అదే రోజు... అదే రైలు...

13 Feb, 2014 23:42 IST|Sakshi

రెండుసార్లు అమెరికా అధ్యక్షునిగా ఎన్నికై, ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేశారు అబ్రహం లింకన్. 1865 ఏప్రిల్ 15న తుపాకీ తూటాలకు బలయ్యారు. లింకన్ దేహాన్ని వాషింగ్టన్ డీసీ నుంచి ఆయన ఇల్లు ఉన్న స్ప్రింగ్ ఫీల్డ్ (ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఉంది)కు తరలించడానికి ఓ ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. రైలు వాషింగ్టన్ డీసీకి, స్ప్రింగ్‌ఫీల్డ్‌కి మధ్యలో పోకప్సీ రైల్వేస్టేషన్‌లో ఆగింది. ఆ రోజు ఏప్రిల్ 29. లింకన్ మృతదేహాన్ని స్ప్రింగ్ ఫీల్డ్‌లోని ఓక్‌రిడ్జ్ శ్మశానంలో అంత్యక్రియలు చేశారు.

మరుసటేడు అదే రోజు రాత్రి... అదే రైలు.. పువ్వులతో అలంకరించిన అదే రైలులో.. లింకన్ మృతదేహం... ఇది కలా.. నిజమా! చూస్తుండగానే రైలు వెళ్లిపోయింది. మరుసటి ఉదయం ఈ వార్త అమెరికా అంతటా పాకిపోయింది. మరునాడు చాలా మంది రైలు వస్తుందేమోనని చూశారు. కానీ రాలేదు. కానీ మరుసటి ఏడు ఏప్రిల్ 29న అదే రైలు మళ్లీ వచ్చిందట. ఇప్పటికీ అదే రోజున లింకన్ రైలు వస్తోందట.

ఇప్పటికీ ఏప్రిల్ 29 నాటి అర్ధరాత్రి లింకన్ రైలును చూడటానికి వెళ్తున్నవాళ్లూ ఉన్నారు. దాన్ని చూశామని కొందరు నమ్మకంగా చెబుతున్నారు. అది వారి భ్రమో లేక నిజమో! ఈసారి మీరు అదేసమయానికి పోకప్సీ రైల్వేస్టేషన్ వెళితే మాత్రం లింకన్ రైలు గురించి వాకబు చేయడం మర్చిపోకండి.
 

మరిన్ని వార్తలు