’’ అని కూడా ఆమె ప్రశ్నించారు. ‘‘ఒకవేళ వీళ్లంతా బురఖా వేసుకున్న మహిళా సైంటిస్టులు అయివుంటే అక్షయ్‌ ఇదే రకమైన కవిత్వాన్ని చెప్పి ఉండేవారా.. బొట్టు, కాటుక, గాజులు, మంగళసూత్రం అంటూ..’’ అని అడిగారు. ‘‘అయినా నాకు ఈ సందేహాలన్నీ ఏమిటి? స్వాతంత్య్ర దినోత్సవం రోజు నా అభిమాన థియేటర్‌లో ఛాతీ ఉప్పొంగుతుండగా విజయగర్వంతో ఈ సినిమాను చూస్తూ కూర్చోక! సేఫ్‌ సైడ్‌గా భారత్‌ మాతాకి జై అని కూడా అంటున్నా.. అని ఆర్టికల్‌ని ముగించారు.

అక్షయ్‌ ఏం చెయ్యాలని సమీర ఉద్దేశం? అది కూడా చెప్పారు. కుంకుమ, కాటుక, తాళిబొట్టు అని కాకుండా రాకెట్‌ లాంచర్స్, ఆర్బిటర్, రోవర్, పేలోడ్స్‌ (పైకి తీసుకెళ్లే బరువులు) అనే పదాలతో మహిళల శక్తిసామర్థ్యాలను కవిత్వీకరించి ఉండాల్సిందట! సినిమా కేవలం ఇస్రో మార్స్‌ మిషన్‌ మీదనైతే అలాగే చేసి ఉండాల్సింది. మహిళా మిషన్‌ అన్నది మెయిన్‌ థీమ్‌ కాబట్టి, ఆడవాళ్లు కెరియర్‌లో ఎదగడంలో  అడ్డంకులు, అవాంతరాలు ఉంటాయి కాబట్టి ‘కో–హ్యూమన్‌’ అనే స్త్రీ, పురుష సమస్థాయిని దాటి ఎలా వాళ్ల ‘అబౌనెస్‌’ని సెలబ్రేట్‌ చెయ్యడం? మహిళను మహిళ అనడం కన్నా అబౌనెస్‌ ఏముంటుందని అనుకున్నట్లున్నారు అక్షయ్‌. ఆ ఉద్విగ్న అజ్ఞానంతో భారతీయ మహిళలంతా ఒక్కటే అనే భావనలో ఉండి ఆయన కవిత్వం రాస్తే, సమీర వచ్చి తన ఉద్యమ జ్ఞానంతో భారతీయ మహిళల్ని హిందువులుగా, ముస్లింలుగా వేరు చేసి చూశారు!

‘ది ప్రింట్‌’ సైట్‌లోనే కావేరీ బాంజాయ్‌ అనే సీనియర్‌ జర్నలిస్టు.. ‘అక్షయ్‌కి అసలు ఆడవాళ్ల మధ్య ఏం పని?’ అని చికాకు పడటం కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. ‘‘అక్షయ్‌ కుమార్‌ వచ్చి చెప్పకపోతే స్త్రీల గొప్పతనం దేశానికి తెలియదని బాలీవుడ్‌ అనుకుంటోందా! ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’లో అక్షయ్, ‘ప్యాడ్‌ మ్యాన్‌’లో అక్షయ్, ‘నామ్‌ షబానా’లో అక్షయ్, ఇప్పుడు ‘మిషన్‌ మంగళ్‌’లో అక్షయ్‌. ఈ స్త్రీల కథలన్నిటిలోనూ అక్షయ్‌ ఎందుకు ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌లా!’’ అని కావేరి అసహనం. ‘మిషన్‌ మంగళ్‌’ పోస్టర్‌ రిలీజ్‌ ఫంక్షన్‌లో కావేరిలాంటి జర్నలిస్టులు కొందరు సినిమాలోని ఉమెన్‌ టీమ్‌ని ఇదే మాట అడిగారు.. ‘ఆయనేంటి పోస్టర్‌లో మిమ్మల్నందర్నీ మింగేస్తున్నారు’ అని. ‘‘మెన్‌ ఆర్‌ ఫ్రమ్‌ మార్స్‌ కదా. అందుకు..’’ అని విద్యాబాలన్‌ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. సమీరా సూద్, కావేరీ బాంజాయ్‌ ఐదొందల పదాల్లో చేసిన ఆర్గ్యుమెంట్‌లనే బాలన్‌ నాలుగైదు పదాల్లో తేల్చేశారు. మానవుల యంత్రాలు మార్స్‌లోకి వెళ్తున్నట్లే యంత్రాల్లాంటి మగవాళ్లు (ఇన్‌సెన్సిటివ్‌ అనే అర్థంలో) మార్స్‌ దిగి వస్తున్నారు. అలవాటు లేని ‘వీనస్‌’ గ్రహంలోకి వచ్చినప్పుడు ఆడవాళ్ల మధ్యలోకి వచ్చారేమిటని వాళ్లను ఉక్కిరిబిక్కిరి చెయ్యకూడదు. ఆడవాళ్లంటే దేశ సంస్కృతీ సంప్రదాయాలేనా అని అయోమయంలోకి నెట్టేయకూడదు. ∙

మరిన్ని వార్తలు