కూలీ నెం.15

17 Nov, 2014 00:12 IST|Sakshi
కూలీ నెం.15

ఆడపిల్లలు ఇలాగే  ఉండాలి! ఈ పనులే చేయాలి! తరతరాలుగా ఈ మాటలు వింటూనే ఉన్నాం. ఆ ప్రకారం నడచుకుంటూనే ఉన్నాం. కానీ తరం మారింది. అవసరాలు మారుతున్నాయి. మరి ఆలోచనలూ మారాలి కదా! ఇదే ప్రశ్న వేసుకుంది మంజూదేవి. అనుకోకుండా జరిగిన ఓ సంఘటన తన జీవితాన్ని అల్లకల్లోలం చేస్తే... తప్పనిసరి పరిస్థితుల్లో సాహసోపేతమైన ఓ అడుగు వేసింది. ఏ మహిళా చేయని, చేయడానికి సాహసించని వృత్తిలో అడుగుపెట్టింది. దానిని సమర్థంగా నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఎంతోమందికి ప్రేరణగా, స్ఫూర్తిగా నిలుస్తోంది!
 
మంజూదేవికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. తన సంపాదనతో వాళ్లని చదివిస్తోంది. ఆమె అంటుంది... ‘ఎవరో ఆదుకోవాలని ఎదురు చూడటం కంటే... గౌరవంగా మనకు తోచిన పని మనం చేసుకోవడం ఉత్తమం’ అని!
 
జైపూర్ రైల్వేస్టేషన్‌కి వెళ్లినవాళ్లకు ఓ అరుదైన దృశ్యం కనబడుతుంది. ఎర్రటి చొక్కాలు వేసుకుని, బ్యాడ్జిలు పెట్టుకుని, వరుసగా ఉన్న కూలీల మధ్య ఓ యువతి కనిపిస్తుంది. ఆమె వేసుకున్న దుస్తులు ఆమె కూడా రైల్వే కూలీ అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నా... నమ్మడానికి మాత్రం మన కళ్లు, మనసు ససేమిరా అంటాయి. ఎందుకంటే... కూలీ అంటే మనకు తెలిసి మగవాళ్లే. రైల్వేస్టేషన్లో, బస్టాపుల్లో లగేజీలు మోసేది వాళ్లే.

అలాంటిది ఓ ఆడమనిషి ఆ పని చేస్తోందంటే ఆశ్చర్యం వేయక మానదు. పాపం ఎంత కష్టం వచ్చిందో అని జాలి వేయకా మానదు. నిజమే... ఆమెకి చాలా పెద్ద కష్టం వచ్చింది. అందుకే మహిళలు కలలో కూడా ఊహించని ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. సున్నితమైన చేతులతో బరువులు ఎత్తాల్సి వస్తోంది. ఆమె పేరు మంజూదేవి. జైపూర్‌లోనే కాదు... నార్త్ వెస్టర్న్ రైల్వేస్‌లోనే మొట్టమొదటి మహిళా కూలీ!

విధిరాతకు తలవంచి...
జైపూర్‌లోని సుందర్‌పురాలో భర్త, ముగ్గురు పిల్లలతో జీవించేది ముప్ఫై నాలుగేళ్ల మంజూదేవి. పూలపానుపు లాంటి జీవితం కాకపోయినా... కడుపు నిండా తిండి, కట్టుకోవడానికి బట్టకు లోటు లేదు. ఉన్నదానితో తృప్తిపడే తత్వం ఆమెని ఏనాడూ దిగులు పడనివ్వనూ లేదు. మంజు భర్త మహదేవ్ జైపూర్ రైల్వేస్టేషన్లో కూలీ. సరిపడానే సంపాదించేవాడు. దాంతో కుటుంబం బాగానే గడిచిపోయేది. అయితే విధి వక్రించడంతో వారి జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.

మహదేవ్ కాలేయ వ్యాధితో హఠాత్తుగా కన్నుమూశాడు. దాంతో బతుకంతా అంధకారమైపోయింది మంజుకి. సంపాదించే భర్త లేడు. తనకేమో సంపాదించే మార్గాలే తెలియదు. పిల్లలదేమో పరిస్థితులు అర్థం చేసుకునే వయసు కాదు. ఇప్పుడేం చేయాలి? తనలో తనే కుమిలిపోయింది. అప్పుడే ఆమెకు ఎవరో సలహా ఇచ్చారు... మీ ఆయన పని నీకిస్తారేమో అడుగు అని! ప్రాణం లేచొచ్చింది మంజుకి. భవిష్యత్తు మీద చిన్న ఆశ చిగురించింది.

తన భర్త స్నేహితులతో కలిసి పోర్టర్ యూనియన్‌ని సంప్రదించింది. వారి సాయంతో ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది. మంజుకి ఉద్యోగమివ్వడానికి వారికి పెద్ద అభ్యంతరాలేమీ కనిపించలేదు. దాంతో భర్త స్థానం మంజుకి దక్కింది. అతడు ధరించిన బ్యాడ్జి ఆమె చేతిమీదికి చేరింది. దానిమీద రాసివున్న ‘పోర్టర్ నంబర్ 15’ అన్న అక్షరాలు చూసినప్పుడల్లా... భర్త జ్ఞాపకం వచ్చి కళ్లు చెమ్మగిల్లుతాయి మంజుకి. ‘నా భర్త ఈ రూపంలో నాకు అండగా ఉన్నాడు’ అంటుంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో!
 
అయితే తొలినాళ్లలో ఆమె పని చేసినదాని కంటే ఏడుస్తూ గడిపిందే ఎక్కువ. అంతమంది మగవారి మధ్య కూర్చోవడం, తన వంతు కోసం ఎదురు చూడటం నరకంలా అనిపించేదామెకి. పైగా అందరూ తనని వింతగా చూస్తుంటే సిగ్గుతో చితికిపోయేది. దుఃఖాన్ని అదిమిపెట్టుకుని మౌనంగా చూస్తూ ఉండేది. సాయంత్రం ఇంటికి వెళ్లాక వెక్కి వెక్కి ఏడ్చేది. అలా చాలా రోజులు గడిపింది. అయితే ఓసారి మంజుని చూడటానికి వచ్చిన ఆమె తల్లి ఓ మాట చెప్పింది. ‘‘ఒక పని చేయడానికి సిద్ధపడిన తర్వాత దానిలోని మంచి చెడులను ఎదుర్కోవడానికీ  సిద్ధపడాలి. విధి నీకు అన్యాయం చేసింది. నువ్వు నీ పిల్లలకు అన్యాయం చేయకు’ అని. ఆ మాటలు మంజుని ఆలోచింపజేశాయి. ఆ క్షణమే నిర్ణయించుకుంది... తన పిల్లలను పెంచుకోవడానికి దొరికిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని!
 
మగవారికి దీటుగా...
కూలీగా పని చేయాలనుకోవడం సులభమే. కానీ చేయడం మాత్రం చాలా కష్టం. ఆ సంగతి పనిలో చేరిన కొన్ని రోజులకే తెలిసివచ్చింది మంజుకి. చిన్న చిన్న సూట్‌కేసులు కూడా ఎత్తలేక తూలిపోయేది. ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు వాటిని చక్రాలబండి మీద వేసి లాక్కెళ్లడానికి కూడా ఆమె బలం సరి పోయేది కాదు. ఆమె అవస్థ చూడలేక ఒక్కోసారి తోటి కూలీలు వచ్చి సహకరించేవారు. అది ఆమెకు చాలా సంతోషమనిపించేది. వారితో పని చేయడానికి తనే అనవసరంగా మొహమాటపడుతున్నాను, వాళ్లు మంచి మనసున్నవాళ్లు అని అర్థం చేసుకుంది. ‘అన్నా..’ అంటూ అందరితో స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది. పని సులభంగా చేసే మెళకువల్ని వాళ్ల దగ్గర నేర్చుకుంది. ఆ వాతావరణానికి అలవాటు పడింది. వారికి దీటుగా పనిచేసే స్థితికి చేరుకుంది.
 
ఇప్పుడు జైపూర్ రైల్వేస్టేషన్‌కి మంజు ఓ పెద్ద అట్రాక్షన్. ఆమె అంటే అక్కడి కూలీలకే కాదు, దుకాణదారులకి కూడా చాలా ఇష్టం, గౌరవం. అందరూ బెహన్ (సోదరి) అంటూ ప్రేమగా మాట్లాడుతుంటారు ఆమెతో. అయితే ఇప్పటికీ కొందరు ప్రయాణికులు మాత్రం ఆడమనిషి పోర్టరేంటి అని ముఖమ్మీదే జోకులేస్తుంటారు. నువ్వేం మోయగలవు అంటుంటారు.

అలాంటప్పుడు ఏమీ మాట్లాడదు మంజు. నవ్వుతూ తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడర్థమయ్యిందా చేయగలనో లేదో అన్నట్టుగా చూస్తుంది. నిజమే... చేయాలి అనుకోవాలేగానీ చేయలేనిది ఏదీ లేదు. పనికి పురుషుడు, స్త్రీ అన్న తేడా లేదు. శారీరక బలానికి ఆత్మబలం తోడైతే... మనల్ని ఆపగలిగే శక్తి దేనికీ ఉండదు. ఆ విషయాన్ని మంజు నిరూపించి చూపించింది!
     - సమీర నేలపూడి

మరిన్ని వార్తలు