పండ్లు, పాలు వద్దని మారాం చేస్తున్నారా?

6 Dec, 2019 00:23 IST|Sakshi

కేరెంటింగ్‌

దాదాపు ఐదేళ్ల నుంచి పదిహేనేళ్ల వరకు పిల్లలు కూరగాయలు, పండ్లు, పాలు తీసుకోడానికి ఇష్టపడకపోవడం చాలా సాధారణం. ఇలాంటి ఫిర్యాదులు దాదాపు ప్రతి తల్లి నుంచి వస్తూనే ఉంటాయి. పిల్లలు అలా పౌష్టికాహారం  తిసుకోకుండా, పాలు తాగకుండా మారాం చేస్తుంటే... ఈ కింది సూచనలు పాటించండి. ఉదాహరణకు పిల్లలు పండ్లు తినడానికి ఇష్టపడకపోతే...  రకరకాల పండ్లను కట్‌ చేసి ఫ్రూట్‌ సలాడ్స్‌గా ఇవ్వడమో లేదా కస్టర్డ్‌తో కలిపి పెట్టడమో చేయండి. కొన్ని సందర్భాల్లో పండ్లను జ్యూస్‌గా తీసి ఇవ్వవచ్చు. కాకపోతే పిల్లలకు జ్యూస్‌ చేసి ఇవ్వడం కంటే వాళ్లంతట వాళ్లే కొరికి తినేలా పండ్లు ఇవ్వడమే మంచిది. ఇక పిల్లలు పాలు తాగకపోతే మిల్క్‌షేక్‌ రూపంలో ఇవ్వండి. పాలతో తయారైన స్వీట్లు పెట్టండి.

అలాగే చాలామంది పిల్లలు కూరగాయలను ఇష్టపడరు. ఒకవేళ వారు కూరగాయలు తినకపోతే... వెజిటెబుల్‌ ఆమ్లెట్, గ్రిల్డ్‌ వెజిటెబుల్‌ శాండ్‌విచ్‌... ఇలా రకరకాలుగా ఇవ్వండి. ఒకవేళ వాళ్లు నూడుల్స్‌ ఇష్టంగా తింటుంటే, వాటికే రకరకాల కూరల ముక్కలు కలిపి తయారు చేయండి. ఎదిగే పిల్లలకు మాంసాహారం, చేపలూ (తినేవారైతే), లెగ్యూమ్స్‌ (పప్పులు / దాల్స్‌), బాదాం, జీడిపప్పు, వాల్‌నట్‌ వంటి నట్స్‌ తప్పక ఇవ్వాలి. వల్ల వాటిలో ప్రోటీన్స్, విటమిన్స్‌ ఎక్కువగా ఉంటాయి. దాంతో ఆ వయసు పిల్లలకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అలాగే పిల్లలు కాస్త పెద్దయాక ఆటల రూపంలో వాళ్లకు మంచి వ్యాయామం అందేలా తల్లిదండ్రులు తప్పక చూడాలి.

మరిన్ని వార్తలు