అమ్మ పాల బ్యాంకుతో అభాగ్యులకు పునర్జన్మ

31 Jul, 2014 23:39 IST|Sakshi

రాజస్థాన్ రాష్ట్రంలో సాధారణమైన ఒక మారుమూల గ్రామం అది. ఆ ఊళ్లో గౌరీమీనా అంతకంటే సాధారణమైన మహిళ. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం కుదరని కుటుంబ నేపథ్యం. నెలలు నిండి మగపిల్లాడిని ప్రసవించింది.  కానీ ఒక కేజీ రెండు వందల గ్రాముల బరువున్న బలహీనమైన బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఈ బిడ్డను బతికించుకునేదెలా అని మీనాతోపాటు ఆమె భర్త దేవీలాల్‌కి కూడా భయం పట్టుకుంది. స్థానిక వైద్యుని సలహాతో బిడ్డను తీసుకుని ఉదయ్‌పూర్‌కు పరుగులు పెట్టారు.
 
ఉదయ్‌పూర్‌లోని మహారాణా భోపాల్ జనరల్ హాస్పిటల్‌లో వైద్యుని ముందు నిలబడి ఉన్నారు దంపతులిద్దరూ. బిడ్డను పరీక్షించిన డాక్టరు మీనా, దేవీలాల్ వైపు సాలోచనగా చూశాడు. పుట్టీ పుట్టగానే బిడ్డపై ఇన్‌ఫెక్షన్ దాడి చేసింది. దానికి యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయాలి. ఆ చికిత్సను తట్టుకోవాలంటే ముందు బిడ్డ శక్తిని పుంజుకోవాలి. ఈ స్థితిలో బిడ్డను కాపాడగలిగింది తల్లి పాలలోని గ్రోత్ హార్మోన్స్ మాత్రమే. పోషకాహార లోపం కారణంగా మీనాకు పాలు పడలేదు. ఏదో అద్భుతం జరిగితే తప్ప తన బిడ్డ దక్కడని బిడ్డను ఒడిలో పెట్టుకుని కళ్లనీళ్ల పర్యంతమైంది మీనా.
 
ఆ అద్భుతం తల్లి పాల బ్యాంకు రూపంలో ఉందని ధైర్యం చెప్పి నగరంలోని దివ్య మదర్ మిల్క్ బ్యాంకుకు సమాచారం అందించారు డాక్టర్. తమ బిడ్డల కడుపు నిండిన తర్వాత ఇంకా మిగిలి ఉన్న పాలను పాలకు నోచుకోని బిడ్డలకు ఇచ్చే ప్రక్రియ ఇది. గత ఏడాది ఏప్రిల్‌లో ఉదయ్‌పూర్‌లోని ‘మా భగవతీ వికాస్ సంస్థాన్’ అనే ధార్మిక సంస్థ తల్లి పాల బ్యాంకును స్థాపించింది. ఇప్పటికి 660 మంది పాలిచ్చే తల్లులు పేరు నమోదు చేసుకున్నారు. వీరిచ్చే పాలతో ఉదయ్‌పూర్ హాస్పిటళ్లలోని నియో నేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న మీనా బిడ్డలాంటి 450 మంది పిల్లల ప్రాణాలు నిలిచాయి.
 
ఆరోగ్యవంతుడైన బిడ్డతో తమ ఊరికి బయలుదేరారు దేవీలాల్, మీనా దంపతులు. తమాషా ఏమిటంటే... తనకు ఇంకో బిడ్డ పుడితే. ఆ బిడ్డతో పాటు మరో బిడ్డకు కూడా పాలిస్తానని చెప్పింది మీనా.
 

(ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవం )
 

మరిన్ని వార్తలు