బంతి చాటు వల!

19 Feb, 2014 23:10 IST|Sakshi
బంతి చాటు వల!

ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్ టికెట్లు ఉచితం...
 అమితాబ్ బచ్చన్ మృతి... ఇదిగో వార్త, వీడియో లింక్!
 లాటరీ కొట్టేశారు... నగదు అందుకోవాలంటే...?
 ఇలాంటి ఫేస్‌బుక్ పోస్టింగ్స్, ఈమెయిళ్లు ఈమధ్య తరచూ కనబడుతున్నాయా? ఆసక్తి కొద్దో.. ఆశకొద్దో లింక్‌లు ఓపెన్ చేస్తున్నారా? అయితే మీరు హ్యాకర్ వలలో చిక్కినట్లే. హ్యాకర్ల గురించి, సైబర్ నేరాల గురించి కొత్తగా చెప్పేందుకు ఏమీ లేకపోదు. కానీ.. జూన్‌లో జరగనున్న ప్రపంచకప్ సాకర్ పోటీల నేపథ్యంలో వారు కొత్త కొత్త ఐడియాలు, ట్రిక్కులతో మిమ్మల్ని వలలో వేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ప్రఖ్యాత ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థలు సెమాంటిక్, నార్టన్ చెబుతున్నదాని ప్రకారం.. ఉచిత టికెట్లు, లాటరీల ముసుగులో ఇటీవలి కాలంలో హ్యాకర్ల విజృంభణ ప్రారంభమైంది. కాబట్టి జర జాగ్రత్త!

 
దేశంలో ఫుట్‌బాల్‌పై ఆసక్తి తక్కువే కావచ్చుగానీ.. పాశ్చాత్యదేశాల్లో ఈ ఆటకున్న క్రేజ్ అంతా యిఇంతా కాదు. దీన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు రకరకాల మోసాలకు పాల్పడే అవకాశముంది. వీరి బుట్టలో పడితే... మీ బ్యాంక్ అకౌంట్లలోని డబ్బు మాయమైపోవచ్చు... లేదా వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని ఇతరులు దొంగిలించవచ్చు. ఇదీకాదంటే.. మీ కంప్యూటర్/స్మార్ట్‌ఫోన్లలో మాల్‌వేర్ చేరిపోయి... మిమ్మల్ని సతాయించవచ్చు. ఇప్పటికే ఇలాంటి మోసాలకు తోడ్పడే మెయిళ్లు నెట్‌లో షికార్లు చేస్తున్నాయని బ్యాంకింగ్ సర్వీసుల పేర్లతోనూ లింక్‌లు నెట్‌నిండా కనిపిస్తున్నాయని సెమాంటిక్ సెక్యూరిటీస్ గుర్తించింది.
 
 'You are the winner of a pair of tickets to the FIFA World cup 2014 Brazil!'.
 "To promote World Cup 2014, you must register to compete for prizes worth 20 thousand Reais on behalf of CIELO a Brazilian credit and debit card operator". లాంటి శీర్షికలతో ఈ మెయిళ్లు/లింకులు కనిపిస్తే వాటిని తెరవవద్దని హెచ్చరిస్తోంది.
 
 రెస్ట్ ఇన్ పీస్ స్కామ్!

 అకస్మాత్తుగా ‘అమితాబ్ బచ్చన్ మృతి.. వీడియో లింక్’ అన్న శీర్షికతో ఫేస్‌బుక్‌లో పోస్టింగ్ కనిపించిందనుకోండి... ఏం చేస్తారు? ముందు వెనుకలు ఆలోచించకుండా... మరింత సమాచారం తెలుసుకునేందుకు, లేదా వీడియో చూసేందుకు లింక్‌ను క్లిక్ చేస్తారు. అదికాస్తా ప్రకటనలకు, లేదా సర్వేల సైట్లకు దారితీస్తుంది. ఎంత ఎక్కువ మంది క్లిక్ చేస్తే స్పామర్/హ్యాకర్‌కు అంత డబ్బు అన్నమాట. ఈ క్రమంలో మీ వ్యక్తిగత, ఇష్టాయిష్టాల సమాచారం ఇతరులకు తెలిసిపోతుందన్నమాట. నార్టన్ సంస్థ అంచనాల ప్రకారం... సైబర్ మోసాలకు బలయ్యే వాళ్లు భారత్‌లో ఎక్కువ. ర్యాన్‌సమ్ వేర్, ఐడెంటిటీ థెఫ్ట్ మోసాలకు 11 శాతం చొప్పున, ఫిషింగ్‌కు 9 శాతం మంది బలవుతున్నారు.
 
 ఇలా చేయండి...

 సోషల్ మీడియా వెబ్‌సైట్లలో వచ్చే సంచలనాత్మక కథనాలను చదివే విషయంలో జాగ్రత్తగా ఉండండి.
     
 ఎన్నడూ వినని, కనని వెబ్‌సైట్ల నుంచి ప్లగ్‌ఇన్స్ లేదా ఇతర టూల్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవద్దు.
     
 వెరిఫికేషన్ సర్వేల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
     
 గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దు
     
 పీసీ/స్మార్ట్‌ఫోన్‌ల సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి.
     
 యాంటీస్పామ్ సిగ్నేచర్ల అప్‌డేషన్ కూడా అవసరమని గుర్తుంచుకోండి.
 

మరిన్ని వార్తలు